
ప్రతాప్ఘర్ : రాజస్థాన్లో ప్రతాప్ఘర్ జిల్లాలో శనివారం ఉయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 17 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 41 మంది ప్రయాణీకులున్నారు. వీళ్లంతా లంబా, దబ్రా, కటారాన్ కా ఖేరాల గ్రామాలకు చెందినవారు. ఈరోజు తెల్లవారుజామున సన్వాలియాజీ, షానీ మహరాజ్లను సందర్శించడానికి బస్సులో బయలుదేరారు. అయితే నేషనల్ హైవేపై వెళుతున్న ట్రాలీని బస్సు ఓవర్టేక్ చేయిబోయి.. ప్రమాదవశాత్తు సోహగ్పూర్లో ట్రాలీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని నలుగురు ప్రయాణీకులు అక్కడిక్కడే మృతి చెందారు. దాదాపు 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనపై ప్రతాప్ఘర్ జిల్లా కలెక్టర్ ఇంద్రజిత్ యాదవ్ మాట్లాడుతూ.. 'ఈ ప్రమాదంలో గాయాలైనవారికి వైద్య బృందం చికిత్సనందిస్తోంది. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. నేను, ఎస్పీ క్షతగాత్రుల్ని పరామర్శించాము. ఈ ఘటనకు సంబంధించి విచారణ తర్వాతే మరిన్ని వివరాలు తెలుస్తాయి.' అని ఆయన అన్నారు.
కాగా ఈ ఘటనపై జీవన్లాల్ అనే ఓ గ్రామ సర్పంచి మాట్లాడుతూ.. 'ఈరోజు ఉదయం 4.30 గంటలకి బయలుదేరిన బస్సు కొద్దిసేపటికే నేషనల్ హైవే 56పై ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వమే ఆర్థిక సాయాన్నందించాలి.' అని కోరారు.