కరోనా పుణ్యమాని ఆన్లైన్లో నగదు కార్యకలాపాలు అలవాటయ్యాయి. మోసగాళ్లు ఇదే అదనుగా మన నగదును మనకు తెలియకుండా కాజేస్తున్నారు. అయితే ఖాతాదారులు కొన్ని అంశాలను తెలుసుకోవడం అవసరం. ఎ.టి.యం లలో నగదు తీసేటప్పుడు రహస్య పిన్ ను ఎవరికీ కనిపించకుండా కీ బోర్డ్పై ఒత్తాలి. శివారు ప్రాంతాల్లో ఉన్న కేంద్రాల నుండి కాక జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఎటియంల నుండి నగదును తీసుకోవాలి. అనుమానితులు ఉంటే అక్కడ నగదు తీయకూడదు. ఏ ఒక్క బ్యాంకు అధికారి కాల్ చేసి ఖాతాకు సంబంధించిన వివరాలు అడగరు. అలాగే మనకు వచ్చే ఒ.టి.పి ఎవరికీ చెప్పకూడదు. ఆన్లైన్లో లావాదేవీలు చేసేటప్పుడు బ్యాంకుకి సంబంధించిన వెబ్సైట్ మాత్రమే ఉపయోగించాలి. ఆన్లైన్లో ఫోన్ నంబర్లను నమ్మగూడదు. అనుమానిత లింకులను తెరవగూడదు. యు.పి.ఐ లతో జాగ్రత్తగా లావాదేవీలు చెయ్యాలి. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని, ఫోటోలను ఉంచగూడదు. అసభ్యకరమైన సైట్లను తెరువగూడదు. ఉచితాలను, లాటరీలను నమ్మగూడదు. ఇంట్లో చిన్న పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ని లాక్ చేసుకోవాలి. ఇక ఏదైనా అక్రమ లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి తెలియచేయాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1930 నంబరుకి కాల్ చేసి జరిగిన విషయాన్ని చెప్పి కంప్లైంట్ ఇవ్వాలి.
- జనక మోహనరావు, అధ్యాపకుడు,
ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా










