May 03,2023 21:01

బెంగళూరు : తమ యాప్‌లో యుపిఐ లైట్‌ ఫీచర్‌ సేవలను ప్రారంభించినట్లు ఫోన్‌ పే వెల్లడించింది. ఈ ఖాతాతో పిన్‌ ప్రవేశపెట్టకుండానే ఒకే ట్యాప్‌ ద్వారా రూ.200 కన్నా తక్కువ విలువ కలిగిన చెల్లింపులు చేయవచ్చని ఆ సంస్థ బుధవారం వెల్లడించింది. యుపిఐ లైట్‌ అన్ని ప్రధాన బ్యాంక్‌లకు మద్దతును ఇస్తుందని, అన్ని యుపిఐ మర్చంట్లు, క్యూఆర్‌లలోనూ అంగీకరించబడుతుందని తెలిపింది. ఈ ఫీచర్‌ అత్యంత రద్దీ వేళల్లో కిరాణా సరకులు, ప్రయాణాలు లాంటి తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు మరింత వేగవంతమైన తక్షణ పేమెంట్‌ పరిష్కారాలకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. వినియోగదారులు వారి లైట్‌ ఖాతాలో రూ.2,000 వరకు లోడ్‌ చేసుకుని, ఒకే ప్రయత్నంలో రూ.200 లేదా అంతకన్నా తక్కువ మొత్తం వరకు లావాదేవీలు జరపవచ్చని ఫోన్‌ పే కో-ఫౌండర్‌, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ రాహుల్‌ చారి పేర్కొన్నారు. ఫోన్‌ పే యాప్‌ తెరిచి.. యాప్‌ హోమ్‌ స్క్రీన్‌లో యుపిఐ లైట్‌ను ఎనేబుల్‌ చేసుకోవడం ద్వారా ఈ సేవలు పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది.