Dec 17,2022 17:41

లండన్‌ : గత కొన్ని శతాబ్దాలుగా బాషా పండితులే పరిష్కరించలేని సంస్కృత వ్యాకరణ సమస్యను భారతీయ పిహెచ్‌డి విద్యార్థి రిషి రాజ్‌పోపట్‌ (27) పరిష్కరించాడు. ప్రస్తుతం ఇతను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేస్తున్నాడు. సంస్కృత భాష యొక్క వ్యాకరణాన్ని మొట్టమొదటిసారిగా గ్రంధస్థం చేసిన వ్యక్తి పాణిని. బాషాశాస్త్ర పితామహుడిగా పేరొందిన పాణిని బోధించిన నియమాన్ని రిషి.. డీకోడ్‌ చేశాడు. ఈ విద్యార్థి ఆవిష్కరణను కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం విప్లవాత్మకమైనదిగా అభివర్ణించింది. రిషి ఆవిష్కరణ వల్ల.. సంస్కృత వ్యాకరణాన్ని కంప్యూటరీకరించడానికి సాధ్యమయ్యేందుకు వీలుగా ఉంటుంది.
కాగా, తన ఆవిష్కరణపై రిషి సంతోషం వ్యక్తం చేశాడు. 'తొమ్మిది నెలలుగా ఈ సమస్యను చేధించడానికి ప్రయత్నించాను. అయినా సాధ్యం కాలేదు. చివరకు నా ప్రయతాన్ని విరమించుకోవడానికి సిద్ధమయ్యాను. ఆ తర్వాత ఒక నెలపాటు పుస్తకాలు ముట్టుకోకుండా.. స్విమ్మింగ్‌, సైక్లింగ్‌, వంట చేయడం, ప్రార్థన, ధ్యానం ఇలాంటి పనులవైపు నా దృష్టి మరల్చాను. ఆ తర్వాత మళ్లీ పుస్తకాల్ని తెరిచి.. నేను కనుగొనాలనుకునే నమూనాను సాధించే దిశగా ప్రయత్నించాను. నేను కనుగొన్న నమూనాతో.. సంస్కృత భాషలో ఉన్న పురాతన జ్ఞానాన్ని తెలుసుకునే వీలుంది' అని రిషి చెప్పారు.