ఆర్మూర్ :అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిని తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరపున వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. ఇది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు కష్టమొస్తే తనకొచ్చినట్లేనని భావించే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటారని అన్నారు.










