
బిజెపి మత రాజకీయాలనూ కేంద్రం నిరంకుశత్వాన్ని ఓడించడానికి మరింత సమిష్టిగానూ సమర్థంగానూ సత్వర వ్యూహాలు రూపొందించుకోవాలని ప్రతిపక్షాల నాయకులు గుర్తించారు. కీలక నేతలందరూ హాజరైనారు కూడా. దేశంలోని 450 నియోజక వర్గాలలో బిజెపికి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలబెట్టి ఓడించాలని అందుకే తొలి అంశంగా నిర్ణయించుకున్నారు. అయితే ఇది విశాల ప్రతిపక్ష వేదిక మాత్రమే గనక వీలైనంతవరకూ కలసి పోటీ చేస్తామని ప్రకటించాయి. అందుకే జాతీయ స్థాయి సమావేశంలో గాక రాష్ట్రాల స్థాయిలోనే సమన్వయ కమిటీల ద్వారా ఎవరు ఎలా పోటీ చేయాలన్నది ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం వాస్తవికతను ప్రతిబింబిస్తుంది.
కోవింద్ కమిటీ గురించి ప్రహ్లాద్ చెప్పడమే గాని ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువరించలేదు. పైగా రాజ్యాంగం గురించిన చర్చను అనధికార కమిటీ ఎలా చేస్తుంది? ఆ అధికారం పార్లమెంటుకు మాత్రమే వుంది. గతంలో వాజ్పేయి హయాంలోనూ రాజ్యాంగ సంస్కరణలకై జస్టిస్ వెంకటాచలయ్య కమిటీని ఇలాగే ఏర్పాటు చేసి తర్వాత... సూచనల కోసం అని వెనక్కు తగ్గారు. ఇప్పుడైనా ఏకపక్షంగా రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం చెల్లదు.
2023 జులైలో బెంగళూరులో ప్రతిపక్షాల కూటమి సమావేశమై 'ఇండియా'గా ముందుకు వస్తున్న తరుణంలోనే కేంద్ర పాలక పక్షమైన బిజెపి హడావుడిగా ఎన్డిఎను పునరుద్ధరించి విస్తరించి ఢిల్లీలో సమావేశపర్చింది. 26 పార్టీలు ఇక్కడ కలుస్తుంటే అక్కడ ఏకంగా 38 పార్టీలు హాజరైనాయి గాని వాటి సీట్ల బలం నామకార్థమని మీడియా విశ్లేషించింది. తాజాగా ముంబయిలో ఇండియా సమావేశమవుతుందంటే ఎన్డిఎ సమావేశం కాకుండా ఏకంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలనే పిలవాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. లౌకిక ప్రతిపక్షాల ఐక్యవేదిక ఏర్పాటు పట్ల ప్రధాని మోడీ ఎంతగా ఉలిక్కిపడుతున్నారో దీన్నిబట్టే చెప్పొచ్చు. నవంబరు, డిసెంబరులో అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో తన పరిస్థితి ప్రతికూలంగా వుంటుందని భయపడుతున్న బిజెపి, ఆర్ఎస్ఎస్ పరివారం ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చుననే సంకేతాలు గతం నుంచి వున్నాయి. కానీ ముంబయి సమావేశ సన్నాహాలు, ప్రతిపక్షాల వ్యూహాల ఉధృతి చూసిన తర్వాత కేంద్రం దాదాపు ముందస్తును మరింత ముందుకు జరపాలని నిర్ణయించుకోవలసి వచ్చిందని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ లోక్సభ అమృతోత్సవ్ ప్రత్యేక సమావేశాలు జరిపి కీలకమైన బిల్లులు, సవరణలు ఆమోదింపచేసుకోవాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు జాతీయ మీడియా ఏకకంఠంతో చెబుతున్నది. ఇందుకు తగినట్టే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో జమిలి ఎన్నికల గురించి అధ్యయనం చేసేందుకు ఒక కమిటీనే నియమించారు. 2018లో కోవింద్ ఆ పదవిలో వున్నప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో లోక్సభకూ శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిదన్న సూచన చేశారు. అంటే కేంద్రం ఆలోచనను వినిపించారు. ఆయన నాయకత్వంలో కమిటీ ఇక ఏమి చెబుతుందో ఊహించడం కష్టమేమీ కాదు. అసలు రాజ్యాంగ అధినేతగా పనిచేసిన ఒక మాజీ రాష్ట్రపతికి ఈ విధంగా రాజకీయ బాధ్యత అప్పగించడం దేశ రాజకీయాలలో ఇదే తొలిసారి కావచ్చు.
వాస్తవికత, విశాల వ్యూహం
'ఇండియా' సమావేశం జరుగుతుందనగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ప్రకటన రావడంతో దాని నిర్వహణ కోణంలోనే కొంత మార్పు అవసరమైంది. బిజెపి మత రాజకీయాలనూ కేంద్రం నిరంకుశత్వాన్ని ఓడించడానికి మరింత సమిష్టిగానూ సమర్థంగానూ సత్వర వ్యూహాలు రూపొందించుకోవాలని ప్రతిపక్షాల నాయకులు గుర్తించారు. కీలక నేతలందరూ హాజరైనారు కూడా. దేశంలోని 450 నియోజక వర్గాలలో బిజెపికి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలబెట్టి ఓడించాలని అందుకే తొలి అంశంగా నిర్ణయించుకున్నారు. అయితే ఇది విశాల ప్రతిపక్ష వేదిక మాత్రమే గనక వీలైనంతవరకూ కలసి పోటీ చేస్తామని ప్రకటించాయి. అందుకే జాతీయ స్థాయి సమావేశంలో గాక రాష్ట్రాల స్థాయిలోనే సమన్వయ కమిటీల ద్వారా ఎవరు ఎలా పోటీ చేయాలన్నది ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు కేరళలో ఎల్డిఎఫ్, యుడిఎఫ్ కలసి పోటీ చేయడం కుదిరేపని కాదు. బెంగాల్లో మమతా బెనర్జీని వామపక్షాలు, కాంగ్రెస్ ఆమోదించడం అసాధ్యం. పంజాబ్, ఢిల్లీ, గుజరాత్లలో ఆప్, కాంగ్రెస్ పోటీ పడుతుంటాయి. అందుకే వీలైనంత వరకూ కలసి అన్నారు. వాస్తవానికి మమతా బెనర్జీ ఈ విషయమై తొందరగా ఉమ్మడి పోటీ విషయం తేల్చాలని పట్టుపట్టినా మిగిలిన నేతలు ఇందుకోసం సర్దిచెప్పినట్టు కథనాలు వచ్చాయి. ఏమైనా అరడజను ముఖ్యమంత్రులు, నాలుగు జాతీయ, పలు ప్రాంతీయ పార్టీల నాయకులు ఈ వేదికలో వున్నారు గనక ఆయా చోట్ల కలసి అడుగేయడం సాధ్యమే అవుతుంది. 1977లో ఇందిరా గాంధీ ఎమర్జన్సీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఆ విధంగా కలిసి విజయవంతమైన అనుభవం వుంది. కనీసం మూడు సార్లు కేంద్రంలో కాంగ్రెస్, బిజెపి యేతర ప్రభుత్వాలు ఏర్పడిన వాస్తవం మర్చిపోరానిది. అవి విఫల ప్రయోగాలుగా చెబుతుంటారు గాని అందుకు నాటి కాంగ్రెస్ అనుసరించిన విధానమే ముఖ్య కారణం. ఇప్పుడు ఆ పార్టీయే 'ఇండియా' కూటమిలో ఒక కీలక పాత్రధారి. ప్రాంతీయ పార్టీలకు అప్పటికన్నా ఇప్పుడు నిర్ణయాత్మక పాత్ర వుంటుంది. ఈ పార్టీల ఊగిసలాటనే గతంలో బిజెపి అధికారంలోకి రావడానికి ఒక ప్రధాన ఆధారమైంది. మోడీ హయాంలో రాష్ట్రాలను గుప్పిట పెట్టుకునే ధోరణి, సమాఖ్య విధానానికి తూట్లు పొడవడం ఈ ప్రాంతీయ పార్టీలలో చాలా వాటికి కళ్లు తెరిపించిందని చెప్పాలి. తమ అస్తిత్వం కోసమైనా వారంతా 'ఇండియా' వైపు మొగ్గడం అనివార్యమైన పరిస్థితి. ఇప్పటికీ వైసిపి, టిడిపి, బిజెడి వంటి పార్టీలు బిజెపికి అనుకూలంగా వుండటం వాటిపై ఒత్తిళ్ల ఫలితమే. ఇక బిఆర్ఎస్, బిఎస్పి వంటి పార్టీలు సమదూరమని అంటున్నా ఆచరణలో బిజెపికే ప్రయోజనమనే భావన వుంది. ఎన్నికలు దగ్గర పడే కొద్ది అంతిమంగా ఎవరు ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూడవలసిందే. అకాలీదళ్, బిఎస్పి వంటి పార్టీలు 'ఇండియా'లో చేరకపోయినా ఎన్డిఎలో చేరడం జరగదనే అభిప్రాయం ఎన్సిపి నాయకుడు శరద్ పవార్ ముందే స్పష్టంగా ప్రకటించారు. ఒక కన్వీనర్ నియామకం కూడా ఇప్పుడే తేలకపోయినా నష్టం లేదని వాయిదా వేశారు.
కోవింద్ కమిటీ, కోటి కౌటిల్యాలు
ఏమైనా ఈ సమావేశ ప్రభావం అప్పుడే బిజెపిపై పడిందని సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్య అర్థవంతమైంది. ముంబయి సమావేశం ఒకవైపున ఇంకా జరుగుతుండగానే ఏకకాల ఎన్నికల ముచ్చట ఊపందుకోవడంలో అది కనిపిస్తుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ను కలిశారు. 'ఇండియా' అనే పేరు మార్చి భారత్నే వాడాలని భగవత్ రెండు చోట్ల వేర్వేరు సమావేశాల్లో ప్రవచించారు. ఈ దేశం హిందూ రాష్ట్రమేనని, భారతీయులందరూ హిందువులేనని మత భాష్యాన్ని మరింత తీవ్రంగా వినిపించారు. రామ్నాథ్ కోవింద్ కూడా కొంత కాలం కిందట భగవత్తో సమావేశమైనారని ఇక్కడ గుర్తు చేయాలి. అంటే మోడీ అమిత్ షా ఒకవైపు ఎన్డిఎ విస్తరణ కోసం తంటాలు పడుతుంటే మరోవైపు మోహన్ భగవత్ హిందూత్వ మతతత్వ సిద్ధాంతం వ్యాప్తి బీజాలు వేస్తున్నారన్నమాట. కోవింద్ కమిటీ గురించి ప్రహ్లాద్ చెప్పడమే గాని ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువరించలేదు. పైగా రాజ్యాంగం గురించిన చర్చను అనధికార కమిటీ ఎలా చేస్తుంది? ఆ అధికారం పార్లమెంటుకు మాత్రమే వుంది. గతంలో వాజ్పేయి హయాంలోనూ రాజ్యాంగ సంస్కరణలకై జస్టిస్ వెంకటాచలయ్య కమిటీని ఇలాగే ఏర్పాటు చేసి తర్వాత...సూచనల కోసం అని వెనక్కు తగ్గారు. ఇప్పుడైనా ఏకపక్షంగా రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం చెల్లదు. ఆ అంశాన్ని తెరపైకి తేవడం, ప్రజల్లో అనుకూలత పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. పార్టీలు, వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలతో ఈ కమిటీ సంప్రదిస్తుందంటున్నారు. కానీ ఇతర పార్టీలు, ప్రభుత్వాలు ఒక అనధికార కమిటీకి సహకరిస్తాయని చెప్పడం కష్టం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా పదవీ విరమణ తర్వాత మామూలు పౌరుడేనని ఇటీవల జస్టిస్ డి.వై. చంద్రచూడ్ స్పష్టంగా చెప్పారు. అధికార లాంఛనాలు కొన్ని వుండవచ్చు గాని మాజీ రాష్ట్రపతి అయినా ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తి ఏమీ వుండదు. ఈ కమిటీ సిఫార్సులు చేసినా వాటిని కేంద్ర క్యాబినెట్ తీర్మానం ముందుకు తెస్తారన్నమాట. ఎన్నికల సంఘం కూడా కేంద్రం ఒత్తిడితో గతంలోనే దీనిపై స్పందించింది. ఒకేసారి ఎన్నికలు జరపగల సత్తావుందని, కాకపోతే అదనంగా సహాయం అవసరమని వెల్లడించింది. తన వంతుగా అయిదు సూచనలు చేసింది. 1.కొత్త లోక్సభ ప్రారంభానికి తేదీ నిర్ణయించాలి. 2.అవిశ్వాస తీర్మానం తెచ్చేవారు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి నాయకత్వం వహించే వ్యక్తి పేరు అందులో సూచించాలి. 3. పదవీ కాలం కొద్దిగానే మిగిలి వుండగా ప్రభుత్వం పడిపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఎక్కువ వుంటేనే ఎన్నికలు. 4. శాసనసభల విషయంలోనూ ఇదే జరగాలి. 5, లేదంటే అన్ని ఎన్నికలకూ నిర్ణీత తేదీలలో జరిగేలా నిర్ణయించాలి.
రాజ్యాంగానికే ఎసరు, దేశానికే ప్రమాదం
భారత రాజ్యాంగం ఏకకాల ఎన్నికలు జరగాలని చెప్పడం లేదు. లోక్సభ, శాసనసభల నియమ నిబంధనలు కాలపరిమితి అన్నీ వేర్వేరుగా వున్నాయి. మొదటి మూడు ఎన్నికలు కలిసే జరిగాయంటే కాంగ్రెస్ గుత్తాధిపత్యమే కారణం, 1967 నుంచి క్రమంగా ఈ పరిస్థితి మారుతూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడం, రద్దు చేయడం, పడిపోవడం చాలా చూశాం. కేంద్రంలోనూ కనీసం మూడు సార్లు ప్రభుత్వాలు ముందే పడిపోయాయి. వాటిపై ఏవో కొత్త షరతులు రుద్దాలనేది ఇక్కడ ఆంతర్యం. అంటే పదవీ కాలం ముగిసినా కొనసాగించడం లేక ఇంకా వున్నా ఎన్నికలకు వెళ్లకుండా పరోక్ష పాలన సాగించడం వంటివి రాజ్యాంగ నిర్దేశానికి విరుద్ధం. అప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అనే మౌలిక సూత్రమే మంటగలిసి పోతుంది. ఎమర్జన్సీలో రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని ఆరేళ్లకు పెంచితే తర్వాత కత్తిరించాల్సి వచ్చింది. వాస్తవానికి శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి చోట్ల కూడా గతంలో నిరంకుశ ప్రభుత్వాలు పాలనా వ్యవస్థను ఇష్టానుసారం మార్చినా తర్వాత అవి నిలబడలేదు. వి.పి.సింగ్ ప్రభుత్వ కూల్చివేత తర్వాత అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ జాతీయ ప్రభుత్వం అంటూ ఒక ప్రహసనం నడిపించి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. బిజెపి ఎప్పుడూ అధ్యక్ష తరహా పాలన కోరుకుంటుంది. దేశంలో రాజకీయ సామాజిక బహుళత్వం కారణంగా అది చేయలేకపోయింది. మోడీ హయాంలో దాదాపు ప్రధాని కేంద్రంగా చేయడం అధ్యక్ష తరహా ప్రతిబింబమే. నోట్ల రద్దుతో సహా కీలక నిర్ణయాలు మోడీ ఒక్కరే తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి వాటిని కూడా ఎవరితో చర్చించలేదు. ఈ నిర్ణయాలు సుప్రీం కోర్టు సమీక్షలో వుండటమే గాక తీవ్ర ప్రశ్నలకు కారణమవుతున్నాయి. లోక్సభ పదవీ కాలానికి సంబంధించిన 83వ అధికరణం రద్దుకు సంబంధించిన 85 అధికరణం, అసెంబ్లీల పదవీ కాలానికి సంబంధించిన 172 రద్దు పైన 174, రాష్ట్రపతి పాలనపై 356 అయిదు రాజ్యాంగ సవరణలు చేయవలసి వుంటుంది. శాశ్వత మార్పులైతే సగం శాసనసభల ఆమోదం కూడా అవసరమవుతుంది. లక్షల కోట్లు బడాబాబుల పరం చేయడమే గాక రాయితీల రూపంలో మరిన్ని లక్షల కోట్లు కట్టబెడుతున్న ఈ సర్కారు ఎన్నికల ఖర్చు తగ్గించాలని పొదుపు కబుర్లు చెప్పడం హాస్యాస్పదం. ఇది వాస్తవానికి అధికార దాహం, అప్రజాస్వామిక రాజ్యాంగ కుట్ర. మోహన్ భగవత్, మోడీల మాటల వెనక వున్న రాజకీయ దురుద్దేశాలు, మతతత్వ వ్యూహాల పట్ల ప్రజల అప్రమత్తత చాలా అవసరం. దురదృష్టమేమంటే తెలుగు రాష్ట్రాలలో రెండు పాలక పార్టీలైన వైసిపి, బిఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఏవీ ఈ పోరాటంలో పాలుపంచుకోవడం లేదు, బిజెపికి వత్తాసుగా నిలవడానికే పోటీ పడుతున్నాయి. 'ఇండియా' ఈ నిరంకుశత్వాన్ని నిలవరించేందుకు పోరాడటమే గాక ఎన్నికలలోనూ బిజెపి కూటమిని ఓడించడం ద్వారా ఆ కుటిల ప్రయత్నాలు శాశ్వతంగా అడ్డుకోవడం మరింత ముఖ్యం.
తెలకపల్లి రవి