Nov 12,2022 06:56

శతాబ్దాల తరబడి అణచివేతకు గురైన కుల వ్యవస్థ ఆధారంగా, 'సామాజికంగా, విద్యా పరంగా' వెనుకబడిన కులాలకు రిజర్వేషన్‌ను సమర్ధిస్తూనే అన్ని కులాలు, కమ్యూనిటీలకు చెందిన నిరుపేదలను, కార్మికులను సమైక్యం చేయడానికి సిపిఎం కృషి చేస్తోంది. ప్రస్తుతమున్న దోపిడీతో కూడిన సామాజిక, ఆర్థిక వ్యవస్థతో పోరాడేందుకు ఇదొక మార్గం. విభేదాలను అధిగమించేందుకు, అన్ని కులాలకు చెందిన నిరుపేద వర్గాల ఐక్యత కోసం జనరల్‌ కేటగిరీలోనే నిరుపేద వర్గాలకు కొంత మొత్తంలో రిజర్వేషన్‌ కల్పించాలని సిపిఎం వాదించింది. సహజంగానే ఒబిసిల, ఎస్‌సి, ఎస్‌టిల ప్రస్తుత కోటా శాతాన్ని ఇది దెబ్బతీయలేదు.

       జనరల్‌ కేటగిరీ పరిధిలోనే ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఇడబ్ల్యుఎస్‌) రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును ఇటీవల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం 3-2 ఓట్ల తేడాతో సమర్ధించింది. 2019 జనవరిలో పార్లమెంట్‌లో తీసుకు వచ్చిన ఈ రాజ్యాంగ సవరణకు సిపిఎం మద్దతిచ్చింది.
         జనరల్‌ కేటగిరీలో ఇడబ్ల్యుఎస్‌కు గరిష్టంగా 10 శాతం వరకు రిజర్వేషన్‌కు ఈ సవరణ వీలు కల్పించింది. అంటే, వెనుకబడిన తరగతులు, ఎస్‌సి, ఎస్‌టి కేటగిరీల్లోకి రానివారికి ఇది వర్తిస్తుంది.
        ఒబిసి రిజర్వేషన్ల కోసం 1990లో మండల్‌ కమిషన్‌ చేసిన సిఫార్సుల అమలు సమయంలో జనరల్‌ కేటగిరీకి చెందిన పేదలకు కూడా కొంత మొత్తంలో రిజర్వేషన్‌ వుండాలన్న నిబంధనను సిపిఎం లేవనెత్తింది.
          ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్‌కు సిపిఎం పూర్తిగా మద్దతిస్తూనే, జనరల్‌ కేటగిరీలోని నిరుపేద వర్గాలకు ఆర్థిక ప్రామాణికతపై కొంత కోటా వుండాలని డిమాండ్‌ చేసింది. ఇటువంటి నిబంధన తీసుకురావడం వల్ల, రిజర్వేషన్‌ వ్యతిరేక ఆందోళనలతో చోటు చేసుకునే తీవ్రమైన అభిప్రాయ బేధాలు, చీలికలనేవి కొంతవరకు తగ్గుతాయని పార్టీ అభిప్రాయపడింది. వర్గ దృక్పథాన్ని కలిగిన పార్టీ, ఒబిసి కోటాలోనే ఆర్థిక ప్రామాణికాలు వుండాలని కూడా భావిస్తోంది. తద్వారా ఈ వర్గాలకు చెందినవారిలో నిజంగా అర్హులైన వారు ఆ కోటాను ఉపయోగించుకుంటారని అభిప్రాయపడింది. అనంతర కాలంలో 'క్రీమీ లేయర్‌' రూపంలో సుప్రీం కోర్టు దీన్ని ఆమోదించింది.
           శతాబ్దాల తరబడి అణచివేతకు గురైన కుల వ్యవస్థ ఆధారంగా, 'సామాజికంగా, విద్యా పరంగా' వెనుకబడిన కులాలకు రిజర్వేషన్‌ను సమర్ధిస్తూనే అన్ని కులాలు, కమ్యూనిటీలకు చెందిన నిరుపేదలను, కార్మికులను సమైక్యం చేయడానికి సిపిఎం కృషి చేస్తోంది. ప్రస్తుతమున్న దోపిడీతో కూడిన సామాజిక, ఆర్థిక వ్యవస్థతో పోరాడేందుకు ఇదొక మార్గం. విభేదాలను అధిగమించేందుకు, అన్ని కులాలకు చెందిన నిరుపేద వర్గాల ఐక్యత కోసం జనరల్‌ కేటగిరీలోనే నిరుపేద వర్గాలకు కొంత మొత్తంలో రిజర్వేషన్‌ కల్పించాలని సిపిఎం వాదించింది. సహజంగానే ఒబిసిల, ఎస్‌సి, ఎస్‌టిల ప్రస్తుత కోటా శాతాన్ని ఇది దెబ్బతీయలేదు. ప్రస్తుతమున్న రిజర్వ్‌డ్‌ కోటాలను ఉపయోగించుకోలేని అన్ని మతపరమైన గ్రూపులు, కమ్యూనిటీలను కలుపుకుని వుండే జనరల్‌ కేటగిరీ నుండే ఇడబ్ల్యుఎస్‌ కోటా రూపొందింది.
          అయితే, ఇడబ్ల్యుఎస్‌ కిందకు ఎవరు వస్తారనేది నిర్వచించేందుకు మోడీ ప్రభుత్వం...ఆఫీసు మెమోరాండం ద్వారా నిర్దేశించిన ప్రమాణాలను పార్టీ విమర్శించింది. విద్య, ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వ కోటాకు ఇడబ్ల్యుఎస్‌ వర్తించాలంటే సదరు కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల లోపు వుండాలి. వ్యవసాయ భూమి 5 ఎకరాలకు మించి వుండరాదు. లేదా నోటిఫైడ్‌ మున్సిపాలిటీలో వెయ్యి చదరపు అడుగుల నివాస ప్రాంతం లేదా వంద చదరపు గజాల స్థలం వుండరాదు. అంటే దీనర్ధం నిరుపేదలు కానివారు ఇడబ్ల్యుఎస్‌ కోటాను ఉపయోగించుకోలేరు. ఆదాయ పన్ను మినహాయింపునకు పరిమితి ఏడాదికి రూ.2.5 లక్షలుగా వుంది. అది దాటితే ఎవరైనా ఆదాయపన్ను చెల్లించాల్సిందే. అలాగే ఐదెకరాల స్వంత వ్యవసాయ భూమి వుంటే వారు పేదలు కాదు.
           ఆ రకంగా, ఈ పరిమితి హద్దులు చాలా ఎక్కువగా, విస్తృతంగా వుంచడం వల్ల ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్‌ ప్రయోజనం నెరవేరదు. ఈ ఆఫీసు మెమోరాండాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలవడంతో సుప్రీం కోర్టు ఇంకా ఈ విషయంపై పరిశీలన జరపాల్సి వుంది.
        రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు, చదువు కోసం ఇడబ్ల్యుఎస్‌ కోటా వర్తింపును రాష్ట్రాలకు విడిచిపెట్టబడింది. ఇడబ్ల్యుఎస్‌ ప్రామాణికాలు, ఎంతవరకు కోటా ఇవ్వవచ్చనే అంశాన్ని నిర్ణయించేందుకు కేరళ లోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఏడాదికి రూ.4 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగినవారు, రెండున్నర ఎకరాలను మించి వ్యవసాయ భూమి లేని కుటుంబాలు ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్‌కు అర్హులని జస్టిస్‌ శశిధరన్‌ నాయర్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది.
        2020లో కేరళ మంత్రివర్గం ఈ సిఫార్సులను ఆమోదించింది. ప్రస్తుతం కేరళలో విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ అమలవుతోంది. జనరల్‌ కోటా లోని నిరుపేద వర్గాలను ఉద్దేశిస్తూ ఇడబ్ల్యుఎస్‌ను నిర్వచించేందుకు ప్రామాణికాలను ఆమోదించారు.
వాస్తవానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ కోటా ప్రయోజనాలు అందాలనుకుంటే... ఇడబ్ల్యుఎస్‌ను నిర్వచించే ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే సవరించాలి.

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)