Dec 04,2022 07:50
  • ఆహార ఉత్పత్తులకు తగ్గిన గిరాకీ
  • ద్రవ్యోల్బణ సవాళ్లే కారణమంటున్న నిపుణులు

ముంబయి : బియ్యం, పాలు, పళ్ళు, కూరగాయలు, సోడా, సాధారణ మందులు వంటి వేగంగా అమ్ముడయ్యే వస్తువుల(ఎఫ్‌ఎంసిజి)కు గ్రామీణ ప్రాంతాల్లో నవంబరు మాసంలో డిమాండ్‌ తగ్గింది. పండుగల సీజను ముగిసిన తర్వాత ప్రజల్లో అంత ఊపు, ఉత్సాహం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో కూడా డిమాండ్‌ కొంత మేర దెబ్బతింది. అయితే, నెలవారీ ప్రాతిపదికన చూసినట్లైతే గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ వినిమయ క్షీణత బాగా ఎక్కువగా వుంది.
         అక్టోబరు మాసంతో పోల్చినట్లైతే నవంబరులో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ 17శాతం తగ్గగా, పట్టణ ప్రాంత డిమాండ్‌ 10.1శాతం తగ్గిందని రిటైల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫారం బిజోమ్‌ డేటా తెలియజేసింది. మొత్తమ్మీద, భారతదేశంలో ఎఫ్‌ఎంసిజి విక్రయాలు 15.3శాతం తగ్గగా, గత ఏడాదితో పోల్చి చూసినట్లైతే 2.7శాతం తగ్గాయి.
            ''కిరాణా దుకాణాల్లో నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో నెలవారీ ప్రాతిపదికన చూసినట్లైతే నవంబరులో ఎఫ్‌ఎంసిజి విక్రయాలు క్షీణించాయి. పండుగల తర్వాత వినిమయం మందగించడంతో వార్షిక విక్రయాలు కూడా సన్నగిల్లాయి.'' అని బిజోమ్‌లో గ్రోత్‌ అండ్‌ ఇన్‌సైట్స్‌ చీఫ్‌ అక్షరు డిసౌజా తెలిపారు. ''పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంత డిమాండ్‌ బాగా తగ్గింది. ఈ పరిస్థితి మొత్తంగా ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తుల వినిమయం, వృద్ధిని ప్రభావితం చేస్తోంది. వినియోగ దారులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు చేస్తున్నందున ద్రవ్యోల్బణ సవాళ్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది.'' అని డిసౌజా పేర్కొన్నారు.
         కేటగిరీల వారీగా చూసినట్లైతే బియ్యం, గోధుమ పిండి వంటి ప్యాకేజ్డ్‌ ఆహార వస్తువుల డిమాండ్‌ 23.7శాతం తగ్గగా, శీతల పానీయాలు కూడా నెలవారీ ప్రాతిపదికన చూస్తే విలువ పరంగా 13.7శాతం తగ్గాయి. అయితే, వ్యక్తిగత సంరక్షణ కేటగిరీ మాత్రం 3.9శాతం చొప్పున వృద్ధి రేటును నమోదు చేసింది.
          నవంబరులో ముఖ్యంగా ఖాద్య తైలాల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని డిసౌజా పేర్కొన్నారు. శీతాకాలం సమీపిస్తున్నందున చర్మ సంరక్షణ ఉత్పత్తులు, హీటర్ల వంటి వాటికి డిమాండ్‌ బాగా వుందన్నారు.
         అదానీ విల్మర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అంగ్షు మాలిక్‌ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై తీవ్ర ఒత్తిడి వుందని, ''నేను ఊహించినట్లుగా గ్రామీణ ప్రాంత డిమాండ్‌ పుంజుకోవడం లేదు. పంట దిగుబడుల నుండి రావాల్సిన ఆదాయాలు ఇంకా ప్రజల చేతుల్లోకి రాలేదని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఏడాది దిగుబడి ఆలస్యమైంది. డిసెంబరు నుండి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పుంజుకునే అవకాశం వుందని భావిస్తున్నా'' అని అన్నారు.