
దేవుడు చేసిన మనుషుల్లారా!
మనుషులు చేసిన దేవుళ్లారా! మీ పేరేమిటి?
పురాణములను గురించి మేము శంకటుల వేస్తే, మా గురువుగారు 'వెధవ చదువు! మీ మతులు పోతున్నాయి. మీరు వొట్టి బౌద్ధులు' అనేవారు.
'బౌద్ధులు యెషువంటి వారు శాస్తుల్లుగారూ?' అని రామ్మూర్తి అడిగాడు.
రామ్మూర్తి శత పెంకె.
'రేపు ఆదివారం నాడు పువ్వుల తోటలో ఉపన్యాసం యిస్తాను. అంతా రండి' అని శాస్తుల్లుగారు శలవిచ్చారు.
ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలప్పుడు పువ్వుల తోటలో ఒక వరుపు మావిడి చెట్టు కింద యిసుకలో మేవంతా పాతికమంది కూచున్నాం. మధ గావంచా పరుచుకుని, మాకు అభిముఖంగా శాస్తుల్లుగారు కూచున్నారు. నేను బల్ల చెక్క తెచ్చి వెయ్యబోతే 'వొద్దురా, మీరంతా కింద కూచుంటే నేను బల్ల మీద కూచుంటాన్రా!' అన్నారు. రెండు కొబ్బరి కాయల నీళ్ళు తాగి తాంబూలము వేస్తూ శాస్తుల్లుగారు బౌద్ధమతం విషమై ఉపన్యాసం ఉపక్రమించారు. పది నిమిషములు అయేసరికి, రామ్మూర్తి తన చేతనున్న పుస్తకం విప్పి చూచి, 'శాస్తుల్లుగారూ, తాము శలవిస్తూన్నదంతా సర్వదర్శన సంగ్రహములోనిది కాదండీ' అని అడిగాడు. ఆశ్చర్యపడి శాస్తుల్లుగారు, 'ఔరా! నీ కెలా తెలిసెనురా! అదేం తర్జుమా కాదు గద!' అన్నారు.
'ఔనండి.'
'ఈ యింగిలీషు వాడు ఉద్దండ పిండంరా! ఆ రెండో పుస్తకమేమిటో?'
'బుద్ధ చరిత్రండి'.
'ఎక్కడ సంపాదిస్తార్రా యీ అపూర్వ గ్రంథాలు, యేదీ తే'.
శాస్తుల్లుగారు పుస్తకం ఆందుకుని, అతి మధురమైన కంఠంతో చదివి, అర్థం చెప్పడం ప్రారంభించారు.
నాలుగు రోజులు పోయిం తరువాత, శాస్తుల్లుగారు క్లాసులో యిలా శలవిచ్చారు. 'ఒరే యీ పుస్తకం చదివిందాకా బుద్ధుడి మహిమ నాకు తెలియలేదురా. తప్పకుండా యీ మహానుభావుడు శ్రీ మహావిష్ణు అవతారం వేన్రా.
ఆనాటి నుంచీ శాస్తుల్లుగారు మమ్మలిని బౌద్ధులని దూషించడం మానేశారు. కిరస్తానులమని మట్టుకు అంటూ వచ్చారు. క్రీస్తును, శ్రీ మహావిష్ణు యొక్క పదకొండవ అవతారంగా చెయ్యడానికి సాధ్యంకాక వొడబడి వూరుకున్నాం.
మా గురువుగారి వంటి గురువులు లోకంలోలేరు. చిరకాలం కాశీవాసం చేసి తర్కశాస్త్రము చదువుకున్నారు. మనం దేశంలో అంత తార్కికుడు లేడని వ్రతీతి, శాస్త్రం మాటకేంగాని, కావ్యాల్లో మంచి రసగ్రాహి. మరి సుగుణ సంపత్తికో అంటే, సత్యకాలపు మనిషి అన్నప్పుడు, ఆయనే సత్యకాలపు మనిషి. అంత పాండిత్యం యింత సత్యకాలం ఒక్క బుఱ్ఱలో యెలా యిమిడివున్నాయో, ఆశ్చర్యం?
యీ జరిగినది పది సంవత్సరముల కిందటి మాట. ఇప్పుడు శాస్తుల్లుగారు పించను పుచ్చుకున్నారు. మాలాటి శిష్యుల శుశ్రూష పొందుతూ, మాకు సంస్కృత గ్రంథాలు చెబుతూ, సంతోషిస్తూ, సంతోషపెడుతూ, కాలం వెళ్ళబుచ్చుతున్నారు.
నేను వర్తకం చేస్తున్నాను. రామ్మూర్తికి భూములు లావుగా వున్నాయి. కొత్త కొత్త మోస్తర్లను వ్యవసాయం చేస్తున్నాడు. వూట గెడ్డ దరిని సీతారామ కోరుతున్న. ఒక బ్రహ్మాండమయిన తోట వేశాడు. అవి పువ్వులు కావు, అవి పళ్లు కావు. తొలి ఫలాలు గురువుగారు ఆరగించనిదీ రామ్మూర్తి చెట్టు ముట్టడు. ఆ తోటలో విహరించడం గురువుగారికి అత్యానందం. అక్కడనే మేం తరచు మీటింగులు చేస్తూవుంటాం. వెంకయ్య స్కూలులో మేష్టరు. ఖయిదా లావు చేసి, తిట్లు తింటూ వుంటాడు. మా స్కూలు జట్టులో ఆరేడుగురం యిక్కడనే వున్నాం. గురువుగారూ మేమూ కలిసినప్పుడల్లా స్వర్గ ఖండం ఒకటి అక్కడికి దిగినట్లు వుంటుంది.
ఇక ప్రస్తుత కథా:
మా పట్నానికి యెనిమిది మైళ్ల దూరంలో రామగిరి అని ఒక విష్ణుక్షేత్రం గలదు. దాని వర్ణన మరి వక మాటు చేస్తాను. ఇప్పటి మట్టుకు మీకు తెలియవలసిన దేమంటే అక్కడి విష్ణుక్షేత్రం ఆధునికం. ఆ వూరి నల్లకొండల నంతటను శిధిలమైన బౌద్ధ కట్టడములు కలవు. అక్కడివారు వాటిని పాండవుల పంచలంటారు. ఈ దేశంలో పాండవులు వుండని గుహలూ, సీతమ్మవారు స్నానమాడని గుంటలూ లేవు.
ఒక పెద్ద గుహలో నున్న బౌద్ధ విగ్రహమును శివుడని, దాని పక్కనున్న దేవీ విగ్రహమును గౌరి అని భావించి జంగాలు పూజ చేస్తున్నారు.
ఉండగా, ఉండగా, కొన్నాళ్ళకి, ఒక దొర, గుమాస్తాలతోను, బిళ్ళ బంట్రోతులతోనూ వచ్చి, మెట్టల పడమట నున్న ముదర మామిడి తోటలో కాంపు ఖణాయించాడు. మరిన్నీ వొందల కొలది కూలీలను కూర్చి ఆ కొండల మధ్య నున్న దిబ్బలు తవ్వించడం ఆరంభించాడు. ధనం కోసం తవ్వుతున్నాడని అక్కడి వాళ్ళంతా అనుకొన్నారు. కాని విరిగిన ప్రతిమలూ, జిలుగుచెక్కిన రాళ్ళూ, పాతుకుపోయిన పాత కుండలూ, మండలూ. బళ్ళ మీద పెరికి ధనం కంటెనూ యెక్కువ భద్రంగా యేర్చి పేర్చాడు. ఇవి చూచుటకే మేం వెళ్లాం.
మేం ఆ వూరు వేళ్లేసరికి జంగాలు పూజచేసే పాలరాతి బుద్ధ ప్రతిమను గూర్చి వూరంతా కోలాహలంగా వుండెను. ఆ బొమ్మ మేం చూశాం. బహు సొగసైనది. ఇంత తీరైన చిత్రము గాంధార దేశం వైపు తప్ప మరెక్కడా చూడలేదని దొర మాతో చెప్పారు. దాని పీఠం మీద 'హే ధర్మా హేతు ప్రభవా' ఇత్యాది బౌద్ధ సిద్ధాంతము సొంపుగా వ్రాయబడి యున్నది. దొరగారు దాని మీద కన్ను వేసి 'ఇస్తారు?' అని అడగగా, శైవులలో పెద్దలు 'ప్రాణములనయినా యిత్తుముగాని దానిని యివ్వజాలము' అనిరి. దొరగారు నలుగురితో సాయిలా పాయిలాగా తిరిగేవారు గనుక మర్యాదగా జవాబు చెప్పారు. మరివకరైతే కథ చాలా దూరం వెళ్ళివుండును. దొరగారు అంతటితో ఆ ప్రయత్నం మానుకున్నారు.
ఇలా వుండగా ఒకనాటి రాత్రి పూజచేసే జంగం శరభయ్య ఆ ప్రతిమను పెగిల్చి, కొనిపోయి దొరగారికి రెండు వందలకి అమ్మజూపాడు. దొంగతనంగా తెస్తివి పుచ్చుకోజాలను అని, దొర తనకు మాట రాకుండా వుండగలందులకు వూరి పెద్దలకు కబురు పెట్టాడు. ఏమిటి, యీ దొర బుద్ధితక్కువా అని శరభయ్య కొంత ఆశ్చర్యపడి, దొర కొంచెం కనుచాటు కాగానే మెట్టల వైపు పరుగుచ్చుకున్నాడు. నాటికీ నేటికీ మరి పికరు లేదు.
శాయన్న భుక్తగారి యింట బసచేసి ఆ వూళ్లో మేం మూడ్రోజులు వున్నాం. శాయన్న భుక్త మా గురువు గారి దగ్గర కొన్నాళ్ళు తర్కం చదువుకున్నాడు. మంచి సాహిత్యం కద్దు. కొంచం కవిత్వం కూడా అల్లుతాడు.
మూడోనాడు రాత్రి భోజనం చేసుకొని డాబా మీద నలుగురం కూచున్నాం. చిన్నగాలి రేగి, తోటలో కొబ్బరి మట్టలు అల్లాడడం ఆరంభించాయి. యెదట దేవుడి కొండ బ్రహ్మాండమైన మహాలింగము వలె చీకటిని చీల్లుకొని మిన్ను ముట్టి మనిషియొక్క అత్యల్పతను సూచించును. యేదో చెప్పరాని చింతను భీతిని మనస్సులకు కలుగజేయు చుండెను. దేవతలు పూజ చేసిన దివ్య కుసుమముల వలె చుక్కలు శిఖరము చుట్టు చెదిరి వెలిగెను. మా మనస్సులు గత కాలము నాటి స్థితి గతులను గూర్చిన ఊహలతో నిండి యుండెను. తలపోసి తలపోసి ఆనాడు యీ స్థలం యేలా వుండెనో బౌద్దులు యేమి యేమి చేసేవారో అని నేనంటిని.
ఆ పీనుగులు మనలాగే యేడుస్తూ వుండేవారు. మనకంటె అద్ధాన్నంగా వుండేవారు; అని సున్నితమైన తలంపులు బెదిరి చెదిరే పెళుసు గొంతుకతో వెంకయ్య అరిచాడు. నాకు కళ్ళ మొయ్యా కోపం వొచ్చి 'నీ అమూల్యమయిన వూహలతో నువ్వు అనందించరాదా, నా తలలోనే కల్పించుకున్న బౌద్ద ప్రపంచమును పెటుకు మాటలాడి యేల కలత పరిచెదవు' అని అడిగాను.
'గాని' శాస్తుల్లుగారు అన్నారు. 'బుద్ధుడు విష్ణ్వవతారం గదా యీ జంగాలు శివుడని యేల పూజ చేస్తున్నార్రా?' అని శంక వేశారు.
శాయన్న భుక్త పొడుం డబ్బీ తీసి, పెద్ద పట్టుపీల్చి, గావంచాతో ముక్కు తుచుకుని 'ఒక కథ ఉంది' అన్నాడు. కథంటే శాస్తుల్లుగారికి సరదా. 'అయితే చెప్పు' అన్నారు. చెవి నొగ్గి విన్నాం. యిదీ కథ..
ఈ గ్రామంలో శైవ, వైష్ణవ మతాలకు వైరం చిరకాలం నుంచి కద్దు. శివమతానికి మొనగాడు జంగం శరభయ్య. అనగా యిప్పుడు పారిపోయిన పూజారే. మొన్న ప్రతిమను పెరికి పలాయనం అయిందాకా అతగాడు సాక్షాత్తూ నందికేశ్వరుడి అవతారమని రాత్రులు గుహ యెదుట వృషభ రూపమై మేస్తూ వుంటుందని యిక్కడి జంగాలకూ, దేవాంగులకూ నమ్మకం. ఇప్పుడైనా ఆ దొర కిందటి జన్మలో పరమ మహేశ్వరుడౌటచేత ఆ విగ్రహమును కోరినాడనీ. భóక్త వాత్సల్యం చేత శివుడిచ్చిన శలవును అనుసరించే శరభయ్య విగ్రహాన్ని పెరుక్కు వెళ్ళాడనీ డేరా నుంచి పారిపోవడంతో వృషభ రూపం ధరించి రంకెవేసి మరీ దాటేశాడనిన్ని ఒక వార్త అప్పుడే అతని శిష్యులు పుట్టించారు. రేపో నేడో వీరాననం వేసుకుని ఒక ధ్యానం చేస్తూ కొండ మీదనో, గోపురము మీదనో అవిర్భవిస్తాడు. బాజా భజంత్రీలతో వెళ్లి ఉల్లభం బట్టి తోడ్చుకు వస్తారు. ఆపైని కంపాలి వీరయ్య (వీరణాచారి అని పిలిస్తేనే గాని కోపగిస్తాడు) ఆ కథకు చిలువలూ పలవలూ కల్పించి ద్యిపద కావ్యం రచించి అచ్చు వేస్తాడు. ఆ ఉభయుల కీర్తి దిగ్ధంతులకు వెల్ల వేస్తుంది.
'ఔరా వీళ్ళ మూఢ భక్తి! యీ ప్రపత్తి పండితులకు వుండదురా, వీళ్ళది యేమి అదృష్టం' అని గురువు గారు అన్నారు. ఆ పైని వెంకయ్యయేమో అనబోతే చేతితో నోరు అడ్డాను. యెవరి అభిప్రాయం వారు చెప్పకుండా నీ శాసనం యేమిటి అని అడిగాడు. మాటాడవద్దని చైసౌజ్ఞ చేశాను. శాయన్న భుక్త తిరిగి యెత్తుబడి చేశారు.
అవును తాము శెలవిచ్చినట్టు పామరులకు వుండే గాఢ భక్తి పండితులకు వుండదుగాని యీ మూఢభక్తి ఒకప్పుడు ప్రాణాంతం తెస్తుంది. అదేచెప్పబోవుచున్నాను వినండి.
'నేనూ ఆ మాటే చెప్పబోతే చెప్పనిచ్చాడు కాడు' అని వెంకయ్య అన్నాడు. 'అవును నీకంటూ తెలియని సంగతి లేదు మరి వూరుకో' అన్నాను.
శివస్థలం యొక్క ఉత్పత్తి మీకు తెలియనే తెలుసును. పూజారి శరభయ్య చాలా కథకుడౌటచేతను, వీడి రోజుల్లో శివస్థలానికి మిక్కిలిగా వైభవం కలిగింది. చుట్టుపట్ల గ్రామాల వాళ్ళందరూ మొక్కుబళ్ళు చెల్లిస్తారు. ఉత్పవపు రోజులలో పెద్దజాతర్లు సాగుతాయి. మరిన్నీ యిక్కడి దేవాంగులు కలిగినవాళ్ళు జంపంపాడు యావత్తున్నూ, దేవర పేటానున్నూ, శరభయ్య మాట మీద నడుస్తారు. ఈ గ్రామంలో వుండే విష్ణుస్థలం రెండు వందల యేళ్ళ కిందట యీ దేశం యేలే ఒక మహారాజు కట్టించి రాగభోగాలకు వొక గ్రామం స్వామికి సమర్పణ చేశారు. అప్పటి నుంచి రంగాచార్యులు గారి కుటుంబస్తులే యీ స్థలానికి ధర్మకర్తలై ఉంటూ వచ్చారు. ఈయన యిద్దరు ముగ్గురు వైష్ణవులను జీతమిచ్చి వుంచి వాళ్ళచేత మిక్కిలి భక్తి శ్రద్ధలతో స్వాంవారి కైంకర్యం జరిపిస్తూన్నారు. రంగాచార్యులుగారు బహు యోగ్యులు. ఆయన యొక్క సంస్కృత సాహిత్యం మీరు చూడనే చూశారు. ద్రావిడ వేదములో కూడా గట్టివారని ప్రతీతి కద్దు. ఆయన కొమాళ్ళు కృష్ణమాచార్యులు కూడా సంస్కారే గాని విశేష ప్రయోజకుడు కాదు. ఆ యింటికి వెలుగు చెచ్చినది యీ కృష్ణమాచార్యులు భార్య నాంచారమ్మ. తల్లి తండ్రి కూడా పండితులౌటచేత ఆంధ్ర గీర్వాణముల యందు మంచి జ్ఞానం సంపాదించిరి. పురాణం ఆ యిల్లాలు చదివినంత శ్రావ్యం గానూ, రసంతోనూ యోవరూ చదవజాల్రు. రూపమూ రూపానికి సదృశ్యమైన గుణసంపత్తి కలదు. ఆమెకు ఒక కొమార్తె, ఒక కొమారుడున్నూ, యిల్లూ, దేవాలయం కూడా ఆమే చక్కబెట్టుకుంటారు.
'ఇది కవిత్వమా, నిజామా?' అని వెంకయ్య అడిగాడు.
'మాకూ వాళ్ళకూ రాకపోకలు గలవు. నా భార్య చెప్పిన మాటలు నే చెబుతున్నాను. ఆమె పురాణం చదవడం చెవులారా విన్నాను. మీకూ వినడపు అభిలాష వుంటే రేపటి దాకా వుండిపొండి. విష్ణు స్థలం యొక్క స్థితి ఇది. గాని, అయ్యవార్లం గారు మత సంబంధమైన జట్టీలలో ఎన్నడూ జోక్యం కలగజేసుకోవడం లేదు. వైష్ణవ పక్షానికి కెప్తాను సాతాని మనవాళ్ళయ్య. అనగా రోజూ పొద్దున్న ఉపాదానాకు వచ్చి, స్త్రోత్ర పాఠాలతో పెణక యెగర గొట్టేస్తాడే. అతగాడే. ఒకనాడు తెల్లవారుగట్ల కలక్టరుగారు గుఱ్ఱమెక్కి వస్తూ వుండగా, గ్రామ పొలిమేరను మనవాళ్ళయ్య యెదురై, పెళ పెళమని శ్లోకం యెత్తుబడి చేసేసరికి ఇతని స్థూలకాయం బఱ్ఱే నామాలు, రాగి ధ్వజం, కోలాహలమూ చూసి గుఱ్ఱం బెదిరింది. కోపం వచ్చి కలక్టరు అయిదు రూపాయలు జుల్మానా వేశారట. ఈ కథ శుద్ధాబద్ధం అనీ, తనచేత శ్లోకాలు చదివించి దొరగారు ఐదు రూపాయలు ప్రెజంటిచ్చారని, అవి పెట్టి కొత్త వ్యాయవార పాత్ర కొన్నానని మనవాళ్ళయ్య చెబుతాడు.
శైవులలో ఉన్న ఐకమత్యం వైష్ణవుల్లో లేదు. సాతాన్లు చాలా మంది మనవాళ్లయ్య శిష్యులే. అయినప్పటికీ కొందరుమట్టుకు అతను అవతార పురుషుడని చెప్పరు. అతనంటాడు. 'శరభయ్యే వృషభావతారమైనప్పుడు నేను గరుడాళ్వారి పూర్ణావతారం కాకపోతే కాకపోవచ్చును గాని వారి యొక్క అత్యల్పాంశ వల్లనైనా జన్మించి వుండకూడదా. గరుడాళ్వారి నఖముల యొక్క తేజస్సు నాయందు అవిర్భవించి వున్నది కాబట్టే, శరభయ్యను యిలా చీల్చి పేల్చుతున్నాను.'
అయ్యవార్లంగారికి ఒక మాటు యీ మాట చెవి సోకి గట్టి చీవాట్లు పెట్టారు. ఆ చీవాట్లు తిని పైకి వచ్చి. 'యీ బ్రహ్మాణులదీ, జ్ఞానమూ కాదు, అజ్ఞానమూ కాదు. కడజాతి మనుష్యులే భక్తి ప్రభావం చేత ఆళ్వార్లు అయి వుండిరి గదా? ఇంత కాలవాయి రాముడి ధ్వజమును జయప్రదంగా మోస్తూ. శైవ సంహారం చేసిన నేను శ్రీమద్గరుడాళ్వారి నఖాగ్రాగ్రం యొక్క అవతారం యేల కాను? గరుడాళ్వారి నఖములు పెరిగి, ఖండన ఐనప్పుడూ ఆ ముక్కలు నా వంటి భకులుగా ఆవిర్భవించి పరమత సంహారం చేస్తవి గాని, వృధాగా పోనేర్చునా? వట్టి మాట!' అన్నాడు. 'ఔర, యేమి మూర్ఖత; యేమి అహంభావము, యీ అజ్ఞులా అవతార పురుషులు? యిలా అన్నందుకు వీళ్ళ తలలు పగిలిపోవురా?' అని గురుగారు అన్నారు.
'శాస్తుల్లుగారూ! పాత రోజులైతే వీళ్లే అవతారాలయిపోదురు. వీళ్ళ పేరిట బొమ్మలు నిలిపి, దేవాలయాలు కట్టి, మనవే పూజ్జేతుం. మరి బుద్ధుడూ యిలాంటి మనిషేగదండి' అన్నాడు వెంకయ్య.
'చాకి బట్టెకీ సముద్రానికీ సాహిత్యం తెస్తిని' అన్నారు గురువుగారు. 'అన్న మాటకల్లా వ్యాఖ్యానం చేస్తే గాని వూసుపోదురా?' అని నే అన్నాను.
'యీ వూరినాయలు స్తోమం కలవాళ్లు. అందులో సారథిó నాయడు లక్షాధికారి. అతని బావమరిది రామినాయడు గ్రామ మునసబు. కొంచ దూర్తూ, నిషా బాజీన్నీ భోజన ప్రియుడు, ఈ తాలూకాలోకల్లా పెద్ద సారా దుకాణం యీ వూళ్లోనే వుంది. దాన్నిబట్టి యీ వూరి యోగ్యత మీరు వూహించుకోవచ్చును.
నాలుగు సంవత్సరములు కిందట యిక్కడికి దక్షిణ దేశం నుంచి ఒక అయ్యవార్లంగారు వచ్చి, సారథి నాయడికి, ఇంకా మరికొందరు నాయలకూ, చక్రాంకితం చేసి, వైష్ణవ విచ్చారు. ఆనాడు మునసబు రామినాయడు రామస్వామి వారి ఆలయంలో తూంపట్టు పుళిహోరా, వైష్ణవమూ యేక కాలమందే గ్రహించాడు. నాటికీ, నేటికీ రెంటియందూ ప్రపత్తి యేక రీతిగానే వుంది. అప్పటి నుంచి సారథిó నాయడు ద్వాదశి ద్వాదాశికీ స్వాం వారికి విరివిగా రాగ భోగాలు నడిపిస్తున్నాడు. ద్వాదశి అంటే రామినాయడికి పెద్ద పండగ.
నాయళ్ళంతా వైష్ణవం పుచ్చుకుని, శివకోవిల వైపు తిరిగి చూడకపోవడం, శరభయ్యకు కంట్లో మిరపకాయలు రాసుకున్నట్టు వుండెను. ఆలోచించి, ఆలోచించి ఒకయెత్తు యెత్తాడు.
ఆ రోజుల్లో హైదరాబాదు రాజ్యం నుంచి శివాచార్లు కొందరు దేశ సంచారార్థం యీ ప్రాంతానికి వచ్చారు. మరి రెణ్టెల్లనాటికి పీఠంతోనూ, ప్రభలతోనూ, రుంజలతోనూ, పెను ప్రళయంగా వచ్చి యిక్కటికి
దిగబడ్డారు. రోజూ అర్ధరాత్రి వేళ శివార్చన చేసేవారు. ఆ సమయంలో శంఖాలు, జయ ఘంటలు, ఢమామీలు, వీటి ధ్వని పామరుల మనస్సులో భయోత్సాతం పుట్టించేది. యీ నల్లరాతి కొండల్లో ఆ ధ్వనులకు ప్రతిధ్వనులు కలిగి, కోలాహలంగా ఉండేది. యీ అట్టహాసంతో వైష్ణవం పుచ్చుకున్న ఒక్కొక్క నాయడే, నామాలకి నామంబెట్టి, వీబూది రుద్రాక్షధారణం చెయ్యడం అరంభించాడు. వచ్చిన పదో రోజున శివాచార్లు గుండం దొక్కడానికి పెద్ద ప్రయత్నాలు చేశారు. సారథి నాయణ్ణి కదిలించడమే వాళ్ళ ముఖ్య ప్రయత్నంగా వుండెను. అదివరకే సారధినాయడికి శివమతం వేపు తూగు లావాయెను. గుండం తొక్కడం చూసిన తరువాత సారధినాయడు సిద్ధాంతంగా శైవం పుచ్చుగుంటాడని అంతా నమ్మారు. అందుచేతనే శైవుల్లో మొనగాళ్ళంతా రుంజలతో సారధినాయడి ఇంటికి వెళ్లి చాలా కైవారం చేసి ఉత్సవం చూచుటకు రాక తీరదని పిలిచారు.
ఈ మాట చెప్పగా, అయ్యవార్లంగారు యేవన్నారంటే 'రాముడి అజ్జ యేలా వుంటే, అలా జరుగుగాక. వైష్ణవుడు, శైవుడు కావాలని కోరితే, అడ్డియేమి కార్యం? కాక కాశీలో మృతి పొందినవారికి శివుడే కదా, తారక మంత్రోపదేశం చేస్తాడు. గనుక యీ జన్మలో పరమ శైవుడైనవాడికి, వచ్చే జన్మలో తారక మంత్రోపదేశం చేసి, ముక్తి యివ్వకపోతాడా? ఏ మతవైనా ప్రపత్తి ఉన్న వాడికి తోవ వుంది. అదిలేకుంటే వైష్ణవుడైనా, కార్యం లేదు.' సాతాన్లకి అయ్యవార్లంగారి ఉదాసీనత చెయి విరుచుకున్నట్టు వుండెను.
'ఈ బ్రాహ్మడికి వైష్ణవాభిమానం తక్కువ. గనక మనం విజృంభిస్తేనే గాని వైష్ణమత ప్రభావానికి ఆ గౌరవం వస్తుందని మనవాళ్ళయ్య ప్రగల్భించి, శివాచార్లు గుండం దొక్కే నాటి రాత్రి రెండు ఝాములప్పుడు కోవిల యెదటి రావిచెట్టు కింద పెద్ద మీటింగు చేశాడు. సాతాన్లూ నాయలూ వొందలకి జమ అయ్యినారు. అందులో యోధులు దుకాణంలో రహస్య శేవ శేవించి, ఒక్కొక్కరే దిగబడ్డారు. అంతట మనవాళ్లయ్య చెట్టు మొదటి రచ్చ రాతి మీద వంగి నిలిచి, గెడ్డము కింద వక కఱ్ఱ ఆనుకుని, యేమని పలికెను. 'పరమ భాగవతోత్తములారా; వింటిరా ఈ శైవుల యొక్క రాక్షస మాయల్లో పడి, అప్పుడే చాలా మంది నాయలు వైకుంఠానికి పోయే రాజమార్గమైన వైష్ణవ మతం విడచి, అంధకార బంధురమైన శైవమతంలో కూలిపోయినారు. ఇక మన పరమ మిత్రుడున్నూ, భక్తాగ్రేసరుడున్నూ అయిన సారథినాయణ్ణి మాయగమ్మి తమలో పడవేసుకొనుటకు, యిప్పుడు విపుల ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాత్రి అతడు వెళ్లి శైవుల ఘోర కృత్యములు చూసేనా, మరి మనవాడు కాడు. గనక అతన్ని కాపాడి శ్రీ మహా విష్ణువు యొక్క మహిమ ప్రజ్వలింప చేసే సాధనం యేమిటో తాము అంతా ఆలోచించండి. సారధినాయడు యీ రాత్రి అక్కడకు వెళ్లకుండా ఉపాయము కల్పించడము కర్తవ్యమని నా అభిప్రాయము.'
యెలాగంటే, యోలాగని నలుగురూ తలపోయుచుండగా, రామానుజయ్య లేచి నిలిచి అన్నాడు. 'దీనికింత ఆలోచనేలా? యేమి? వాళ్లు చేసే పని మనమేల చేయరాదూ? రామభక్తుడైన శివుడికే అంత మహిమ వున్నప్పుడు సర్వేశ్వరుడైన ఆ రాముడికి అంతకన్న వెయ్యి రెట్లు మహిమ వుండకపోయెనా? గకన నా సలహా యేమిటంటే శ్రీ మద్గరుడాళ్వారి అవతారమైన మనవాళ్ళయ్య రాగి ధ్వజం చేతబట్టుకొని, నాలాయిరం పఠిస్తూ గుండం తొక్కితే సరి. శైవ, వైష్ణవ మతాల తారతమ్యం లోకానికి వ్యక్తం కాగలందులకు, శివాచార్ల గుండంకంటే మరి బారెడు ఆస్తి లావుచేసి (యీ చెట్టుకిందే యీ క్షణమందు బ్రహ్మాండవైన గుండం తయారు చేస్తాను. ఇందుకు అభ్యంతరం చెప్పేవాణ్ని వైష్ణవుడని భావించను)
చీకట్లో యెవరికీ కానరాలేదు గాని మనవాళ్ళయ్య నోరు వెళ్ళబెట్టాడు. నలుగురూ 'బాగుంది! బాగుంది!' అనేసరికి అతని ప్రాణాలు యెగిరిపోయినాయి. ఒక్క నిమిషం ఆలోచించి అన్నాడు. అన్నలారా! తమ్ములారా! పరమ భాగవతోత్తములారా! రామానుజయ్య నన్ను ఆక్షేపణ చేస్తున్నాడు. నేను పడవలసిందే! యీ శరభయ్యే వచ్చి తాను వృషభావతారవని నిక్కి నీలుగుతున్నాడు గదా. మనం దెబ్బకి దెబ్బ తీద్దాం అని. కేవలం వైష్ణవాభిమానం చేత, నేను గరుడ వేషం వేశానే గాని, ఇంత భారవైన శరీరంతో నేను గరుడాళ్వారిని యెన్నడూ కానేరనే? ఆ మాట నాకు తెలియదా? ప్రాజ్ఞులైన మీకు తెలియదా? రామానుజయ్య అయితే, చులాగ్గా డేగలా వున్నాడు గనుక, అవశ్యం అతగాడే గరుడాళ్వారి అవతారం. అతణ్ణే గుండం తొక్కమనండి. నేనుగానీ నిప్పుల్లో కాలుబెట్టానంటే గజం లోతుక్కూరుకుపోయి చస్తాను. రామానుజయ్య తేలిగ్గా వున్నాడు; అంటీ అంటనట్టు చపచప అడుగేసుకుపోతాడు. అన్నల్లారా! న్యాయం ఆలోచించండి' అనేప్పటికి రామానుజయ్య సన్నసన్నగా జారాడు.
రామినాయుడు జల్దుకొని అన్నాడు: 'రావస్సోవికి మయిమం వుందా లేదా? వుందా యీ యేషాలు మాని తిన్నగా గుండం దొక్కు' అ మాట విని మనవాళ్ళయ్య మొహం జుమాల్మంది. రామానుజయ్యలాగ మందలో జొచ్చి మాయవౌదావంటే, చీమా దోమా కాడు; పది యిరవై మణుగుల పట్టు, 'హా దైవమా, నేను ఒక్క అరగడియ గరుడాళ్వారినే అయితే, యెక్కడనైనా ఎగిరి ప్రాణం దాచుకుందును కదా' అని అనుకున్నాడు.
'ఏం, పలక్కుంటావేం?' రామినాయుడు పొడవడం ఆరంభించాడు. ''అలాండం బెలాండం అని తెల్లారకుండగ వొచ్చి తెగ అరుస్తావు గదా, ఆ ముక్కలన్నీ మావంటోళ్ళని బెదిరించి కూరానారా లాగడానికైనా ఆటిమయిమం యే కాసింతైనా కద్దా?'
మనవాళ్ళయ్య నిట్టూర్పు విడిచి, రామానుజులను స్మరించి యిట్లా అన్నాడు. ''రామినాయడన్నా, నువ్వూ నేనూ చిరకాలంనాటి నేస్తులం. నువ్వు గవునరుమెంటు వారి తరపున మునసబి అధికారం చాలా కాలవాయి చలాయిస్తున్నావు. యుక్తాయుక్తం యెరిగిన మనిషివి. అవునుగానీ, వైష్ణవ మతం యొక్క ఆధిక్యత అగుపర్చాలంటే, ఆ శరభయ్య చేసే తక్కువ పనా, నన్ను చేయమంటావు? 'పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్' అన్నాడు. విష్ణుభక్తుడైన వాడికి కర్తవ్యం ఉత్తమోత్తమం పృథివీ అనగా భూమి మీద నడవడవే. పంచ భూతములలో మరివక భూతం మీద వైష్షవుడన్నవాడు అడుగేసి నడవనే కూడదు. అంతకు ఒక వీసం తక్కువ అవ: అన్నాడు. అనగా నీట్లో ఉరకడం ఒకపాటి కర్తవ్యం కావచ్చు. అథమాథమం అగ్గి తొక్కడం గనక మీరు యావన్మందిన్ని యిప్పుడే నా వెంట రండి. ఈ నిశీధి సమయంలో శ్రీ మహా విష్ణు నామస్మరణ చేసి అమాంతంగా సితాగుండంలో వురుకుతాను. అప్పట్లో నా మహిమ మీకు తెలియగల్దు.'
రామినాయడు దగ్గిరకి వచ్చి, మనవాళ్ళయ్య చెయి బట్టుకుని గట్టిగా నొక్కుతూ అన్నాడు. 'ఇన్నావా వైష్ణవోడా, మా ఇయ్యంకుడు సారధినాయడు జంగపాళ్ళలో కలిసిపోతే రోదసి పుళియోరి శక్కర పొంగళం పోతాయి. ఆ మాట నీకూ యెరిక; నాకూ యెరిక. నువ్వు సీతమ్మ గుండంలో ఆనపకాయ తుంబలాగా తేలి, యీతలాడితే, నీ మయిమం ఆడొప్పుతాడా! యెఱ్ఱికుట్టె కబుర్లు మానేసి మావాడు రెండు కళ్ళతో సూస్తుండగా అల్లాండం బెల్లాండం అంటూ అగ్గిదొక్కు!!'
'సరే నేస్తం. నీ అభిప్రాయం ఆ ప్రకారం వున్నట్టయితే అలాగే కానీయండి. శ్రీమహావిష్ణు యొక్క మహిమ నిలబెట్టడానికి అగ్గి తొక్కుతానా, తొక్కి చూస్తానా. యిప్పుడు చాలా రాత్రైంది. యిళ్ళకుపోయి పరుందాం. రేపు యీ వేళ్ళప్పుడు యీ స్థలంలోనే బ్రహ్మాండమైన గుండం చేసి, దంద్యహ్యమానమైన ఆ గుండం తొక్కి, వైష్ణవ మతప్రభావం కనబరుస్తాను. అప్పట్లో ఆ గరుడాళ్లారే నన్ను ఆవహించి, అంత గుండమునూ చెంగున ఒక్క దాటున దాటిస్తారు.'
'ఆ పప్పు వుడకదు. యీ రాత్రి మావాడు జంగపాళ్ళలో కలసిపోతే, రేపు నువ్వు దాటేం, దాటకేం, ఆ దాటే దాటేదో, యీయాళ ఆళ్ళ గుండంలోనే దాటు. లెండోస్సి యీ వైష్ణపోణ్ణి మోసుగెళ్ళి గుండం తొక్కిద్దాం' అని రామినాయడు అనేసరికి నలుగురు నాయలు మనవాళ్ళయ్య రెక్కలు పట్టుకు రచ్చరాతి మీద నుంచి కిందికి దించారు. మీరి వచ్చిందని మనవాళ్ళయ్య ఒక యెత్తు పన్నాడు. 'ఆగండి ఆగండి, గుండం తొక్కవలసివచ్చినప్పుడు, అందుక్కావలసిన పరికరం అంతా కూర్చుకోవడవా, లేకుంటే కట్టుగుడ్డలతో గుండంలో పడేసి, వొళ్ళు తెగ్గాలుస్తారా? ఆ శివాచార్లు వీరభద్ర విగ్రహం చేతబట్టి, మంత్రాలు పఠిస్తూ, శంఖధ్వనికి వీరావేశం పుట్ట గుండం తొక్కుతారు. అలాగే శ్రీ రామస్వామి వారి తాలూకు ఉత్సవ విగ్రహం వొకటి నా నెత్తిన కొడితేగాని యెలా చస్తాన? గరుడాళ్వారు అయినా యెప్పుడూ పెరుమాళ్వారిని వీపున మోసుకునే బయల్దేరుతరుగానీ ఒట్టినే రెక్క కదపరు. మీరెరగరా' అనేటప్పటికి, సారథినాయడు 'ఆ మాట నిజవర్రా యిగ్గరవిస్తాడు, అయ్యవోర్ని తెలుపుకు రండోస్సి' అన్నాడు. నలుగురు నాయలు పక్కనున్న అయ్యవార్లంగారి యింటికి వెళ్లి, పైమీద గుడ్డ అయినా లేకుండా ఆయనను ఓసుకువచ్చి రావిచెట్టు కింద రచ్చ రాతిమీద కూచోబెట్టారు. ఈ గడబిడ కనిపెట్టి కృష్ణమాచార్లు అటకెక్కి దాక్కున్నాడు.
3
అతి వినయమును నటిస్తూ మనవాళ్ళయ్య రంగాచార్యులు గారికి ప్రస్తుతాంశము విన్నవించి, ఉత్సవ విగ్రహమును యిమ్మని వేడాడు. రంగాచార్యులుగారు అన్నారు: 'ఓరి మూర్ఖులారా! మీకు మతులు శుభ్రంగా పోయినాయిరా? యీ గుండం తొక్కడమనేది గర్హ్యమైన తామస వ్యాపారము; వైష్ణవ మత నిషిద్ధము. మన గ్రంథాల్లో యెక్కడా యీ ప్రక్రియ లేదు. గుండం తొక్కడానికి ఒక విధీ, మంత్రం యేడిస్తేనా?'
'శక్కరంతోటి వొళ్ళలా తెగ్గాల్చడానికి మంతరం కద్దా! అట్టే మాటలు శెలవియ్యక, ఆ యిగ్గరవేదో సాతానోడి కియ్యండి' రామినాయడు అడిగాడు.
'ఛీ పొండి! మూర్ఖుల్లారా! నేను యిచ్చేది లేదు. ఉత్సవ విగ్రహములు శూద్రులు ముట్టుకోవలసినవి కావు. ముట్టుగుంటే కళ్ళు పేలిపోతాయి' అని రంగాచార్యులుగారు అనేసరికి, మనవాళ్ళయ్య 'బతికానురా దేవుడా!' అనుకొని, సారథినాయడితో 'చూశావా నేస్తం! ఆ మాట నిజమే! నేను ఉత్సవ విగ్రహములు ముట్టుకోకూడదు. అందుచేత, యిప్పుడు కర్తవ్యం యేమిటంటే, ఆ విగ్రహం పట్టుకొని అయ్యవార్లంగారే గుండం దొక్కవలసి వుంటుంది. ఆ ఆధిక్యత అనేది వారికే వుండవలసినది.'
మునసబు 'ముసలాయన యిగ్గరా లట్టుకుని గుండం తొక్కేదేటి? సిన్నసోవిని లెగదీసుకెళదాం రండి,' అన్నాడు.
'వాడి జోలికి వెళ్ళకండి. మాబాగే; ఉత్సవ విగ్రహాలు పట్టుకుని, నేనే గుండం తొక్కుతాను. మా వాడు పట్ణం వెళ్ళాడు. వూళ్ళో లేడు' అని రంగాచార్యులుగారు అన్నారు.
'అయితో లెండోయి!' అని మనవాళ్ళయ్య బొబ్బ వేశాడు. అంతట ఆ రావిచెట్టు మాను చాటున గుప్పని ఒక వెలుతురు పుట్టింది. అందరూ భీతిల్లారు. నిషాలు దిగజార జొచ్చాయి. వెంటనే మాను వెనక నుంచి ఒక చేత కరదీపము, రెండవ చేత సూరకత్తి కట్టుకుని, వుంగరాల జుత్తు గాలికి తూగులాడుతుండగా, నిబ్బరంగా అడుగు వేసుకుంటూ వచ్చి నాంచారమ్మ, మామగారి పక్కన నిలిచి, ఆయన రెక్కలు పట్టుకుని వున్న నాయల వంక బాకు మొన జూపి 'దుష్టుల్లారా! యీ పరమ పవిత్రమైన బ్రాహ్మణ్ణి వొదుల్తారా, బాకుకు బలి యిచ్చెదా?' అని అడిగినది.
హటాత్తుగా వచ్చిన యీ వీర రూపమును చూచి, అందరి ధైర్యాలూ అడుగంటాయి. అయ్యవార్లంగారిని పట్టి నిలిచిన నాయలు బెదిరి దూరం సాగారు. అంతట ఆమె చేతి దీపం రచ్చ రాతి మీద వుంచి, 'నీకేం కావాల'ని మనవాళ్ళయ్యను అడిగింది. మనవాళ్ళయ్య రెండడుగులు వెనక్కి వేసి, తనకేమీ అక్కరలేదన్నాడు.
'నీకు ఉత్సవమూర్తులు కావలెనంటివే?'
'నాకెందుకు తల్లీ, అపవిత్రుడను! వాటి యెత్తు బంగారం కరిగి యిస్తే నాకు అక్కర్లేదు. రామినాయడు యేమో కొంచం.'
ఆమె అటుంచి యిటు తిరిగి, రామినాయడిని నిస్సారంగా చూస్తూ.. 'నీకేం గావాలి, మునసబు నాయడా' అని అడిగింది.
మొహం వొంచి, రామినాయడు తనకేమి అక్కర్లేదని పైకి చెప్పి, 'ఆడదాయితో యవడు మాటాడగల్డు?' అని గొణుగుకున్నాడు. రామినాయడి పెళ్ళాం గయ్యాలి.
నాంచారమ్మ - 'ఎవరికీ ఏమీ అక్కరలేకుంటే యీ ముసలి బ్రాహ్మణ్ణి వొంటిమీద బట్టయినా లేకుండా నిద్దర మంచం మీంచి ఎందుకు యీడుచుకు వస్తిరి? ఎవరూ మాటాడ్రేవి!'
రామినాయడు కొంచెం ధైర్యం తెచ్చుకొని 'ఆడదాయితో మాటలకంటే సాల్లేంగాని, యీ రాత్రికాడ ఆ జంగపోళ్ళు శివుడు పేరుజెప్పి గుండం దొక్కుతారు గదా, మన రామస్సోంవోరి పేరుజెప్పి మనం కూడా గుండం దొక్కకుంటే, మన పెండెం యిరిగిపోదా?
నాంచా : 'నువ్వేల తొక్కరాదూ?'
మున : 'నాకు మంతరం, మాయా యెరికనేదే! అందుకనే సాతానోణ్ణి తొక్కమన్నాను'
నాంచా : (మనవాళ్ళయ్యతో) 'నువ్వెందుకు తొక్కకూడదూ?'
మనవాళ్ళయ్య : 'అమ్మా, ఈ వేళ ఏదో నా ప్రారబ్దం చాలక యీ మీటింగు తలపెట్టాను. బుద్ధి గడ్డి తిన్నది. ఇదుగో లెంపలు పడ పడ వాయించుకుంటున్నాను. తల్లీ నన్ను యీకాడికి వొదిలివేస్తే శ్రీరంగం వెళ్ళిపోతాను. ఈ నాలుగు వూళ్ళ పొలిమేరనూ, నేనంటూ తిరిగి కనపడితే, నా నెత్తి మీద పెద్ద పిడుగు పడిపోవాలి.'
నాంచా : 'నీకు కొండంత గుండె వుంది! (రామినాయడుతో) మునసబు నాయడా, నీ వియ్యంకుడు సారథినాయడు విరిగిపోతే ద్వాదశి ద్వాదశికీ ''శక్కర పొంగళం, పులియోరీ'' లేకపోతాయని గదా దుఃఖం?'
మునసబు : (తల గోక్కుంటూ) 'నాకొక్కడికే అన్న మాటేమిటమ్మా, ఆ రామస్సోం వోరికి మాత్రం పులియోరం కరువైపోదా?'
మనవా : అమ్మా, శక్కర పొంగలి, దద్యోదనమూ అనేవి ముఖ్యములు కావు. వైష్ణవ మతోత్కర్ష మహిమ కనపర్చి, ఉద్ధరించాలి. అదీ కర్తవ్యం.'
నాంచా : 'ఆ వుద్ధరించడం ఏదో నువ్వేల చెయ్యరాదు? నీకు ఉత్సతవ విగ్రహమంటూ యేలా! ఆకాశమంత రాగి ధ్వజం మోసుకు తిరుగుతావు గదా. దానిలో అర కాసంతయినా మహత్తు లేదా?'
మనవాళ్ళయ్య : 'మళ్ళీ మొదటికొచ్చింద'ని, సణుక్కుంటూ, కష్టం మీద మందలో దూరి అంతర్థానం అయిపోయినాడు.
నాంచా : 'రాముడే కాడు, ఏ దేవుడి మీదనయినా నిజమైన నమ్మకమన్నది ఏడిస్తే ఒక్క గుండవే కాదు, అన్ని కష్టాలూ తరించవచ్చును. నేను మా మామగారి పేరు స్మరిస్తూ గుండం తొక్కుతాను. నా వెంట రాగలిగిన వైష్ణవులెవరైనా వుంటే ఎదటికి రండి.'
యెవడూ పలుకలేదు.
నాంచారమ్మ : నిరసన నవ్వు నవ్వి 'ముసలాయనను అగ్గిలో తోసి పై నుంచి చూడడానికి మీరంతా వీరులా?'
యెవరూ ఉలకలేదు పలకలేదు.
నాంచారమ్మ అందరినీ కలయజూసి 'పీరు సాయీబు యిక్కడ లేడా?' అని అడిగింది. పీరు సాయీబు వెంటనే ఎదటికి వచ్చి 'అమ్మా, యిదిగో దాసుడ'ని చెయ్యి జోడించి నిలుచున్నాడు. పీరు సాయీబు దూదేకుల సాయీబు అయినప్పటికీ, రామభక్తుడు. కీర్తనలు చెప్పుతాడు. హటయోగం అభ్యసిస్తాడు.
'సాయీబు! నువ్వు గుండం తొక్కగలవా?' అని నాంచారమ్మ అడిగారు.
'మీ శలవైతే అవలీలగా తొక్కుతాను తల్లీ!' అని అన్నాడు.
నాంచారమ్మ : 'ఏడీ మనవాళ్ళయ్య? గరుడుడి అవతారం అంతర్థానమైపోయింది. రామినాయడా, పరమ భాగవతోత్తములై యుండిన్ని, మీరు యెవరూ గుండం తొక్కజాలినారు కాదుగదా? అట్టి స్థితిలో యీ పచ్చి తురకకీ గుండం తొక్కడానికి భగవంతుడు సాహస ధైర్యాలు యిచ్చాడు గనుక మీ వైష్ణవ మతం గొప్పా, అతగాడి తురక మతం గొప్పా? రామినాయడా, మీ దేవులాటంతా యీ రాత్రి వైష్ణవులు శైవులికి పరాభవం చెయ్యాలని గదా? అందుకు ఉపాయం చెబుతాను వినండి. మతాలు సాత్వికాలూ, తామసాలూ అని రెండు విధాలు. యీ రెండు విధాల మనుష్యులూ శైవుల్లోనూ, వైష్ణవుల్లోనూ కూడా ఉన్నారు. గుండాలు దొక్కడం మొదలైన తామస కృత్యాలు చేసే వాళ్ళని శైవుల్లో శివాచార్లు అంటారు. మన వైష్ణవుల్లో అట్టి కృత్యాలు చేసే తెగ కూడా వున్నారు. ఎవరో మీకు తెలుసునా?
మన వాళ్ళయ్య గుంపులో మరి వక పక్క నుంచి తన బుఱ్ఱ పైకి పెట్టి 'ఎవళ్ళమ్మా వాళ్ళు?' అని అత్యాతురతతో అడిగాడు.
మునసబునాయడు 'మరెవళ్ళు? సాతానోళ్ళు' అనేటప్పటికి, మనవాళ్ళయ్య బుఱ్ఱ మళ్ళీ మందలో మాయమైపోయింది.
నాంచారమ్మ : 'ఆ వైష్ణవులు ఎవరా? మరెవరు తురకలు? పీరు అనేది ఏమిటనుకున్నారు. శ్రీ స్వామివారి తిరునామమే. పట్టణంలో మా ఇంటి పక్కనే ఒక సాతాని పీర్లని నిలిపి గుండం తొక్కేవాడు. పట్టణంలో ఎంతో మంది హిందువులే పీర్ల పంజాలు వుంచి, గుండాలు తొక్కుతారు. గనక శ్రీరామ స్వామి వారి నామం తెచ్చి పీరు కట్టి యిస్తాను. ఆ పీరు పట్టుకు పీరు సాయీబు గుండం దొక్కుతాడు. పీరు సాయీబు యోగ్యత మీ రెరిగినదే. అతగాడు కబీరు దాసంత భక్తుడు. గనక భయాలు విడిచే అతని వెంట వెళ్ళి జయించుకురండి. వేళకి భక్తి నిలుస్తుందో నిలవదో చేతి కఱ్ఱలు మాత్రం మరవకండి?'
ఆమె విరమించేసరికి పెళపెళమని ఆ మూకలో నుండి మనవాళ్ళయ్య శ్లోక పఠనం ఉపక్రమించి యిటూ అటూ మనుషులను తోసుకుంటూ ఎదటికి వచ్చి సాష్టాంగం చేసి 'అమ్మా, మీరు సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి అవతారం. వైష్ణవ మతం నిలబెట్టారు. మతమే అన్న మాట ఏమిటి? మా ప్రాణాలు కూడా నిలబెట్టారు. ఇహ నా విజృంభణం చూడండి' అన్నాడు. మనవాళ్ళయ్య పెద్ద హికమద్దారుడు. ఆ రాత్రి వైష్ణవతంత్రం తరవాయి కథ అంతా అతనే నడిపించాడు.
అంతా చల్లారగానే అటక మీద నుంచి కృష్ణమాచార్యులు దిగాడు. కష్టసాధ్యమును సాధించిన సంతోషముతో, నాంచారమ్మ కరదీపం తిరిగి చేతపూని, ఇంటికి సవిలాసముగా నడిచి పోవుచుండగా పెనిమిటి ఎదురైనప్పుడు ఆమె ప్రేమ పరిహాసములు పెనగొను దృష్టితో చూసెను. ఆ దృష్టి తనకు దేవత్వమిచ్చి తన్ను అవతార పురుషుణ్ణి చేసిందని కృష్ణమాచారి మర్నాడు నాతో చెప్పి, ఆ అర్థంతో శ్లోకం రచించాడు. తమ రహస్య శృంగార చేష్టలు మిత్రులతో చెప్పితేనే గానీ కొందరికి తనవి తీరదు.
ఆ రాత్రి శివాచారు గుండం తొక్కడం చూడ్డానికి నేను వెళ్ళి వుంటిని. తెల్లవారగట్ల నాలుగు గంటల వేళ చిరి చీకటిలో గుండంలో నిప్పులు కణ కణలాడుచుండెను. ప్రాతఃకాలపు శీతగాలి సాగింది. ఒక్క పెట్టున గర్భ, నిర్బేధమయ్యేటట్టు శంఖాది వాద్యములు రేగాయి. ఇంగిలీషు చదువుతున్న నాస్తికాగ్రేసరులకు కూడా ఆ కాలమందు బితుకు కలిగిందని వారే చెప్పుకున్నారు.
పందిటిలో నుంచి వీరగంధాలు పూసుకున్న నలుగురు శివాచార్లు గుండం దగ్గరకు వచ్చి నిలుచున్నారు. ఒకడు నెత్తిమీద భీకరమైన రాగి ప్రతిమ పెట్టుకున్నాడు. ఎదురుగా నిలిచి మరీ వకడు కత్తి ఝళిపించుచూ వీర వాక్యాలు కొలిపాడు. ఒకడు గుండంలో నెయ్యిపోసి గుమ్మడికాయ తుండలు గుండంలోకి విసిరాడు. వెంటనే శివాచార్లు గుండం జొచ్చి నడుచుకుపోయినారు. అవతల వొడ్డు చేరి తిరిగి తొక్కుటకు వారు యిటు అభిముఖులై యుండగా, ''అల్లా-రామ్'' అని కెవ్వుమని ప్రళయమైన కేక ఒకటి వేసి, తక్షణం శివాచార్లు గుండం దిగిన వేపు నుంచి, మూకను చీల్చుకొని ఒక మనుష్య ప్రవాహము గుండము దాటుకుని పోయింది. వారిలో అందరున్నూ ముఖముల మీద ముసుగులు వేసుకున్నారు. ఆ మనుష్య ప్రవాహమునకు అగ్రమందు వెండి పీరు ఒకటి రెండు చేతులా పట్టి ఒక వీరుడు భీమునివలె నడుచుకుపోయినాడు. ఇది అంతా అర నిమిషం పట్టలేదు.
మూక, చకాపికలై చెదిరిపోయినది. కొందరు సాతాన్లకీ, శివాచార్లకీ కూడా యెత్కించిత్ కాళ్ళు కాలాయి. అది భక్తి లోపం కింద కట్టారు. తరవాత శరభయ్యకీ, మనవాళ్ళయ్యకీ రాజీనామా అయినదని అనుకుంటారు. పైకి మట్టుకు దెబ్బలాడుతున్నట్టే వుంటారు.
అదుగో, మా యింటికి యెదురుగా ఆ రచ్చసావిట్లో నిలిపిన పీరు ఆ పీరే. నాటి నుంచీ, ప్రతి సంవత్సరం ఆ పీరును పండుగ చేస్తారు. ఊరు ఆబాలగోపాలం శైవ, వైష్ణవ భేదం లేకుండా పీరు దేవరకు మొక్కులు చెల్లిస్తారు. త్రిశూలాకారం గనక ఆ పీరు శివపీరే అని శరభయ్య అంటాడు. ఆ వ్యవస్థదో వెంకయ్య పంతులుగారే చెయ్య సమర్థులు.
'శివుడూ విష్ణూ పీర్లే అయినప్పుడు, బుద్ధుడు శివుడు కారాదా?' అని శాయన్న భుక్త కథ పరిసమాప్తి చేశాడు.
మా గురువుగారు యీ చరిత్రకు చాలా ఆశ్చర్యపడి అన్నారు. 'ఔరా! కలికాలంలో మనుష్యులే కాదు. దేవుళ్ళు గూడా సంకరం అవుతున్నారు.'
'అయినా తప్పేమి? శివుడన్నా, విష్ణన్నా, పీరన్నా, బుద్ధుడన్నా, ఆ పరమాత్మ మట్టుకు ఒక్కడే గదా!' వెంకయ్య వూరుకుంటాడా, 'అందరు దేవుళ్ళూ వక్కరే అయితే, ఈ పీనుగుల్ని అందరినీ ఒక్కచోటే నిలిపి అందరూ కలిసి పూజ తగలెట్టరాదా?' అన్నాడు.
అంత, గురువుగారు 'ఓరి దేవుళ్ళని పీనుగులంటావురా? నువ్వు వొట్టి కిరాస్తానువి. యింకా కిరస్తానుకైనా దేవుడంటూ వున్నాడు; నువ్వు కిరాతుడివి. పీరో, బిట్రో, దెయ్యమో, దేవరో, యీ అజ్ఞులకు మూడభక్తి అయినా వుంది. నువ్వు అందరు దేవుళ్ళకీ ఒక పెద్ద నామం బెట్టావు.'
'ఒక్క మీకు తప్ప శాస్తులుగారూ,' అన్నాడు.
'నీ జన్మానికల్లా విలవైన మాట అంటివిరా' అని నేనన్నాను.
(ఆంధ్రభారతి, 1910 ఏప్రిల్, మే, జూన్ సంచికలు)