Sep 27,2023 13:15

హైదరాబాద్‌ : ప్రముఖ నటుడు నవీన్‌ చంద్ర 'అందాల రాక్షసి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చినా.. హిట్‌ కొట్టిన చిత్రమంటూ లేదు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే వరుస అపజయాలతో తాను రెండేళ్లు డిప్రెషన్‌కి గురైనట్లు నవీన్‌ చెప్పారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత హీరోయిన్‌ స్వాతితో కలిసి నవీన్‌చంద్ర 'మంత్‌ ఆఫ్‌ మధు' చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో నవీన్‌ మాట్లాడుతూ.. 'మా నాన్న ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేసేవారు. నాకు మొదటి నుంచి సినిమాల పిచ్చి ఎక్కువగానే ఉండేది. అదే నన్ను ఇంతవరకు ప్రయాణం చేసేలా చేసింది. అయితే నాకు నటన కంటే ముందు డ్యాన్స్‌ బాగా తెలుసు. నాకు హీరోగా అవకాశమిచ్చిన చిత్ర దర్శకుల వల్ల నటన నేర్చుకోగలిగాను. ఒక స్టేజ్‌లో నా కెరీర్‌ ఎటుపోతుందో నాకే అర్థం కాలేదు. ఇండిస్టీలో ఎలాంటి సపోర్ట్‌ లేకపోవడం వల్ల ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టమైంది. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. డిప్రెషన్‌ నుంచి బయటకు రావడానికి రెండేళ్లు సమయం పట్టింది. అప్పటి నుంచి గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా నన్ను నేను కరెక్ట్‌ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను.' అని అన్నారు.