హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్వో)కు ఈపీఎఫ్ నెలవారీ చందాల వసూలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. కరోనా సమయంలో అనేకమంది ఉద్యోగాలు కోల్పోవడంతో ఈపీఎఫ్ వసూళ్లపై ప్రభావం పడింది. గత ఏడాది కాలంలో పరిస్థితులు సాధారణస్థితికి వచ్చాయి. కొత్తగా ఉద్యోగాలు రావడంలో ఈపీఎఫ్ రికార్డుల ప్రకారం కార్మిక బలగంలోకి కొత్తగా చేరిన ఉద్యోగులు భారీగా పెరిగారు. ఈక్రమంలో 2021-22తో పోల్చితే 22 శాతం పెరగడంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఈపీఎఫ్ వసూళ్లు రూ.2.07 లక్షల కోట్లుగా నమోదైంది. ఈపీఎఫ్ చందాతో పాటు ఉద్యోగి పింఛను పథకం(ఈపీఎస్) కింద కూడా చందాలు పెరిగాయి. అదేసమయంలో ఈపీఎస్ నుంచి ఉపసంహరణలు తగ్గి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈపీఎఫ్వో 2022-23 వార్షిక నివేదిక ప్రాథమిక అంచనాలు ఈ వివరాలను వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు 66.51 లక్షల మంది చందాదారులు తమ ఈ-నామినేషన్లు అందించారు.










