
98 శాతం జిపిఎస్ పాఠశాలలు ఒక ఉపాధ్యాయునితోనే నడుస్తున్నాయి. ఒక ఉపాధ్యాయునితో గిరిజన బాలబాలికలకు నాణ్యమైన విద్య ఎలా వస్తుందో ప్రభుత్వం, అధికారులు చెప్పాలి. ఉపాధ్యాయుడు ఎప్పుడైన అత్యవసర పని ఉండి సెలవు పెడితే, ఆరోజు మధ్యాహ్న భోజనం కోసం మాత్రమే బడి నడుస్తుంది. విద్యారంగ సంస్కరణలను అమలు చేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందుల గురించి యుటిఎఫ్ చెప్పినా అధికారులు చెవికెక్కించుకోలేదు. కొన్ని గ్రామాల్లో బడి ఈడు కలిగిన బాలబాలికలు ఆడుకుంటున్నారు. లేదా తల్లిదండ్రుల పనిలో నిమగమవుతున్నారు. బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉంటే గిరిజన అభివృద్ధి సాధ్యమేనా ?
చదువు చైతన్యాన్ని ఇస్తుంది. నాగరికతను నేర్పుతుంది. జీవన ప్రమాణాలను పెంచుతుంది. అలాంటి చదువును ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని అందరికీ నేర్పాలి. నేర్చుకోవడానికి కావలసిన పరిస్థితులను కల్పించాలన్న సంకల్పంతో గిరిజన ప్రాంతాలలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను స్థాపించారు. 1976 నుండి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ బాధ్యతను చూస్తున్నది. గిరిజన విద్యారంగ సంస్కరణలలో భాగంగా 2006లో ప్రాథమిక పాఠశాలలను విభజించి ఒకటి రెండు తరగతులతో జిపిఎస్ పాఠశాలలు, 3-10 తరగతులతో ఆశ్రమ పాఠశాలలు ఏర్పరిచారు. ప్రాథమిక పాఠశాలల విభజన వద్దని పోరాటం చేసిన చోట కొన్ని పాఠశాలలు 1 నుంచి 5 వరకు యథాతథంగా కొనసాగుతున్నాయి. జిపిఎస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎక్కువ శాతం ఒక ఉపాధ్యాయునితోనే నడుస్తున్నాయి. గిరిజన విద్యారంగ సమస్యలను గుర్తించి అధికారులకు, ప్రభుత్వానికి యుటిఎఫ్ విన్నవించినా, పోరాటాలు చేసినా ఎలాంటి పరిష్కారాలకు నోచుకోలేదు.
ఈ నేపథ్యంలో గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారానికి యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 17 నుండి 22 వరకు అన్ని ఐటిడిఎల లోని ఆశ్రమ, జిపిఎస్ పాఠశాలలను జీపు జాతా ద్వారా సందర్శించడం జరిగింది. ఈ జాతాలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలతో పాటు యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు. గతంలో గుర్తించిన సమస్యలతో పాటు, గిరిజన పాఠశాలల చుట్టూ అనేక సమస్యలను జాతా బృందం గుర్తించింది.
పాఠశాలల పరిస్థితి
ఆశ్రమ పాఠశాలలు, 3-10 తరగతుల పాఠశాలలు, పోస్ట్మెట్రిక్, గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు అన్నీ కలిపి 748 పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు జిపిఎస్ 1-2 తరగతి పాఠశాలలు 1933 ఉన్నాయి. 98 శాతం జిపిఎస్ పాఠశాలలు ఒక ఉపాధ్యాయునితోనే నడుస్తున్నాయి. ఒక ఉపాధ్యాయునితో గిరిజన బాలబాలికలకు నాణ్యమైన విద్య ఎలా వస్తుందో ప్రభుత్వం, అధికారులు చెప్పాలి. ఎవరైనా ఉపాధ్యాయుడు అత్యవసర పని ఉండి సెలవు పెడితే, ఆరోజు మధ్యాహ్నం భోజనం కోసం మాత్రమే బడి నడుస్తుంది. విద్యారంగ సంస్కరణలను అమలు చేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందుల గురించి యుటిఎఫ్ చెప్పినా అధికారులు చెవికెక్కించుకోలేదు. కొన్ని గ్రామాల్లో బడి ఈడు కలిగిన బాలబాలికలు ఆడుకుంటున్నారు లేదా తల్లిదండ్రుల పనిలో నిమగమవుతున్నారు. బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉంటే గిరిజన అభివృద్ధి సాధ్యమేనా ?
విద్యార్థుల సమస్యలు
ఇప్పటికీ 2019 నాటి మెస్ చార్జీలనే కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు కడుపు నిండా భోజనం అందుతున్న పరిస్థితులు లేవు. రోజుకు మూడు-నాలుగు తరగతుల వారికి 33.34 పైసలు, 5-10 తరగతుల వారికి 41.66 పైసలు, ఇంటర్ వారికి 46.67 పైసలు మాత్రమే మెనూ ఛార్జీలు ఇస్తున్నారు. ఈ రోజుకి పెరిగిన రేట్లు ప్రకారం కాకుండా మూడు సంవత్సరాల క్రితం మెనూ చార్జీల ద్వారా ఎలాంటి నాణ్యమైన పోషక పదార్థాలు అందుతాయో కళ్లారా చూశాక మనసు ద్రవించిపోయింది. అర్థాకలితో గిరిజన బిడ్డలు చదువు నేర్చుకుంటారా? ప్రభుత్వం ఎందుకని ఈ మెస్ చార్జీల పెంపు వైపు ఆలోచించటం లేదు? 2019కి ముందు నాలుగు జతల యూనిఫామ్లు, ఒక జత వైట్ బట్టలు ఇచ్చేవారు. ఇప్పుడు మూడు జతల బట్టలు మాత్రమే ఇస్తున్నారు. గతంలో 22 నోట్ పుస్తకాలు ఇస్తే, ప్రస్తుతం 9 లేక 12 నోటు పుస్తకాలు ఇస్తున్నారు. కాస్మొటిక్ వస్తువుల సరఫరా లేదు. అనారోగ్యం వస్తే హాస్టల్లో ఎఎన్ఎం లేరు. ప్రాథమిక ఆసుపత్రికి తీసుకు వెళ్లడానికి వాహన సదుపాయాలు లేవు. విద్యార్థుల్ని ఉపాధ్యాయుల సొంత ఖర్చుతోనే ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. హాస్టల్కి కావలసిన వస్తువులను పాఠశాల కేంద్రానికి సరఫరా చేయడానికి ఏర్పాట్లు లేవు. సెలవులకి ఇంటికి వెళితే మరల పాఠశాలకు రావడానికి బస్సు ఛార్జీలు లేక సకాలంలో బడికి రాని విద్యార్థుల సంఖ్య తక్కువేమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చదువు సాగించడం సాధ్యమా? మెనూ ఛార్జీలను నేటి రేట్ల ఆధారంగా సవరించాలి. గతంలో లాగా ఐదు జతల బట్టలు, కాస్మొటిక్ చార్జీలు చెల్లించాలి.
ఉపాధ్యాయుల సమస్యలు
నియమించబడింది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి. చేస్తున్నది అటెండర్ నుంచి ప్లంబర్ పని వరకు అన్నీ. బోధనేతర కార్యక్రమాలతో వేదనకు గురవుతున్నారు. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకునే దానికోసం వార్డెన్ల డ్యూటీ చేస్తున్నారు. 98 శాతం ఆశ్రమ పాఠశాలలో వార్డెన్లు లేరు. ఉపాధ్యాయులే డిప్యూటీ వార్డెన్గా పనిచేస్తున్నారు. కొన్ని ఐటిడి లలో ఒకటి లేదా మూడు సంవత్సరాల చొప్పున రొటీన్ పద్ధతిలో ఒక్కొక్కరు, కొన్ని ఐటిడిఎ లలో మూడు నెలలకు ఒకరు చొప్పున ఉపాధ్యాయులే డిప్యూటీ వార్డెన్గా ఉంటున్నారు. ఈ కాలంలో విద్యార్థులకు ఇబ్బంది వస్తే తన ఉద్యోగం ఎక్కడ పోతుందోననే భయంతో ఏఎన్ఎం లను కుక్ లను, కమాటీలను సొంత డబ్బులు ఇచ్చి నియామకం చేసుకుంటున్నారు. పొరపాటున ఎక్కడైనా విద్యార్థికి ఇబ్బంది వస్తే వీరిని దోషులుగా చేసి శిక్షిస్తున్నారు. కొన్ని చోట్ల ఎలక్ట్రీషియన్ డ్యూటీ కూడా ఉపాధ్యాయులే చేస్తున్నారు. రాత్రి బస ఉండటానికి ఉపాధ్యాయులకు ప్రత్యేక గదులు, క్వార్టర్లు లేవు. అయినా రాత్రి బస చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టు జీవో 3 రద్దు చేశాక ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. దానితోపాటు గిరిజన సంఘం వారు కోర్టుకు వెళ్లారు. ఇంకా పరిష్కారం కాలేదు. దీని వల్ల ప్రమోషన్ల ప్రక్రియ ఆగిపోయింది. అక్కడక్కడ అధికారులు జీవో నెంబర్ 3కి భిన్నంగా ప్రమోషన్ ఇస్తామని చెబుతున్నారు. మూడు డివైఇవో పోస్టులు, రెండు డిఈవో, పూర్తి ఏజెన్సీ మండలాల్లో ఎంఈవో పోస్టులు గిరిజన పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన ఉపాధ్యాయులతో పూరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉంది. 524 పైగా పండిట్, పిఇటి పోస్టుల అప్గ్రెడేషన్ ఆర్థిక శాఖ కొర్రీ వల్ల ఆగిపోయింది. ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్లు లేవు. అర్హత కలిగిన వారికి జూనియర్ కళాశాల అధ్యాపకుల ప్రమోషన్లు ఇవ్వడం లేదు. జీవో నెంబర్ 3ని యథాతథంగా అమలు చేయడానికి కావలసిన చర్యలు తీసుకొని ప్రమోషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంది. ఆర్థిక శాఖ అవాంతరాలను అధిగమించి అప్గ్రేడ్ ప్రక్రియను పూర్తి చేయాలి. వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలి. ఎఎన్ఎం నియామకాలను చేపట్టాలి. ఎలక్ట్రీషియన్, ప్లంబర్లతో పాటు పాఠశాలలో బోధనేతర సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్, వాచ్మెన్, అవసరం ఉన్న చోట కమాటి, కుక్ లను నియమించాలి.
సి.ఆర్.టి వ్యవస్థ
గిరిజన పాఠశాలల్లో విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం లేకపోవడం వల్ల గిరిజన ప్రాంతాలలో అర్హత కలిగిన వారిని సిఆర్టి లుగా నియమించారు. రాష్ట్రంలో 1798 మంది సిఆర్టి లుగా పని చేస్తున్నారు. గతంలో పది రోజుల గ్యాప్తో 12 నెలల జీతం చెల్లించేవారు. గడిచిన సంవత్సరంగా పది నెలల జీతం మాత్రమే చెల్లిస్తున్నారు. 12 సెలవులు మాత్రమే ఇస్తున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల్లా పనిచేస్తున్నా సదుపాయాలు సక్రమంగా ఇవ్వడం లేదు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి, క్వాలిఫై అయిన వారికి ఇంత తక్కువ జీతం ఇవ్వటం న్యాయం కాదు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవడానికి పోరాటం చేయాల్సి వస్తున్నది. కొన్ని పోస్టులు అవసరం లేదనే పేరుతో 186 మంది సిఆర్టి లను స్కూల్ అసిస్టెంట్ల నుండి ఎస్జిటి లుగా డీగ్రేడ్ చేశారు. సిఆర్టి వ్యవస్థ మొత్తాన్ని రెగ్యులర్ చేయాలి.
భాషా వాలంటీర్లు
గిరిజన భాషాభివృద్ధి కోసం జిపిఎస్ పాఠశాలల్లో భాషా వాలంటీర్లను సమగ్ర శిక్షా అభియాన్ నిధుల సహకారంతో ప్రభుత్వం నియమిస్తుంది. సుమారు 1242 మంది వివిధ భాషా వాలంటీర్లను ప్రభుత్వ ఈ సంవత్సరం నియమించాల్సి ఉంది. పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా భాషా వాలంటీర్లను ఇంతవరకు నియమించలేదు. పాత బకాయిలు చెల్లించాలని, ఈ సంవత్సరం తిరిగి రెన్యువల్ చేయాలనే డిమాండ్తో 72 గంటల నిరాహార దీక్షలు చేసినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. సమగ్ర శిక్షా అభియాన్ నిధులు కేటాయించినా ఏదో ఒక కొర్రీతో కొద్దిచోట్ల వాలంటీర్లను నియమించడం లేదు. కేవలం రూ.5000 జీతంతో నియమించే భాషా వాలంటీర్లు పాఠశాలలకు విద్యార్థులు రావడానికి, వారి భాషాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో వాలంటీర్లు లేకపోతే ఆ పాఠశాల మూత వేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి వాలంటీర్ల వ్యవస్థను ఏదో ఒక కారణంతో రెన్యువల్ చేయకపోవడం గిరిజన విద్యార్థులకు విద్యను అందించడానికా లేక గిరిజన భాషాభివృద్ధి చెందకుండా చేయడానికా అన్న అనుమానం కలుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే భాషా వాలంటీర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలి.
చదువు.. చైతన్యం..
2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన అక్షరాస్యత 58.96 శాతం. మహిళ అక్షరాస్యత 38 శాతం. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ గణాంకాలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? దేశంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందిందని...చెందుతోందని ఎలా చెప్పగలం? విద్యకు కావలసిన నిధులు సక్రమంగా కేటాయించకుండా, విద్య నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థికి సదుపాయాలు కల్పించకుండా, గిరిజనుల విద్యాభివృద్ధి సాధ్యమా? చదువు నాగరికతను, నైపుణ్యాన్ని నేర్పాలి. ఆ నైపుణ్యం గౌరవప్రదమైన జీవనాన్ని సాగించడానికి కావలసిన చైతన్యాన్ని ఇవ్వాలి. చదువుకోడానికే ఇన్ని ఆటంకాలు ఏర్పడితే గిరిజనులు సంపూర్ణ మానవులుగా ఎలా తయారవుతారు ?
పీసా చట్టం, 1/70 యాక్ట్, అటవీ హక్కుల చట్టం అమలు కోసం కృషి చేసే గిరిజన సంఘాలకు సంఘీభావం తెలపాలి. జీవో నెంబర్ 3, అప్గ్రెడేషన్, మెనూ చార్జీల పెంపు, ఏఎన్ఎం, వార్డెన్ నియామకం, ప్రమోషన్ లాంటి సమస్యల పరిష్కారానికి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ చేసే పోరాటాలతో కలిసి పనిచేయడానికి సిద్ధం కావాలి. గిరిజన సంక్షేమం మా లక్ష్యం అని చెప్పే పాలకులు చిత్తశుద్ధితో గిరిజన సంక్షేమానికి బడ్జెట్లో నిధులను కేటాయించడం, ఖర్చు చేయడంతో పాటు విద్యారంగ సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలి. తద్వారా గిరిజన విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలి.
(వ్యాసకర్త : యుటియఫ్ రాష్ట్ర అధ్యక్షులు)
ఎన్. వెంకటేశ్వర్లు