ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపి సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ టెన్త్, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేసినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టరు కెవి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఆగస్టు 31 వరకు అభ్యాసకుల నుంచి www.apopenschool.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎపిఒఎస్ఎస్ అడ్మిషన్ల ప్రక్రియపై ఓరియంటేషన్ ప్రోగ్రాంను తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 5 వరకు ప్రవేశాలకు సంబంధించి జిల్లాల్లోని వివిధ శాఖల అధికారులు, అధ్యయన కేంద్రాల నిర్వాహకులతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కోరారు.










