Apr 18,2023 16:19

ప్రజాశక్తి-సామర్లకోట(కాకినాడ) : డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 132వ జయంతి సందర్భంగా స్థానిక సామర్లకోట పూర్ణ కళ్యాణ మండపంలో హైదరాబాద్‌కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ కళాకారులు అంబేద్కర్‌ జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్లు చూపించే ''సంఘం శరణం గచ్చామి'' అనే కథా రూపకం ప్రదర్శిస్తున్నారు. సామర్లకోట ట్రాన్స్కో ఎఈ పి రమేష్‌ కుమార్‌, కౌన్సిలర్‌ నేతల హరిబాబుల ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని ప్రజా నాట్యమండలి, సిపిఐ నాయకులు, అధిక సంఖ్యలో డా.అంబేద్కర్‌ సంఘ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కాగా నిమ్న జాతుల ఉద్ధరణ కోసం అంబేద్కర్‌ చేసిన పోరాటాలు, ఆయన జీవిత చరిత్ర, రాజ్యాంగ రచన విషయాలను కళ్ళకు కట్టినట్లు కళాకారులు ప్రదర్శించారు. కాగా రెండున్నర గంటల పాటు జరిగిన ప్రదర్శనలో అడుగడుగునా ప్రజల కరతాళ ధ్వనులతో ఫంక్షన్‌ హాలు మార్మోగింది. కళాకారులంతా వారి పాత్రలలో జీవించగా అందరి మన్ననలు అందుకున్నారు.