
సాపుతారా సుందర ప్రదేశం. నవాగాం ఆదివాసులు లేని ఆ సుందరత అసంపూర్ణం. నవాగాంలో ఎక్కువగా గుడిసెలే. ఆ గ్రామానికి ఎదురుగా ఉన్నకొండ సగం గుజరాత్లో, సగం మహారాష్ట్రలో ఉంది. కొండ మీది దేవాలయం ప్రధాన పర్యాటక దర్శనాస్థలం. గుజరాత్ ప్రచారకర్త అమితాబ్ బచ్చన్ ప్రకటించినట్లు నవాగాం దీనులతో మాట్లాడేందుకు నిజంగానే ఎవరూ లేరు...మేఘాలు తప్ప.
గుజరాత్ దక్షిణ ప్రాంత డాంగ్ జిల్లాలో అడవులు, కొండలు, నదులు ఉన్నాయి. ఆ జిల్లా...సాపుతారా పర్వత కేంద్రంతోనే గుర్తింపు పొందింది. సూరత్, నాసిక్ లాంటి సంపన్న నగరాల పర్యాటకులు ఇక్కడికి వినోద విహార యాత్రలకు వస్తారు. గుజరాత్ సాపుతారా పర్వత కేంద్రంలో మేఘాలు తప్ప మాట్లాడే నాథుడుండడని గుజరాత్ టూరిజం ప్రకటనలో అమితాబ్ బచ్చన్ ఆహ్లాదంగా వ్యాఖ్యానిస్తారు. 2017 సెప్టెంబర్లో గుజరాత్ పర్యాటక శాఖ పాత్రికేయులకు సాపుతారా యాత్ర ఏర్పాటు చేసింది. ఆ పర్వత కేంద్ర ''అభివద్ధి''ని పత్రికలు కథనీకరించాలని ప్రభుత్వ ఉద్దేశం. ఐతే ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవాగాం కు పత్రికలవారిని తీసుకెళ్ళలేదు. సాపుతారా ''ప్రగతి'' దుష్ప్రభావాల దుర్గంధం అక్కడి గాలి నిండా వ్యాపించి ఉంది మరి. అప్పటికి ఇప్పటికి వారి పరిస్థితిలో పిసరంత మార్పు లేదు.
నవాగాం, మహారాష్ట్ర సరిహద్దు గ్రామం. ఇక్కడ 270 ఇళ్ళున్నాయి. 1500 మంది జనాభా. వీరికి ఆధార్, రేషన్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలు లేవు. వాళ్ళుంటున్న ఇళ్ళు వాళ్ళవి కావు. వీళ్ళ పెద్దలు సాపుతారా ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఆ పర్వత ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి 1970లో వారిని అక్కడి నుండి తొలగించారు. వారి కొత్త స్థావరమే నవాగాం. అక్కడ అప్పుడిచ్చిన గుడిసెలపై యాజమాన్య హక్కు కోసం 52 ఏళ్ళ నుండి వారు పోరాడుతూనే ఉన్నారు. 1989లో సాపుతారా, నవాగాంలను నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించారు. ఇది ఏ పంచాయతీ పరిధి లోకి రాదు. పంచాయతీలకు వర్తించే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు, బ్యాంకు అప్పులకు ఇక్కడి ప్రజలు అనర్హులు. నోటిఫైడ్ ప్రాంతాలు స్థానిక సంస్థల్లో భాగం కాదు. ఇవి ప్రభుత్వ ప్రాముఖ్య ప్రాంతాలుగా పరిగణించబడతాయి. గుజరాత్ పర్యాటక శాఖ ప్రకటనల్లో మాత్రం సాపుతారా ప్రకాశిస్తున్న నక్షత్రం లాంటిది. అక్కడ ఒకనాడు వ్యవసాయంతో ప్రజలకు అన్నం పెట్టిన ఆదివాసీల జీవితాలు, నేడు పర్యాటకుల దయాదాక్షిణ్యాల మీద, వారికి ఈ గిరిజనులు అందించే సేవల మీద ఆధారపడి ఉన్నాయి. సాపుతారాలో సరస్సులు, వెలుగులీనే నక్షత్రాల హోటళ్ళ దగ్గరే ఈ కష్టజీవుల చీకటి జైళ్లున్నాయి. ఈ బందిఖానాలలో నవాగాం వాసులు టీ, పావ్ భాజీ, వడలు, పకోడీలు, బంగాళాదుంపల బజ్జీలు అమ్ముకుంటూనో....కూలీలు, ఆవుల కాపరులుగానో బతుకుతున్నారు. ఈ పనులకూ బయటివారి పోటీ పెరిగింది. 'ఈ తినుబండారాలు చేయడం మాకు వచ్చేది కాదు. మా పూర్వీకులు కందమూలాలు, అడవుల్లో దొరికే పండ్లు, కూరగాయలు తినేవారు. బతకడానికి మేము ఈ వంటలు చేస్తున్నాం' అని అక్కడ నివసించే నాందేవ్ అంటున్నాడు. 80 శాతం నవాగాం వాసులు ఈ పనే చేస్తారని, మిగిలినవారు కూలి చేసుకొని బతుకుతారని నవాగాం వాసి రామచంద్ర హడస్ వివరించాడు. నవాగాం వాసులు కూలి కోసం సరిహద్దు మహారాష్ట్రకు పోతారు. ఈ కుటుంబం 60 కిలో మీటర్లలోని మాహారాష్ట్ర గ్రామం పింపల్గావ్ కు వెదురు కోయడానికి వెళ్ళిందని రాముభాయి ఖాండుభాయి పిఠే తాళం వేసిన ఇంటిని చూపించాడు. ఆగస్టులో మహారాష్ట్రలో ద్రాక్ష తోటల్లో పనులకు వెళతారు. రెండుమూడు నెలల పాటు పొలాల్లోనే గుడిసెలు వేసుకొని ఉంటారు. ఆ రెండుమూడు నెలలూ పిల్లల చదువు ఆగిపోతుంది. ఇది ప్రతి ఏటి భాగోతమే.
ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 2017 జూన్ డాంగ్ జిల్లా పర్యటన చేసినప్పుడు 'ఇళ్ళను మా పేరున క్రమబద్దీకరించండి. లేకుంటే శాసనసభ ఎన్నికలను బహిష్కరిస్తాం' అని నవాగాం ఆదివాసులు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. అప్పుడే కాదు! పూర్వ ముఖ్యమంత్రి మోడీ నుండి నేటి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జిల్లా కలెక్టర్ వరకు అనేక వినతి పత్రాలు సమర్పించారు. నవాగాంను మాలేగావ్ పంచాయతీలో కలపమని బిజెపి స్థానిక నాయకుడు విజరు పటేల్ కు మోడీ సూచించారు. అధికారిక ఆదేశం ఇవ్వకుండా తమ పార్టీ నాయకులతో ప్రస్తావించడం నేతల చిత్తశుద్ధి రాహిత్యానికి నిదర్శనం. అందుకే అది నేటికీ అమలు కాలేదు. దేశమంతా స్వచ్ఛ భారత్, శౌచాలయ నిర్మాణాలు సాగుతున్నా, ఈ గుజరాతీయులకు ఆరుబయలే గతి. సరీబెన్ కేశవ్ పవార్ అనే వృద్ధ మహిళ 'మాకు ఇల్లూ భూములు లేవు. టాయిలెట్లు బాత్రూంలు లేవు' అని కోపంతో దాదాపు అరిచినట్టుగానే చెప్పింది. 'మా పొలాలు లాక్కొని మమ్ములను బయటికి గెంటేశారు. మాకు వాగ్దానం చేసిన ఇల్లు, ఉద్యోగాలు, ఉపాధులు, మోడీ మోత మోగించే ఉజ్వల్ గ్యాస్ పొయ్యిలు లేవు. కట్టెలు, మట్టి పొయ్యిలే మాకు గతి. మా పొలాలపై సంపన్నులు ఆనందిస్తున్నారు. వినోదిస్తున్నారు. మేము రోదిస్తున్నాము. ఎన్నికల్లో ఓట్లు మాత్రం వేయించుకుంటారు' అని రామచంద్ర చిమన్ హడస్ వాపోయాడు. సాపుతారా, నవాగాంలను నోటిఫైడ్ ప్రాంతంగా ప్రకటించడమే ప్రగతి. ఈ ప్రకటన సాపుతారా పర్యాటక కేంద్ర అభివృద్ధికే. ప్రజల విజ్ఞాపన పత్రాలను గుజరాత్ ప్రభుత్వానికి పంపాం. అవన్నీ అక్కడే పెండింగ్లో ఉన్నాయి'' అంటూ డాంగ్ జిల్లాధికారి బి.కె. కుమార్ వివరించారు. నవాగాంలో డిగ్రీ చదివినా ఉద్యోగాలు, ఉపాధులు దొరకవు. ఒకరిద్దరే సామాజిక మాధ్యమాలు వాడుతారు. జిల్లా కార్యాలయంలోనూ, వఘయి లాంటి ఒకటి రెండు తాలూకా కేంద్రాలలో తప్ప మిగతా చోట్ల అంతర్జాలం అందుబాటులో లేదు. జిల్లాలో ఏకైక డాంగ్ శాసనసభ స్థానం నోటిఫైడ్ జాతులకు (ఎస్.టి) కేటాయించబడింది. 2012, 2017 లలో ఎన్నికైన శాసనసభ్యుడు మంగల్ భాయి గావిత్ కాంగ్రెస్ పక్షీయుడు. తన మాట ప్రభుత్వం పట్టించుకోదని ఆయన బాధపడ్డారు. ప్రభుత్వ ప్రగతి అక్కడి ఆదివాసీ ప్రయోజనాలు నెరవేర్చేలా వుండదు. 'ఇక్కడి హోటళ్ళలో బయటివారికే ఉద్యోగాలిస్తారు. మాకు టాయిలెట్లు శుభ్రపరిచే, చెత్త ఎత్తివేసే పనులు మాత్రమే ఇస్తారు' అని పదవ తరగతి చదివిన ఆశిష్ కమల్ పవార్ బాధపడ్డారు. చదువు, లోకజ్ఞానం లేని మా పెద్దల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని ఆదివాసుల భూమిని కాజేసిన ప్రభుత్వం మమ్ములను అద్దె మనుషులుగా మార్చేసింది. 'కనీసం ఇల్లు మా స్వాధీనంలో ఉంటే దాన్ని తాకట్టు పెట్టి పిల్లలను చదివించుకుంటాము' అని నవాగాం వాసుల పోరాట నాయకుడు యశ్వంత్ బాయి అన్నారు.
సాపుతారా సుందర ప్రదేశం. నవాగాం ఆదివాసులు లేని ఆ సుందరత అసంపూర్ణం. నవాగాంలో ఎక్కువగా గుడిసెలే. ఆ గ్రామానికి ఎదురుగా ఉన్న కొండ సగం గుజరాత్లో, సగం మహారాష్ట్రలో ఉంది. కొండ మీది దేవాలయం ప్రధాన పర్యాటక దర్శనాస్థలం. గుజరాత్ ప్రచారకర్త అమితాబ్ బచ్చన్ ప్రకటించినట్లు నవాగాం దీనులతో మాట్లాడేందుకు నిజంగానే ఎవరూ లేరు...మేఘాలు తప్ప.
(వ్యాసకర్త : ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి,
సెల్ : 9490204545 )
సంగిరెడ్డి హనుమంత రెడ్డి