May 14,2023 07:58

ప్రభుత్వ విధానాల మార్పులు రైతుల ఆత్మహత్యలను పెంచుతున్నాయి. ప్రభుత్వ రుణ సదుపాయం తగ్గిపోవడం, సహకార వ్యవస్థ పూర్తిగా మూతపడడం, ప్రస్తుత బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలు, విధానాలు, విద్యుత్‌ చట్టాలు రైతాంగాన్ని భూముల నుండి తరిమివేసేలా లేదా ఆత్మహత్యలను పెంచే విధంగా వున్నాయి. వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు రైతులను ముంచేస్తున్నాయి. గత రెండు సంవత్సరాల్లో అధిక వర్షాల వల్ల రాష్ట్రంలోని 14 జిల్లాల్లో కోట్ల రూపాయల రైతుల పెట్టుబడులు మట్టిపాలు కావడం చూస్తూనే వున్నాం.

             దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు మరలా పెరుగుతున్నాయి. 2016 నుండి 2021 సంవత్సరాల మధ్య 64,222 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించింది. బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతుల్లో ఎక్కువమంది పేద, దిగువ మధ్యతరగతి, వ్యవసాయ కూలీలు. వీరిలో సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన వారు అత్యధికం. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రచారాలు చేసుకుంటుండగా మరోవైపు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇది పాలకుల ప్రకటనలకు, ప్రజల అనుభవాలకు మధ్యనున్న అంతరానికి ఓ నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత ఆరేళ్లల్లో ప్రతి సంవత్సరం సగటున పది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారిక రికార్డులకు ఎక్కని రైతుల ఆత్మహత్యలు ఇంతకు రెట్టింపు వుంటాయి. వ్యవసాయాధారిత దేశంలో ఇంతమంది అర్థాంతరంగా ఊపిరి తీసుకుంటుంటే పాలకులు సిగ్గు పడాల్సిందిపోయి నిబంధనల చాటున రైతుల ఆత్మహత్యలు రికార్డుల్లోకి ఎక్కకుండా అడ్డుకుంటున్నారు.
 

                                                తగ్గుతున్న రైతుల ఆదాయం - పెరుగుతున్న అప్పులు

వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి తమ కుటుంబాన్ని పోషించుకోగలమనే ధైర్యం ఏ రైతు కుటుంబంలోనూ లేదు. అందుకే తమ పిల్లలకు వ్యవసాయం వద్దని గ్రామీణ పెద్దలు చెబుతుంటే, వ్యవసాయ కుటుంబాలతో సంబంధం కలుపుకోవడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు అయిష్టత చూపిస్తున్నారు. జాతీయ గణాంకాల శాఖ 2021 సెప్టెంబర్‌ 10న ప్రకటించిన నేషనల్‌ శాంపిల్‌ సర్వే ప్రకారం వ్యవసాయ సాగు ద్వారా రోజుకు రైతుకు వచ్చే సగటు ఆదాయం కేవలం రూ.27 కాగా, నెలకు రూ. 816.50 పైసలు. సగటున ఒక కుటుంబం పంటల సాగు ద్వారా రూ. 3,798 మాత్రమే పొందుతున్నది. 2013 సర్వే నుండి 2019 నాటికి రైతులు వ్యవసాయం మీద సగటున సంవత్సరానికి పొందుతున్న ఆదాయం రూ.6,442 నుండి రూ.10,218కి పెరిగినట్లు ఇది తమ ఘనత అయినట్లు బిజెపి నేతలు చెబుతున్నారు. వాస్తవంగా 2013లో ఒక రైతు కుటుంబం సాగు ద్వారా రూ. 3,081 సంపాదించగా 2012 ధరలతో పోలిస్తే ఈ ఆదాయం రూ. 2,770కి సమానం. 2019లో రైతు కుటుంబ సగటు ఆదాయం రూ.3,798 మాత్రమే. పంటల ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం 2013 నుండి 2019 నాటకి 5 శాతం పైగా తగ్గింది. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, విద్య, వైద్యం, ఇతర ఖర్చుల ధరలతో పోలిస్తే వాస్తవ ఆదాయం మరింతగా తగ్గిపోవడమే కాక తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయారు. 2019 సర్వే ప్రకారం దేశంలోని 50 శాతం రైతాంగ కుటుంబాలకు సగటున రూ. 74,121 అప్పులు వున్నాయి. బ్యాంకులు వ్యవసాయ రుణాలు పెంచాల్సిన పరిస్థితి నుండి తీవ్రమైన పతనం వైపు సాగాయి. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకు రుణాలు అందకుండా చేయడంతో వడ్డీ వ్యాపారుల ధనదాహానికి రైతాంగం బలైపోయింది. 1990 నుండి 2011 మధ్య వ్యవసాయదారులకు ప్రత్యక్షంగా రూ. 20 వేల కన్నా తక్కువ వుండే బ్యాంకు రుణాలు 92 శాతం నుండి 48 శాతానికి తగ్గిపోగా ఇదే సమయంలో రూ.10 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో ఇచ్చే రుణాలు 4 శాతం నుండి 23 శాతానికి పెరిగాయి. పేద రైతులకు రుణ సదుపాయం కల్పించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పిఎసిఎస్‌)ను దెబ్బతీసే విధానాలను కేంద్ర ప్రభుత్వమూ, రిజర్వు బ్యాంకు చేపట్టాయి. దేశవ్యాప్తంగా 90 వేల సహకార సంఘాలు మూతపడే ప్రమాదం ఏర్పడింది.
 

                                                              సంపన్నుల అనుకూల ప్రభుత్వ విధానాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పేరుతో అమలు చేస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకం వాస్తవ సాగు సమస్యలను పరిష్కరించడంలేదు. కేంద్ర ప్రభుత్వ రైతు పథకాల్లో సాయిల్‌ హెల్త్‌ కార్డు పథకం, పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన, ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన, నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌, ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా, వడ్డీ రాయితీ పథకం ముఖ్యమైనవి. ఇవి కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా, రైతు బంధు లాంటి అనేక పేర్లతో వివిధ పథకాల పేర్లతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఈ పథకాల వల్ల రైతుల పరిస్థితి మెరుగుపడకపోగా, మరింత దిగజారుతున్నది. స్వాతంత్య్రానంతరం వ్యవసాయ అభివృద్ధికి పాలకులు కొన్ని చర్యలు చేపట్టినా, ఈనాటికి రైతుల కోసం కొన్ని పథకాలు అమలు అవుతున్నాయన్నా అవి రైతుల మీద ప్రేమతోనో, రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధితోనో చేపట్టినవి కావు. ప్రభుత్వాలను ఎన్నుకునే ఓటర్లలో అత్యధికమంది గ్రామీణ భారతంలో నివసిస్తూ వుండడం ఒక కారణమైతే, స్వాతంత్రోద్యమంలో రైతాంగ పోరాటాలు నిర్వహించిన పాత్ర మరో కారణం. స్వదేశీ పాలన ప్రారంభ కాలంలో దేశీయ ఆహార ధాన్యాల ఉత్పత్తి తక్కువగా వుండి విదేశాల మీద ఆధారపడే పరిస్థితి వుండడం కూడా రైతు పథకాలకు కారణం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వ మద్దతు ధరలు-మార్కెటింగ్‌ వ్యవస్థ, బ్యాంకుల రుణ సదుపాయం, సహకార వ్యవస్థ, వ్యవసాయ పరిశోధనలు, అధిక దిగుబడి వంగడాల ఉత్పత్తి ఇవన్నీ పాలకుల అవసరాల కోసం చేపట్టిన విధానాల్లో భాగమే.
        1991 నుండి అమలు చేసిన ప్రపంచీకరణ విధానాలు వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. సాంప్రదాయికంగా వాడే విత్తనాలు, ఎరువుల స్థానంలో బహుళజాతి కంపెనీలవి వాడాల్సిన పరిస్థితి అనివార్యమైంది. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తూ, వ్యవసాయం మీద ఆధారపడిన 85 శాతం మందికి 2 ఎకరాల కన్నా తక్కువ భూమి వున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు చేపట్టే చర్యలేవైనా వీరిని ఆదుకునేలా వుండాలి. కాని మన పాలకులు (పార్టీలు ఏవైనా) అనుసరిస్తున్న విధానం వైరుధ్యాలతో కూడుకొని వుంది. చిన్న, సన్నకారు రైతులను విస్మరించి, ధనిక రైతాంగం, భూస్వామ్య ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలు మారుతూ వచ్చాయి. ఇవి వ్యవసాయ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేశాయి. రైతులను ఆదుకోవడంలో కొంత మేరకు ఉపయోగపడిన జాతీయ ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ), మద్దతు ధరల ప్రకటన, రుణ సదుపాయం లాంటి అన్నింటిని సమూలంగా మార్చివేస్తున్నారు.
 

                                                                    ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు

గత మూడు దశాబ్దాల్లో వ్యవసాయ పెట్టుబడులు ఎన్నడూ లేనంత భారీగా పెరిగిపోయాయి. విత్తనాలు మొదలుకొని ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు, యంత్రాల వినియోగం పెరిగిపోయింది. నగదు చేతిలో వుంటే తప్ప వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇది సహజంగానే చిన్న, సన్నకారు రైతులకు గుదిబండగా మారింది. వ్యవసాయ సాగు భూములకు నీటి పారుదలను కల్పించాల్సిన ప్రభుత్వాలు క్రమంగా ఆ బాధ్యత నుండి తప్పుకున్నాయి. వర్షాధార సాగు రైతుల జీవితాలను కుంగదీసింది. దీనివల్ల బోర్లపై ఆధారపడటం ఎక్కువైంది. మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద సాగుచేయడం పెరిగింది. ప్రభుత్వాలు ఇస్తామన్న డ్రిప్‌, స్పింక్లర్ల సహాయం బోర్ల వ్యవసాయాన్ని పెరచేసింది. అనేక కష్టాలకోర్చి సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. 2010-11లో క్వింటా పత్తి ధర రూ. 6,500 కాగా ప్రస్తుతం రూ. 3.500 నుండి రూ. 4 వేల లోపు వుంది. పసుపు, కందులు, మినుములు, జొన్న, మొక్కజొన్న ఇలా అన్ని రకాల పంటల ధరలు గత దశాబ్దంతో పోలిస్తే పెరుగుదల లేకపోగా తగ్గాయి. దిగుబడి సుంకాలను సరళీకరించడం ఇందుకు ప్రధాన కారణం. పెట్టుబడి ఖర్చులు మాత్రం మూడింతలు పెరిగాయి. ప్రభుత్వ విధానాల మార్పులు రైతుల ఆత్మహత్యలను పెంచుతున్నాయి. ప్రభుత్వ రుణ సదుపాయం తగ్గిపోవడం, సహకార వ్యవస్థ పూర్తిగా మూతపడడం, ప్రస్తుత బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలు, విధానాలు, విద్యుత్‌ చట్టాలు రైతాంగాన్ని భూముల నుండి తరిమివేసేలా లేదా ఆత్మహత్యలను పెంచే విధంగా వున్నాయి. వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు రైతులను ముంచేస్తున్నాయి. గత రెండు సంవత్సరాల్లో అధిక వర్షాల వల్ల రాష్ట్రంలో 14 జిల్లాల్లో కోట్ల రూపాయల రైతుల పెట్టుబడులు మట్టిపాలు కావడం చూస్తూనే వున్నాం.
 

                                                     కేరళ వామపక్ష ప్రభుత్వ ప్రత్యామ్నాయ విధానాలు

కేరళలోని వామపక్ష ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేందుకు త్రిముఖ వ్యూహం అనుసరిస్తూ వచ్చింది. ఇందులో భాగంగా రుణాల ఊబిలో వున్న రైతులకు తక్షణం ఉపశమనం అందించడం, వ్యవసాయోత్పత్తుల ధరలను స్థిరీకరించడం, వ్యవసాయ ఉత్పాదకతను, ఆదాయాలను పెంచడం వంటివి చేసింది. రుణ విమోచన కమిషన్‌ ద్వారా రైతుల రుణాలను మాఫీ చేసింది. రాయితీతో కూడిన వ్యవసాయ పెట్టుబడి సహాయాలు అందించడం ద్వారా ఉత్పత్తి ఖర్చులను తగ్గించే చర్యలను అమలు చేస్తుంది. పంటలకు గిట్టుబాటు ధరలను కల్పిస్తున్నది. వరి ధాన్యానికి 2006లో కేంద్రం క్వింటాల్‌కు రూ. 570 మద్దతు ధర ప్రకటించగా, కేరళ ప్రభుత్వం ప్రోత్సాహక బోనస్‌ పేరుతో ఆ సంవత్సరం రూ.707కు కొనుగోలు చేసి, 2011 నాటికి రూ.1140, 2020-21లో కేంద్రం మద్దతు ధర రూ.1868 కాగా కేరళ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనంతగా క్వింటాల్‌ రూ.2,800లకు కొనుగోలు చేసింది. వ్యవసాయ కూలీలకు అమలవుతున్న 'కుడుంబశ్రీ' పథకం అద్భుతాలను సృష్టిస్తున్నది. రాష్ట్రానికి ఉన్న పరిమిత వనరులతో కూడా రైతులను, కూలీలను ఎలా ఆదుకోవచ్చనడానికి ఒక నమూనాగా కేరళ వామపక్ష ప్రభుత్వ విధానాలు వున్నాయి. మన రాష్ట్రంలో అధికారంలో వున్న పార్టీ పేరులో రైతు వుంది గాని రైతులకు వ్యతిరేకమైన కేంద్ర ప్రభత్వ విధానాలనన్నింటిని అమలు చేస్తూ రైతు ఆత్మహత్యల్లో దేశంలో నాలుగో స్థానంలో వుంది. రైతు ఆత్మహత్య అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య కాదు, దేశానికి కీలకమైన వ్యవస్థ ఆత్మహత్య కాబడడం. అందుకే నిజమైన దేశభక్తులంతా రైతు ఆత్మహత్యలకు వ్యతిరేకంగా గళం విప్పాలి, గర్జించాలి.

/వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు/
వి. రాంభూపాల్‌

Is-there-no-end-to-farmers-suicides