Nov 29,2022 12:52

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో సేవలు మంగళవారం దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు కాలింగ్‌, మెసేజింగ్‌ వంటి సమస్యల్ని ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచే జియో సేవలు నిలిచిపోయాయని పలువురు యూజర్లు సోషల్‌మీడియాలో ఫిర్యాదు చేశారు. జియో సేవలు నిలిచిపోవడంతో.. కొందరు మొబైల్‌ డేటా సర్వీసెస్‌ను మాత్రం వినియోగించుకోగలిగారు. ఇక ఈ విషయంపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వైరల్‌గా మారాయి. గతంలోనూ.. జియో సేవలు నిలిచిపోయాయి. ఆ సమయంలో కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలపై దాదాపు మూడు గంటలపాటు ప్రభావితమైన సంగతి తెలిసిందే.
కాగా, జియో సేవలు నిలిచిపోవడంతో పలువురు యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ యూజర్‌ తన మొబైల్‌ ఫోన్‌లో ఉదయం నుంచి సిగల్‌ లేకపోవడంతో, ఫోన్‌కాల్స్‌ చేయలేకపోయినట్లు ట్వీట్‌ చేశాడు. ఇక మరో యూజర్‌ సాధారణ కాల్స్‌లోనే సమస్యలు ఉన్నప్పుడు 5జీ సేవలు ఎలా అందిస్తారని రిలయన్స్‌ కంపెనీని ప్రశ్నించాడు. కమ్యూనికేషన్‌ లేకపోవడం వల్ల తన ఫ్లైట్‌ మిస్సయిందని.. దీనికెవరు పరిహారం చెల్లిస్తారంటూ మరో యూజర్‌ ప్రశ్నించాడు. ప్రస్తుతం ట్విట్టర్‌లో  #Jiodown ట్రెండ్‌ అవుతుంది. అయితే ఇప్పటివరకు జియో సేవలు నిలిచిపోవడంతో రిలయన్స్‌ కంపెనీ స్పందించలేదు.