Jul 09,2023 08:59

కరోనా వ్యాధి రెండో అల తగ్గుముఖం పట్టింది. నెమ్మదిగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తున్నారు. 2021, జులై 17, ఆదివారం.. బ్రేక్‌ఫాస్ట్‌ చేసి, కాసేపు కళ్ళు మూశాను. సెల్‌ఫోన్‌ మోగితే లేచి, చేతిలోకి తీసుకున్నా.
'మన సుబ్బిగాడు ఊళ్ళోకి వచ్చాడు. రాత్రి వాళ్ళన్నయ్య ఇంట్లో భోజనం ఏర్పాటు చేశాడు. తొమ్మిదింటికల్లా రమ్మన్నాడు' అని మా చిన్ననాటి మిత్రుడు రామ్మోహనరావు చెప్పాడు. మేమంతా వాడిని ''యు'' గాడు అంటాము. వాడింటిపేరు ఉప్పలపాటి. ఇంకో క్లాస్‌మేట్‌ ఎస్‌.రామమ్మోహనరావు అని ఉండేవాడు. సుబ్బిగాడి పూర్తిపేరు సింగీతం వెంకట సుబ్బారావు. నా పేరు సత్యన్నారాయణ. నన్ను వాళ్లంతా సత్తిగాడంటారు.
మేం ముగ్గురం గవర్నర్‌పేటలో ఒకే వీధిలో ఉండేవాళ్లం. సుబ్బిగాడి నాన్న తాసీల్దారు. ఊరంతా ఆయన్ని పేరుపెట్టి కాకుండా తాసీల్దారనే పిలిచేవారు. చిల్లుకాని లంచం తీసుకోడు, మంచి ఆఫీసర్‌ అని పేరు. ఊళ్ళో ఐదెకరాలమ్మి సివిఆర్‌ స్కూల్‌ పక్క శేషాద్రిశాస్త్రి వీధిలో ఇల్లు కట్టాడు. మేం ముగ్గురం ఆ స్కూల్లో ఆరో క్లాస్‌ నుంచి పది వరకూ చదివాం. ఆ రోజుల్లో స్కూల్‌ గ్రౌండ్‌ చాలా పెద్దగా ఉండేది. డ్రిల్‌ మాస్టర్స్‌ ఉండేవారు. సాయంత్రం నాలుగు నుంచి గంటసేపు తప్పనిసరిగా డ్రిల్‌ చేయించేవారు. చీకటిపడే వరకూ రకరకాల ఆటలు ఆడేవాళ్లం. సినిమాలకు ముగ్గురం కలిసే వెళ్ళే వాళ్లం. క్రికెట్‌ మాచ్‌లు, ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ బాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్స్‌ కలిసి చూసేవాళ్ళం.
ముగ్గురం పదో తరగతి పాసవ్వగానే లయోలా కాలేజీలో చేరాము. సుబ్బిగాడు ఆర్ట్స్‌ తీసుకుని, బిఎ పూర్తిచేసి, ఐఎఎస్‌కి ప్రిపేర్‌ అయ్యి, రెండో ప్రయత్నంలోనే సెలక్టయ్యాడు. చాలాచోట్ల జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసి, సెంట్రల్‌ డెప్యుటేషన్‌ మీద ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు. ''యు'' గాడు ఇంజనీరింగ్‌ చదివి ఏదో పెద్ద కంపెనీలో 20 ఏళ్ళు పనిచేసి, వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని, మళ్ళీ విజయవాడ వచ్చాడు. నేను అగ్రికల్చర్‌ బిఎస్‌సి చేసి, మా పొలంలో వాణిజ్య పంటలతో కాలం గడుపుతున్నా.
రాత్రి తొమ్మిదింటికి ఇద్దరం వేర్వేరుగా సుబ్బిగాడి ఇంటికి వెళ్ళాం. వాడు మా ఇద్దరినీ సాదరంగా ఆహ్వానించి, డాబా పైకి తీసికెళ్లాడు. ఆరుబయట ముగ్గురం భోజనం చేస్తూ, చిన్ననాటి సంగతులు, స్నేహితుల గురించి, అప్పటి అల్లరి చేష్టలు అన్నీ గుర్తు చేసుకున్నాం. నోస్టాల్జియా అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. మళ్లీ ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుందో!
భోజనాల తర్వాత పిచ్చాపాటి మాట్లాడుతున్నాం. హఠాత్తుగా ''యు'' గాడు, 'సుబ్బీ నిన్ను టీవీలో చూశాను రా. రైతులతో మంత్రులు జరుపుతున్న చర్చల్లో నువ్వు మంత్రుల పక్కన ఉన్నట్లున్నావు. నిజమేనా? లేక మనిషిని పోలిన మనుషులుంటారు గదా. అట్లాంటిదేమన్నానా?' అన్నాడు.
'నిజమేరా! నువ్వు భలే గుర్తుపట్టావు రా. నేను ఈ చర్చల ప్రారంభానికి నెల ముందు వ్యవసాయ మంత్రి ఆఫీసులో జాయింట్‌ సెక్రటరీగా నియమించబడ్డా. అంతకుముందు ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాలలో పనిచేశాను' అన్నాడు సుబ్బిగాడు.
'చెప్పరా, రైతులు ఏడునెలలుగా ఇంత పట్టుదలగా ప్రదర్శనలు చేస్తున్నారు గదా. వాళ్ల కోర్కెలేమిటి? ఈ చట్టాలను ఇంత గట్టిగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకని? వాళ్ళంతా ఖలిస్తానీలనీ, చైనా, పాకిస్తాన్‌లు పంపిన డబ్బుతో ఇదంతా చేస్తున్నారని అంటున్నారు కదా! టీవీల్లో రకరకాల చర్చలు చేస్తున్నారు గదా!' అన్నాడు యు గాడు.
'పాలకపక్ష రైతుసంఘం అభిప్రాయం ఏమిటి? వాళ్లు ఈ ప్రదర్శనలో ఎందుకు పాల్గొనడం లేదు?' అని అడిగాను.
సుబ్బి చెప్పడం మొదలుపెట్టాడు..
'జూన్‌ 2020లో ఈ చట్టాల్ని ముందుగా ఆర్డినెన్స్‌ రూపంలో ప్రకటించారు. వెంటనే పంజాబ్‌ రైతుసంఘ నేతలు వీటిని వ్యతిరేకించి, ప్రదర్శనలు చేశారు. రైలు పట్టాలపై బైఠాయించారు. పంజాబులో రైళ్ళ రాకపోకలను ప్రభుత్వం నిలిపేసింది.
ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ రైతు సంఘాలు - భారతీయ కిసాన్‌ సంఫ్‌ు, స్వదేశీ జాగరణ మంచ్‌ దేశవ్యాప్తంగా 15వేల గ్రామాల్లో సభలు జరిపాయి. ఈ చట్టాలు కంపెనీలకు ఉపయోగపడతాయనీ, రైతు ప్రయోజనాలను కాపాడేవనీ, వీటిలో చాలా మార్పులు చేయాలని కోరుతూ కొన్ని లక్షల మంది సంతకాలతో వ్యవసాయ మంత్రికి విజ్ఞాపనలు పంపించారు. కొంతమంది అగ్రనేతలు ఆయనను కలిసి, తమ అభ్యంతరాలను వివరించారు. ఆయన వీరి దగ్గరేమో వీళ్ళు చెప్పేదానికి అంగీకరించి, తర్వాత మళ్ళీ చట్టాలకు మద్దతుగా మాట్లాడుతున్నారని వాళ్లు చెబుతున్నారు. అధికారులు ప్రధానిని తప్పుదారి పట్టిస్తున్నారని వారంటారు. అయినా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొనం, కానీ ఈ చట్టాలలో లోపాలు సవరించాలని వారు కోరుతున్నారు. ఈ విషయాలన్నీ 2020 డిసెంబరు 3, బిజినెస్‌ స్టాండర్డ్‌ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతీయ కిసాన్‌ సంఫ్‌ు జనరల్‌ సెక్రటరీ చెప్పాడు.
తర్వాత ఈ ఆర్డినెన్స్‌లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ప్రతిపక్షాలు వీటిని వ్యతిరేకించాయి. పార్లమెంటు స్టాండింగ్‌కమిటీ పరిశీలనకి పంపాలని పట్టుబట్టాయి.' అని చెబుతుంటే
'స్టాండింగ్‌ కమిటీకి పంపితే నష్టమేముంది?' అని అడిగాడు ''యు'' గాడు.
సుబ్బి నవ్వుతూ 'అదే గదా అసలు రహస్యం ఈ లాక్‌డౌన్‌లో ఈ చట్టాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రదర్శనలు జరపడం కుదరదు. స్టాండింగ్‌ కమిటీకి పంపితే, వారు రైతు సంఘాల నాయకులను, వ్యవసాయ రంగ నిపుణులను, వ్యవసాయోత్పత్తుల కంపెనీలను వాళ్ళ అభిప్రాయాలు తెలుపమని కోరతారు. ఈ తంతు అంతా ఒక ఆరునెలలు పడుతుంది. ఈ లోపు కరోనా వ్యాధి తగ్గిపోతే, రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేస్తారు.
అందుకే హడావిడిగా రాజ్యసభలో ఓటింగ్‌ అడిగినా పట్టించుకోకుండా మూజువాణి ఓటుతో నెగ్గేటట్లు చేశారు. వెంటనే రాష్ట్రపతి ఆమోదించారు. ఇవి చట్టాలుగా మారాయి.' అని అంటుంటే..
'అంత పట్టుదలగా ప్రభుత్వం ఎందుకుంది?' అని అడిగాను.
'ఈ చట్టాలను మీరెవరైనా చదివారా?' అని అడిగాడు సుబ్బిగాడు.
'చదవలేదు గానీ, ప్రధాని ఉపన్యాసం విన్నా. దేశంలో ఏ మూలకైనా వెళ్లి రైతు తన పంటను అమ్ముకోవచ్చనీ, రైతులకు విముక్తి ప్రసాదించుతున్నామనీ, రైతు ఆదాయం గణనీయంగా పెరుగుతుందనీ, అగ్రికల్చర్‌ మార్కెట్‌ వ్యవస్థ అలాగే ఉంటుందనీ, కనీస మద్దతు ధర ఎప్పటికీ ఉంటుందనీ బల్లగుద్ది చెబుతున్నాడాయన' అని అన్నాను.
'అరే సత్తి నువ్వు పండించే క్యాలీఫ్లవర్‌ పంటని కాశ్మీర్‌కీ, కన్యాకుమారికీ తీసికెళ్ళి అమ్మడం కుదరదంటావా?' అనడిగాడు ''యు'' గాడు.
'ఇది వరకు కూడా మనం తినే అరటిపళ్ళు మహారాష్ట్ర నుండి, ద్రాక్ష కర్నాటక నుండి, కమలా నాగపూర్‌ నుండి, యాపిల్స్‌ కాశ్మీర్‌ నుండి, హిమాచల్‌ప్రదేశ్‌ నుండి వస్తున్నాయిగా?!' అన్నాడు.
సుబ్బి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు.. 'మన దేశంలో రైతుల్లో నూటికి 85 మంది రెండెకరాలలోపు రైతులే. వాళ్ళ పక్క ఊరికి తమ పంట తీసికెళ్ళే తాహతు లేక పొలంలోనే వచ్చిన ధరకు అమ్ముకుంటారు. మార్కెట్‌యార్డ్‌లకు, మండీలకు పెద్దరైతులు తీసికెళతారు. అక్కడ కొంత మధ్యవర్తుల మోసం ఉండడం నిజమే. అదే మండీ బయట ఎవరికి బడితే వారికి అమ్మితే వాళ్ళు డబ్బు ఎగవేస్తే ఎవరికి చెప్పుకుంటారు? ఈ నీరుకావి పంచల వాళ్ళు కలెక్టర్‌ ఆఫీస్‌కి వెళ్తే వీళ్ళని బిళ్ళ బంట్రోతు లోపలికి రానిస్తాడా? ఇవన్నీ పేపరు మీద బాగుంటాయి గానీ, ఆచరణకు నోచవు. ఈ చట్టాలను నేను నెలపాటు అధ్యయనం చేశాను. ఈ చట్టాల భాష మా అధికారులు రాసే భాష కాదు. ఇవి లాయర్లు తయారుచేసిన చట్టాలు. పూర్తిగా కంపెనీల ప్రయోజనాలు కాపాడే చట్టాలివి. రైతుల బాగు కోసం చేసిన చట్టాలు కావివి. 1980 దశకంలో ఇలాంటి చట్టాలనే అమెరికాలో చేశారు. వాటివల్ల చిన్నరైతులు నాశనమయ్యారు. తమకున్న పొలాలను అమ్ముకుని, పట్టణాలకు వలసపోయి, కూలిపని, వాచ్‌మెన్‌ పని చేసుకుని బతుకుతున్నారు. కొన్నివేల కోళ్ళ ఫారాలు మూతపడ్డాయి.
అమెరికాలో ఇప్పుడు కొంతమంది పెద్ద రైతులే మిగిలారు. ఒక్కొక్క కమతం 500 ఎకరాలకు పైన, కొన్ని కమతాలు వేల ఎకరాలలో ఉంటాయి. వ్యవసాయమంతా యంత్రాలతో చేస్తారు. ప్రభుత్వం కొన్ని వందల కోట్ల డాలర్లు సబ్సిడీగా ఇచ్చినా, ఏటా కొన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.' అని చెప్తుంటే..
'1991లో పివి నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ చేసిన లిబరలైజేషన్‌ వల్ల పారిశ్రామిక రంగం బాగుపడింది గదా!' అన్నాడు ''యు'' గాడు.
'లిబరలైజేషన్‌ వల్ల పరిశ్రమల మధ్య పోటీ పెరిగి, ప్రజలకు మంచి వస్తువులు చౌకగా అందుబాటులోకి వచ్చాయి. నిజమే. కానీ ఒక పెన్‌ గానీ, సెల్‌ఫోన్‌ గానీ తయారుచేసిన ధరకూ, మార్కెట్లో అమ్మే ధరకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎంఆర్‌పి ధర, తయారీ ధరకి కొన్ని రెట్లు ఉంటుంది. వ్యవసాయంలో అలాకాదు. రోజురోజుకీ వ్యవసాయానికీ అవసరమైన విత్తనాలు, ఎరువులు క్రిమిసంహారక మందులు, పంప్‌ సెట్స్‌కి కావలసిన డీజిల్‌ ధరలు పెరుగుతూ ఉంటాయి. ట్రాక్టర్ల, టైర్ల ధరలు పెరుగుతుంటాయి. వ్యవసాయ కార్మికుల వేతనాలు పెరుగుతాయి.
అకాల వర్షాల వల్ల పంట నష్టం జరుగుతుంది. కల్తీ ఎరువులు, క్రిమిసంహారక మందులు, కల్తీ విత్తనాల వల్ల పంట దిగుబడి ఉండదు. కల్తీ సరుకులమ్మే కంపెనీలను నియంత్రించాల్సిన అధికారులు లంచం తీసుకుని కంపెనీలను చూసీ చూడనట్లు వదిలేస్తారు. క్రిమి సంహారక కంపెనీలు విపరీతమైన లాభాలు సంపాయిస్తాయి. వాళ్లమ్మే మందుల వల్ల క్రిములు చావవు గాని, ఆ మందులు తాగి, రైతులు చనిపోతున్నారు.
ఎక్కువ మంది రైతులకు బ్యాంకు రుణాలు దొరకవు. చక్రవడ్డీకి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకుంటారు. పంట రాగానే వచ్చిన ధరకు అమ్ముకొని ఆ వడ్డీ వ్యాపారుల దగ్గరే విత్తనాలు, ఎరువులు కొంటారు. అందువల్ల కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్మితే దివాళా తీయాల్సిందే. అందుకే గత 50 ఏళ్లుగా ఏటా కొన్ని లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనదేశ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ ఎంతో మీకు తెలుసా?' అని అడిగాడు సుబ్బిగాడు.
'తెలియదు' అన్నాం.
'దాదాపు సాలీనా 65 లక్షల కోట్ల వ్యాపారమిది. కరోనా వచ్చినప్పుడు లాక్‌డౌన్‌లో చూశాం గదా.. ఏది లేకపోయినా గడుస్తుంది గాని, తిండి లేకుండా గడవదు గదా! ఈ వ్యాపారం చేజిక్కించుకోవాలని దేశీయ, విదేశీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. రైతుల దగ్గర నుండి తక్కువ ధరకు కొని, నిల్వ చేసి, కొంత ప్రాసెసింగ్‌ చేసి, విపరీతమైన లాభం కలుపుకొని వినియోగదారులకు అమ్ముతారు. ఆ వచ్చే లాభాల్లో కొంత భాగం పాలకపార్టీకి చందాగా ఇస్తారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను తమ చెప్పుచేతులలో ఉంచుకుంటారు. అందుకే రైతులు ఇంత వ్యతిరేకిస్తున్నా ఈ చట్టాలను అమలు చేయాలని చూస్తున్నారు. కనీస మద్దతు ధరకి చట్టరూపం ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు.' అని చెప్తుంటే..
'మన ప్రధాని గుజరాత్‌ సిఎంగా ఉన్నప్పుడు కనీస మద్దతు ధర చట్టబద్ధం చేయాలని అప్పటి ప్రధానిని కోరాడు గదా!' అని అన్నాడు ''యు''గాడు.
'అదే గదా రైతులు నెత్తీనోరూ కొట్టుకొని అడుగుతున్నారు. దానికి సమాధానం ఇవ్వరు' అన్నాడు సుబ్బిగాడు.
'అసలు ప్రధానమంత్రి రైతులతో చర్చలలో ఎందుకు పాల్గోడు?' అడిగాడు ''యు'' గాడు.
'ఆయనను అడిగే అవకాశం ఎక్కడా? ఎక్కడైనా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెడితే గదా?' అన్నాడు సుబ్బి.
'సరే ఈ రైతు నాయకుల సంతేమిటి? ఇన్ని లక్షల మందిని ఎలా సమీకరించగలిగారు? మనం పది మందితో సమావేశం ఏర్పాటు చేద్దామని ప్రయత్నిస్తే నలుగురు కూడా రారు. ఇంతమంది ఈ ప్రదర్శనల్లో ఎలా పాల్గొన్నట్లు? ఇదంతా ఎలా సాధ్యం?' అని అడిగాను.
సుబ్బిగాడు మళ్ళీ చెబుతూ..'పంజాబులో ఆరు నెలలు రకరకాల పద్ధతుల్లో వాళ్ళ వ్యతిరేకత తెలిపారు. సిఎం నివాసం ముందు ధర్నాలు చేశారు. రిలయన్స్‌ పెట్రోల్‌ బంకులను, మాల్స్‌ని మూసేటట్లు చేశారు. కేంద్రానికి విజ్ఞాపనలు పంపారు. అయినా చలనం లేదు.' అన్నాడు.
'ఒకసారి చర్చలకు ఢిల్లీకి పిలిచారట గదా!' అన్నాను.
'ఆ సమావేశానికి వ్యవసాయమంత్రి రాలేదు. కార్యదర్శి ఈ చట్టాలు రైతులకు ఎంత మేలు చేస్తాయో వివరించాలని ప్రయత్నించారు. రైతు నాయకులు మంత్రి రానందుకు నిరసనగా సమావేశం నుంచి బయటకి వెళ్ళిపోయారు. తర్వాత నవంబర్‌ 26, 2020న ఢిల్లీకి ప్రదర్శనగా వస్తున్నామని, రాంలీలా మైదానంలో బైఠాయింపు చేయడానికి అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సందేశం పంపారు. నవంబర్‌ 26న పంజాబు నుంచి ప్రదర్శనలు బయల్దేరాయి. హర్యానా ప్రభుత్వం తమ భూభాగంలోకి రాగానే వీల్ళని ఢిల్లీ వెళ్ళకుండా రహదారులలో కందకాలు తవ్వించింది. పోలీసులు నీటి ఫిరంగులు, భాష్ప వాయువు ప్రయోగించారు. పొలంలో కాయకష్టం చేసే రైతులకు ఈ గోతులు, నీటి ఫిరంగులు ఒక లెక్కా, వాటిని అధిగమించి ఢిల్లీ సరిహద్దులకు వచ్చారు. అక్కడ పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేసి, ఢిల్లీ స్టేడియంలో బంధించాలని అనుకున్నారు. కానీ ఢిల్లీ ప్రభుత్వం స్టేడియం అప్పగించ నిరాకరించింది. రైతు నేతలు కూడా ఢిల్లీ పోలీసుల పన్నాగం పసిగట్టి సరిహద్దులలోనే ఆగి, అక్కడే ప్రదర్శనకు ఏర్పాట్లు చేసుకున్నారు. తప్పని పరిస్థితుల్లో రైతు నాయకులతో చర్చలకు ప్రభుత్వం ఒప్పుకుంది' అని చెప్పాడు సుబ్బిగాడు.
'వీళ్ళంతా ఖలీస్తానీలని, పాలకపార్టీకి చెందిన మంత్రులు, నేతలు, అధికారపార్టీ కిరాయి ప్రచారకర్తలు అంటున్నారు గదా!' అని అన్నాను.
ొొొ
'చర్చలకు మూడు రోజుల ముందు నన్ను మంత్రి పిలిచి, ''రావుగారూ, ఈ చర్చలలో మాతో, సెక్రటరిగారీతో పాటు మీరూ పాల్గొనండి. మీతో కొత్తగా వచ్చిన ఆఫీసర్‌ మీనా గారు ఉంటారు. మీరేం చేయాలో ఆయన మీకు వివరిస్తారు'' అని అన్నారు. నా రూమ్‌లోకి వచ్చిన కొంతసేపటికి కొత్త ఆఫీసర్‌ వచ్చాడు. ''రావు గారూ నా పేరు మీనా. నేను ఇంటిలిజెన్స్‌ డిపార్ట్మెంట్‌ నుంచి మీ డిపార్ట్మెంట్‌కు వచ్చా. గత ఆరునెలల నుంచి ఈ రైతు ఉద్యమం, దానికి నాయకత్వం వహిస్తున్న వారి సమాచారం సేకరిస్తున్నాను. చర్చలు జరిగేటప్పుడు మీ పక్కనే ఉండి వారి గురించి మీకు పూర్తి సమాచారం ఇస్తాను. మనిద్దరం రైతు నేతలను కలిసి, ముఖ్యంగా ఏ కోరికలు తీరిస్తే వారు ఉద్యమాన్ని విరమిస్తారో తెలుసుకుందాం!'' అన్నాడు.
చర్చలు మొదలయ్యాయి. మంత్రులు రావడం కొంత లేటైంది. పక్కనే ఉన్న మీనాను అడిగాను. ''మీనా గారూ మనకెదురుగా ఎడమపక్క, చివర కూర్చున్న సర్దార్జీ ఎవరు?'' అని అడిగాను. ''ఆయన జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌. వయస్సు 75 సంవత్సరాలు. పంజాబులో ఉన్న రైతు సంఘాలలో ఆయనదే పెద్దది. చిన్న రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు, మహిళలు కూడా వీళ్ళ సంఘంలో గణనీయంగా ఉన్నారు. 1975లో భారత సైన్యంలో చేరారు. రిటైర్‌ అయ్యాక రైతు సమస్యల మీద పనిచేస్తున్నారు. మాల్వాలో కొన్ని లక్షల మందికి ఆయన చెప్పిందే వేదం. నిప్పుల్లో దూకమంటే దూకే భక్తులున్నారాయనకు. ఆయన పక్క కళ్ళజోడుతో, తలపాగా లేని పెద్దాయన డాక్టర్‌ దర్శన్‌పాల్‌. ఎంబిబిఎస్‌, ఎండి ఎనస్తీషియా చేసి, పంజాబు ఆరోగ్య శాఖలో కొన్నాళ్లు పనిచేశారు. వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుని, రైతుసంఘం స్థాపించి, చాలా ఏళ్లుగా రైతు కూలీల సమస్యలను పరిష్కరించే కృషి చేస్తున్నాడు. ఈ 31 సంఘాలను ఒకచోట చేర్చింది ఆయనే.' అని చెప్పారు మీనా. ''ఆయన పక్కన ఉన్న మహిళ ఎవరు?'' అడిగాను. 'ఆమె పేరు కవితా కురుగంటి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది. గత 23 ఏళ్ల నుంచి మహిళా రైతులలో పనిచేస్తోంది. బి.టి.వంగ, బి.టి. పొద్దుతిరుగుడు పంటలకి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసింది. కేంద్రప్రభుత్వ కమిటీలలో మెంబరుగా పనిచేసింది. సాంప్రదాయ పంటలని, వైవిధ్య పంటలని ప్రోత్సహించాలని, చౌక దుకాణాలలో, బియ్యం, గోధుమ, పప్పు ధాన్యాలతో పాటు రాగి, జొన్న, సజ్జ వంటివి కూడా ప్రజలకు అందించాలంటుంది. దేశవ్యాపితంగా 400 సంస్థలను కలిపి, ఆశా అనే సంస్థను స్థాపించింది. కిసాన్‌ ముక్తిమోర్చా అనే పేరుతో లక్షమంది రైతు కూలీలను 2018, నంబర్‌లో పార్లమెంటు ముందుకు ప్రదర్శనగా తీసుకొచ్చిన వారికి నాయకత్వం వహించింది' అని వివరించాడు మీనా. ''వీళ్లందరూ పల్లెటూరి బైతులనుకున్నానే?!'' అన్నాను నేను.
'లేదు సార్‌. మన ఎదురుగా కూర్చున్న సర్జార్‌ జీ బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ ఎం.ఎ చదివారు. వయస్సు 72 ఏళ్లు. చక్కటి ఇంగ్లీష్‌ మాట్లాడతారు. ఆయన పక్కన ఉన్న యువ సర్దార్జీ భూపేంద్రసింగ్‌ లాంగ్వాల్‌. ఆయనా రాజనీతిశాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌.' అని వివరించారు మీనా. ''వీళ్ళంతా పంజాబ్‌ నుంచే వచ్చారంటున్నారు గదా!'' అని అన్నాను. 'లేదు సార్‌, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, మహారాష్ట్ర నుంచి ఉన్నారు. మీ తెలంగాణా నుంచి కూడా ఉన్నారు. రాజేవల్‌కి కుడిపక్కన ఉన్నాయన శివకుమార్‌ శర్మ. ఆయనని కక్కాజీ! అని పిలుస్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ కిసాన్‌సంఫ్‌ులో రెండేళ్లు పనిచేసి, బయటకు వచ్చి, వేరే సంఘం స్థాపించారు. గత 20 ఏళ్ళ నుంచి మధ్యప్రదేశ్‌లో అనేక ఉద్యమాలు నడిపాడు. ఆయన ఎం.ఎ, ఎల్‌ఎల్‌బి చేసి, కొన్నాళ్లు లాయర్‌గా పనిచేశాడు. 2017లో మాన్సార్‌లో జరిగిన పోలీస్‌ కాల్పుల్లో, ఈయన అనుయాయులు ఐదుగురు చనిపోయారు. ఇప్పటికి 44 సార్లు ఈయనను జైల్లో పెట్టారు.
మనకు కుడిపక్క చివరన ఉన్న పెద్దాయన హన్నన్‌ మొల్లా. ఎనిమిదిసార్లు లోక్‌సభకు సిపిఎం తరపున బెంగాల్‌ నుంచి ఎన్నికయ్యారు.

మిగతాభాగం వచ్చే సంచికలో

డాక్టర్‌ ఎస్‌ సుధాకర్‌