ముంబయి : విదేశీ బ్యాంక్లు ఒక్కొక్కటిగా దివాళా తీయడం లేదా వాటి ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిడిలోకి జారుకోవడంతో ఆ ప్రభావం భారత ఐటి పరిశ్రమపై పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నాస్కామ్ గణంకాల ప్రకారం.. భారత ఐటి పరిశ్రమకు బ్యాంకింగ్ ఫైనాన్సీయల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బిఎఫ్ఎస్ఐ) రంగం అతిపెద్ద ఖాతాదారుగా ఉంది. 2022-23లో ఈ విభాగం నుంచే 41 శాతం రెవెన్యూ సమకూరింది. ప్రస్తుత పరిణామాలు ఐటి పరిశ్రమ ఆదాయాన్ని దెబ్బతీయడంతో పాటుగా.. ఆయా కంపెనీలు విదేశీ బ్యాంక్ల్లో పెట్టిన పెట్టుబడులు ఐటి పరిశ్రమను ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నలాజీస్, ఎంపాసిస్, ఎల్టిఐమైండ్ట్రీ తదితర భారత ఐటి కంపెనీలు కొన్ని అనిశ్చిత్తిలోని గ్లోబల్ బ్యాంక్లకు నిధులను అందించాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సుస్సె, యుబిఎస్ల్లో టిసిఎస్ నగదు ఉంది. ఎస్విబి ఇప్పటికే దివాళా తీసినట్లు నోటీసులు ఇచ్చింది. దీంతో టిసిఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల తమ మార్చి త్రైమాసికం ఫలితాల్లో ప్రొవిజన్స్ చేయాల్సి రావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఐటి పరిశ్రమ మధ్య, స్వల్ప కాలానికి పెను సవాలేనని పేర్కొంటున్నారు. వచ్చే త్రైమాసికంలో ఐటి కంపెనీలపై మరింత ఒత్తిడి ఉండొచ్చని ఎఐఐఆర్ సిఇఒ పరీక్ జైన్ పేర్కొన్నారు. అమెరికాలో ఇటీవల చోటు చేసుకున్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్విబి) సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ బ్యాంక్లను, ఐటి కంపెనీలను కలవరానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే.










