
ప్రజాశక్తి-అమరావతి :కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా టిడిపి ఎంపి కేశినేని నాని ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని హైకోర్టు సమర్ధించింది. ఈ వ్యవహారంపై వైసిపి కౌన్సిలర్లు అభ్యంతరం లేవనెత్తడాన్ని కొట్టేసింది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగేందుకు అనుమతివ్వాలని కోరుతూ నాని దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హత లేదని వైసిపి కౌన్సిలర్ల వాదనను తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ డి రమేష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనే నాని ఓటు హక్కు వినియోగానికి అనుమతించిన హైకోర్టు ఫలితాన్ని వెల్లడించవద్దని చెప్పింది. ఇప్పుడు తుది నిర్ణయాన్ని వెలువరించింది.