
మీడియా స్వేచ్ఛపై మోడీ ప్రభుత్వ దాడిని ఖండిస్తూ ... నేడు రాష్ట్రవ్యాపితంగా నిరసనలకు ఎపిడబ్ల్యుజెఎఫ్ (ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్) పిలుపునిచ్చింది. భావ ప్రకటనా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్న నరేంద్ర మోడీ చర్యలను ఖండిస్తూ ... రాష్ట్రంలోని పాత్రికేయులూ, ప్రజాతంత్రవాదులూ నిరసనగళమెత్తారు.

విజయవాడ : బిబిసి పై దాడులను నిరసిస్తూ ... ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) విజయవాడ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటరులోని ధర్నా చౌక వద్ద శుక్రవారం ఉదయం ధర్నా నిర్వహించారు.

ఒంగోలు : బిబిసి పై ఆదాయ పన్ను శాఖ దాడులను నిరసిస్తూ ... రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఒంగోలు కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఉదయం నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు కలెక్టరుకు వినతిపత్రాన్ని ఇచ్చేందుకు వెళుతున్న సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ గేటు వద్ద బయట నుంచి నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ఎస్.దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కు జర్నలిస్టులు వినతిపత్రాన్ని అందజేశారు.

ఏలూరు : మీడియా సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంభించడం, భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గమని ఏలూరులో పలువురు మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. బిబిసి సంస్థపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి కోఆర్డినేషన్ కమిటీ, ఏలూరు, దెందులూరు పెడరేషన్ కమిటీల ఆధ్వర్యంలో ఏలూరులోని కలెక్టరేట్ వద్ద శుక్రవారం పాత్రికేయులు ధర్నా నిర్వహించారు.

ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి) : ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే మీడియాపై కేంద్ర ప్రభుత్వ దాడిని ఖండిస్తూ రాజవొమ్మంగి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు శుక్రవారం స్థానిక తహాశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


