హక్కుల దుర్వినియోగాన్ని ఖండించండి : మోడీ సర్కారు తీరుపై బైడెన్కు హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ గ్రూపు లేఖ
- మణిపూర్ హింస నేపథ్యంలో ఆహ్వానం సరికాదు
- లేఖపై 58 సంస్థలు, 200 మందికి పైగా వ్యక్తుల సంతకాలు
- అమెరికాకు బయలుదేరిన భారత ప్రధాని
న్యూఢిల్లీ : భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటన బుధవారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నది. ఈ పర్యటన కోసం ఆయన ఇప్పటికే భారత్ నుంచి బయలుదేరారు. మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో కొన్ని సంస్థలు, వ్యక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. భారత్లో హక్కుల దుర్వినియోగం, విమర్శకులపై మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును ఉటంకిస్తూ అమెరికాలోని లాభాపేక్షలేని గ్రూపు అయిన హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ (హెచ్ఆర్హెచ్) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఒక లేఖ రాసింది. మోడీ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ బహిరంగంగా ఖండించాలని కోరింది. ఈ లేఖపై 58 సంస్థలు, 200 మందికి పైగా వ్యక్తులు సంతకాలు చేశారు.
భారత్లో మానవ హక్కుల సంక్షోభాన్ని పరిష్కరించడానికి మార్గాలు అన్వేషించటం కోసం.. భారతీయ-అమెరికన్ మానవ హక్కుల, పౌర సమాజ నాయకులతో చర్చించాలని అమెరికా అధ్యక్షుడిని హెచ్ఆర్హెచ్ కోరింది. బైడెన్.. మోడీని వ్యక్తిగతంగా విమర్శించడానికి ఇష్టపడకపోయినా.. అధికారాన్ని ఏకీకృతం చేయడానికి, భారత ప్రజల అభీష్టాన్ని దెబ్బతీసేందుకు భారత ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని, ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని విమర్శించడానికి తగినంత అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ''మీరు మాట్లాడితే ప్రధాని మోడీ వింటారు. మీరు బహిరంగంగా ఒక స్టాండ్ తీసుకుంటేనే అతను, అతని మిత్రులు మారుతారు. భారత్ గురించి పట్టించుకునే మీ మాట వినాలనీ, భారత్లో ప్రజల భవిష్యత్తును, హక్కులను ఒక వ్యక్తి దొంగిలించలేడని నిర్ధారించుకోవాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం'' అని లేఖలో వివరించింది.
మోడీకి వ్యతిరేకంగా ర్యాలీ
మణిపూర్లో జాతి హింస చెలరేగిన నేపథ్యంలో మోడీని అమెరికా పర్యటనకు ఆహ్వానించటంపై హెచ్ఆర్హెచ్ బైడెన్ను తప్పుబట్టింది. హెచ్ఆర్హెచ్ లేఖ ప్రకారం.. మానవ హక్కులపై భారత ప్రభుత్వం పెంచు తున్న దాడులకు వ్యతిరేకంగా బహిరంగంగా, అర్థవంతంగా వెనక్కి నెట్టాలని కోరింది. మానవ హక్కుల పట్ల కట్టు బాట్లను గౌరవించాలని భారత ప్రభుత్వానికి బహిరంగంగా పిలుపునివ్వాలని, రాజకీయ విమర్శకులను ఏకపక్షంగా నిర్బంధించడానికి చట్టాలను ఉపయోగిస్తున్న మోడీ, ఆయన క్యాబినెట్ను హెచ్చరించాలని చెప్పింది. మోడీకి, ఆయన ఫాసిస్టు పాలనలో మానవ హక్కులు, ముఖ్యంగా మైనారిటీల హక్కులు ప్రమాదంలోకి పడిపోవటానికి వ్యతిరే కంగా బుధవారం అమెరికాలో ఒక ర్యాలీ జరగనున్నది. ఈ ర్యాలీ స్పాన్సర్లలో హెచ్ఆర్హెచ్ కూడా ఉన్నది.
భారత ప్రజాస్వామ్యంపై మూడు దాడులు
సమ్మిట్ ఫర్ డెమొక్రసీకి వారం ముందు భారత ప్రజాస్వామ్యంపై వరుసగా మూడు దాడులను లేఖ ప్రస్తావించింది. ''మొదట, అధికార బిజెపి రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి బహిష్కరించింది. రెండోది, భారత ప్రభుత్వం పంజాబ్లో ఇంటర్నెట్ను నిలిపివేసింది. మూడోది, ఉగ్రవాదానికి సంబంధించి భారతీయులను దోషులుగా గుర్తించవచ్చని భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది'' అని లేఖలో పేర్కొన్నది. బైడెన్ ప్రభుత్వంలో వీటి గురించి ఎవరూ మాట్లాడలేదు అని వివరించింది. ఇస్లామోఫోబిక్ హింస భారత్ను పట్టుకున్న తర్వాత సమ్మిట్ ఫర్ డెమొక్రసీలో మాట్లాడాలని మీరు(బైడెన్) మోడీని ఆహ్వానించారు అని ఆందోళన వ్యక్తం చేసింది.
మోడీ పాలనలో నిరంకుశ దేశంగా భారత్
భారత-అమెరికన్ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, పౌర హక్కులు, మతాంతర సంస్థల కూటమి అయిన కొయలిషన్ ఫర్ రీక్లెయిమింగ్ ఇండియన్ డెమొక్రసీ.. మోడీని ఆహ్వానించాలనే బైడెన్ నిర్ణయానికి, భారత్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా వాషింగ్టన్ డీసీలో రెండు విలేకరుల సమావేశాలను నిర్వహించనున్నది. మోడీ పాలనలో భారత్.. ప్రపంచంలో అత్యంత వేగమైన నిరంకుశ దేశాలలో ఒకటని ఈ కూటమి పేర్కొంది. గత మూడేళ్లుగా భారత్ను మోడీ ప్రభుత్వం 'పాక్షిక స్వేచ్ఛా' దేశంగా తయారుచేసిందని 'ఫ్రీడమ్ హౌజ్' వివరించింది. మోడీ సర్కారు కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత అక్కడ మానవ, పౌర, రాజకీయ హక్కుల ఉల్లంఘన జరిగిందనీ, కాశ్మీర్ స్వేచ్ఛా ప్రాంతం కాదని ఆరోపించింది.
పత్రికా స్వేచ్ఛ ర్యాంకింగ్-2023లో భారత్ స్థానం 161కి పడిపోయిందనీ, అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల హత్యల జవాబుదారీతనాన్ని పరిశీలించే సూచీలో 15 ఏళ్లుగా భారత్ ఉన్నదనీ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత 11వ స్థానంలో ఉన్నదని హెచ్ఆర్హెచ్ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా రచయితలను జైలుకు పంపిన టాప్-10 దేశాలలో భారత్ ఒకటని 2022 పెన్ అమెరికాస్ ఫ్రీడమ్ టు రైట్ ఇండెక్స్ను ఉటంకించింది.
2017 నుంచి ప్రతి ఏడాదీ సామూహిక దురాగతానికి గురయ్యే ప్రమాదంలో ఉన్న టాప్-15 దేశాలలో భారత్ ఒకటిగా ఉన్నదనీ, ఇది మోడీ హయాంలో భారత రాజకీయాల విషపూరితను ప్రతిబింబిస్తుందన్న యుఎస్ హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియం వెల్లడించిన అంశాన్ని హెచ్ఆర్హెచ్ గుర్తు చేసింది. కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ దళిత్ రైట్స్తో పాటు పలు సంస్థలు ఈ లేఖపై సంతకాలు చేసిన వాటిలో ఉన్నాయి.