Dec 23,2022 10:39

న్యూఢిల్లీ : మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియా వ్యాపారాలను రిలయన్స్‌ రిటైల్‌ స్వాధీనం చేసుకోనుంది. ఇందుకోసం రూ.2,850 కోట్లు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మెట్రో ఇండియా నెట్‌వర్క్‌ మొత్తం రిలయన్స్‌ సొంతం కానుంది. 2003లో క్యాష్‌ అండ్‌ క్యారీ బిజినెస్‌ ఫార్మాట్‌లో మెట్రో ఇండియా ఇక్కడ సేవలు ప్రారంభించింది. మెట్రోకు దేశంలోని ప్రధాన నగరాల్లో హోల్‌సేల్‌ స్టోర్లను కలిగి ఉంది. రెగ్యులేటరీ, ఇతర సంస్థలు, కేంద్ర ప్రభుత్వ శాఖల ఆమోదం అనంతరం 2023 మార్చి ముగింపు నాటికి ఒప్పందం పూర్తి కానుందని అంచనా. దేశంలోని 21 నగరాల్లో 31 అతిపెద్ద స్టోర్లను కలిగి ఉంది. ఆర్థిక సంవత్సరం 2021-22లో ఈ సంస్థ రూ.7,700 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. చిరు వ్యాపారులను చేరువ కావాలనే తమ లక్ష్యంలో భాగంగా మెట్రో ఇండియా వ్యాపారాన్ని సొంతం చేసుకుంటున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ డైరెక్టర్‌ ఈషా అంబానీ తెలిపారు.