
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) స్థానంలో గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జిపిఎస్) అమలు చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అలాగే 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు సర్వీసు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులను మాత్రమే క్రమబద్ధీకరించాలని నిర్ణయించడంతో ఇప్పుడు పని చేస్తున్న వేలాదిమంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన వైసిపి ప్రభుత్వం నాలుగేళ్లు గడిచాక ఇలా ప్రకటించడం దాని విశ్వసనీయతను దెబ్బతీసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలోనూ అదే పరిస్థితి. మాట తప్పం.. మడమ తిప్పం.. అన్న ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం తగదు. ఎన్నికల హామీల మేరకు ఒపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని వర్తింపజేస్తేనే ఈ సర్కారు మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. కనుక మంత్రివర్గ నిర్ణయాలను పున:సమీక్షించడం అవసరం. 'పెన్షన్ భిక్ష కాదు... అది ఉద్యోగి హక్కు' అన్న విషయం మరువరాదు.
ఉద్యోగ విరమణ చేసేనాటికి పొందే మూలవేతనంలో 50 శాతం మొత్తాన్ని ఉద్యోగికి పెన్షన్గా చెల్లించేలా జిపిఎస్ను రూపొందించామనీ, ఇది దేశానికే ఆదర్శం అవుతుందని ప్రభుత్వ పెద్దలంటున్నారు. సిపిఎస్ లో మాదిరిగానే జిపిఎస్లో కూడా ఉద్యోగి జీతం నుండి పది శాతాన్ని రికవర్ చేస్తామంటూ ఇదే ఆదర్శమంటే ఎలా? కాకపోతే ఉద్యోగి రిటైర్మెంట్ నాటికి పొందే మూల వేతనంలో 50 శాతం పెన్షన్, దానిపై డియర్నెస్ రిలీఫ్ ఇస్తామన్న ప్రతిపాదన గతం కంటే కొంత మెరుగనిపిస్తుంది. కాని, జిపిఎస్ ఉద్యోగికి పూర్తి స్థాయి భద్రతను ఇవ్వదు. దానికి చట్టబద్ధత ఏమిటి? పిఎఫ్ఆర్డిఎ చట్ట పరిధిలోనే కొనసాగుతూ ఉద్యోగి ఇలాంటి గ్యారెంటీలను పొందే అవకాశం ఉంటుందా? కేంద్ర చట్టానికి, రాష్ట్ర చట్టానికి మధ్య ఏ అంశంలోనైనా వైరుధ్యం తలెత్తితే అమలయ్యేది కేంద్రం మాటే కదా! బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి సిపిఎస్ను కేంద్రం వదులుకుంటుందా? వారిని నడిపిస్తున్న కార్పొరేట్లు తమ షేర్ మార్కెట్కు చేరుతున్న లక్షల కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్మును కాదంటాయా? నయా ఉదారవాద ఆర్థిక విధానాల చట్రంలో మోడీ సర్కారు పెట్టే షరతులను తు.చ. తప్పక అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందా? కనుక ఏతావాతా పరిశీలిస్తే జిపిఎస్ అనేది సిపిఎస్ను మరో రూపంలో అమలు చేయడమేనన్న పరిశీలకుల మాట సత్య దూరం కాదు.
రాష్ట్రంలో 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు సర్వీసు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంవల్ల సుమారు 10 వేల మంది లబ్ధి పొందుతారని సర్కారు పెద్దలు చెబుతున్నారు. కానీ ఆ కటాఫ్ తేదీ మూలంగా దాదాపు దాదాపు ఎనిమిది వేల మంది నష్టపోతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. రెండు వేల మంది కాంట్రాక్టు లెక్చరర్లు, సుమారు 800 మంది సిఆర్టిలు రెగ్యులర్ కాని పరిస్థితి ఏర్పడుతోంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వ్యధ వర్ణనాతీతం. వివిధ యూనివర్సిటీలు, ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్న టైమ్స్కేల్, ఫుల్టైమ్, కంటింజెంట్, డైలీ వేజ్, పార్ట్టైమ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఐదేళ్లు కాంట్రాక్టు సర్వీస్ పూర్తి చేసుకున్న వెంటనే ఉద్యోగి రెగ్యులర్ అయ్యేలా చర్యలు చేపట్టాలని, రెగ్యులరైజేషన్ లోగా రిటైర్ అవుతున్న ఉద్యోగులకు పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్న ఆయా సంఘాల డిమాండ్లు అత్యంత న్యాయ సమ్మతమైనవి. ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం దాని బాధ్యత. ఏది ఏమైనప్పటికీ ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పోకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి, అందరి ఏకాభిప్రాయంతో ముందుకు పోవాలే తప్ప గతంలో మాదిరిగా నిర్బంధ మార్గం పట్టరాదు.