Dec 27,2022 07:30

మన జనాల్లో రెండు పూటలా తిండి తినేందుకు అవసరమైన వాటిని కొనుగోలు చేసే శక్తి ఎందరికి ఉంది? నిజానికి అలాంటి శక్తే ఉంటే పిల్లలు, మహిళల్లో రక్తహీనత ఎందుకు ఉన్నట్లు ? ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లల్లో రక్తహీనత ఉన్నవారు 2015-16తో పోలిస్తే 2019-21 కాలంలో 58.6 నుంచి 67.1 శాతానికి పెరిగినట్లు 2022 ఆగస్టు 5న కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ పార్లమెంటులో ప్రకటించారు. ఇది మన ప్రభుత్వ సర్వే ప్రకారమే తేలింది. దీనికి కారణం ఏమిటి? మెజారిటీ రాష్ట్రాల్లో రెండు ఇంజన్ల సర్కార్లే ఉన్నాయి.

రోనా సాయం పేరుతో 2020 నుంచి 2022 డిసెంబరు వరకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చే పథకం ముగిసింది. దాన్ని 2023 ఆఖరు వరకు పొడిగించాలని తాజాగా కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇది 2024 ప్రారంభంలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసమని ఎవరైనా అంటే అవునో కాదో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు.
         ఈ పథకం గురించి గతంలో బిజెపి ఏం చెప్పింది, ఇప్పుడు ఎలా ప్రచారం చేసుకుంటోంది? 2013లో నాటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పార్లమెంటు సమావేశాలకు ముందు అదెందుకు అని నాడు ప్రతిపక్ష బిజెపి ప్రశ్నించింది. దాని మీద పార్లమెంటు చర్చలో బిజెపి నేత మురళీ మనోహర్‌ జోషి ఆ బిల్లు ఆహారం కోసం కాదు, కాంగ్రెస్‌ ఓట్ల భద్రత కోసం తెచ్చిందని సెలవిచ్చారు. ఇక బిజెపి మాజీ కేంద్ర మంత్రి శాంతకుమార్‌ పార్టీ అంతరంగాన్ని వెల్లడిస్తూ బహిరంగంగా చెప్పిన అంశాల మీద (2015 జనవరి 23న ఇచ్చిన వార్తకు) టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పెట్టిన శీర్షిక ''జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని బిజెపి వ్యతిరేకించిందని చెప్పిన ఆహార శాఖ మాజీ మంత్రి శాంత కుమార్‌''. శాంత కుమార్‌ (88) బిజెపిలో వెనుకటి తరానికి చెందిన వారు. అలాంటి వారిలో కొంత మంది పార్టీ ఏదైనా కొన్ని సందర్భాలలో సూటిగా మాట్లాడతారు. ఆహార భద్రతా చట్టాన్ని ప్రారంభం నుంచీ బిజెపి వ్యతిరేకించినప్పటికీ ఎన్నికల ముందు జనంలో చెడుగా చూపే అవకాశం ఉన్నందున సమర్ధించినట్లు చెప్పారు. పార్లమెంటులో చర్చకు వచ్చినపుడు 67 శాతం మందిని ఆ చట్టపరిధిలోకి తేవటం చాలా ఎక్కువని చాలా మంది భావించారు, ఎన్నికలే గనుక లేకపోతే అదే చెప్పేవారు. ఎలాగూ తమ ప్రభుత్వం వస్తుందని, దాన్ని సవరిస్తాం గనుక మేము కూడా ఆమోదించామన్నారు. ఇక నరేంద్ర మోడీ గుజరాత్‌ సిఎంగా కేంద్రానికి ప్రతిపాదిత ఆ బిల్లు మీద ఒక లేఖ రాశారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇచ్చే ఆహార ధాన్యాలను నెలకు 35 నుంచి 25 కిలోలకు తగ్గించటం ఏమిటని మండిపడుతూ భద్రత సంగతి సరే...ఆ మొత్తంతో అవసరమైన క్యాలరీల శక్తిని ఎలా సమకూర్చు కోగలరని ప్రశ్నిస్తూ...ఆ బిల్లు ఒక మనిషికి రెండు పూటలా తిండికి హామీ ఇవ్వటం లేదన్నారు. నిజంగా ఎంత చక్కగా చెప్పారు. చిత్రం ఏమిటంటే ఆ తరువాత మూడోసారి లోక్‌సభ ఎన్నికలకు పోతున్నప్పటికీ సరఫరాను ఒక్క కిలో కూడా పెంచలేదు.
        ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం పడిపోతున్నది తప్ప మెరుగుపడటం లేదు. 2022లో అంతకు ముందున్న 101 నుంచి 107కు దిగజారింది. మదింపు సరిగా జరగటం లేదని ప్రతిసారీ బిజెపి, కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతున్నది. దాని సంగతి పక్కన పెడితే ప్రపంచ సంస్థలు మన సూచికను పెంచే వరకు లేదా అసలు అన్నార్తులు లేరు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు ఉచితంగా ఆహార ధాన్యాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంత మాత్రాన బిజెపి రాజకీయాన్ని జనం దృష్టికి తేకుండా ఉండాల్సిన అవసరం లేదు. తాజాగా కేంద్ర ఆహార మంత్రి పియూష్‌ గోయల్‌ తమ ప్రధాని చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఏడాది పాటు 81.35 కోట్ల మందికి ఉచితంగా ఆహార పంపిణీ జరపనున్నట్లు జేజేలు పలికారు. ఈ పథకాన్ని దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి అమలు జరపాలి. 2014 నుంచి మూడేళ్ల వరకు అమలు జరపాలని 2013లో నిర్ణయించారు. తరువాత అవసరాన్ని బట్టి అమలు చేస్తున్నారు. లేక పాలక పార్టీకి ఓట్ల కోసం ప్రజల సొమ్ముతో అర్హత లేని వారికి కూడా ఇస్తున్నారా? సమాధానం చెప్పేవారెవరు? పరిస్థితి ఇలా ఉంటే పేదలకు అనుచితంగా ఉచితాలను ఇస్తున్నారని, గుజరాత్‌లో అలాంటి పథకాలు, ప్రలోభాలను తిరస్కరించారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఇది నిజమేనా ?
         ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) 2020లో వేసిన అంచనా ప్రకారం మన దేశంలో తీవ్ర ఆహార కొరతతో 22 కోట్ల మంది, ఒక మోస్తరు నుంచి తీవ్రంగా ఉన్న వారు 62 కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. ప్రపంచానికి ఆహార ఎగుమతులు చేస్తున్న మన దేశంలో ఆకలి ఏమిటని కొందరు అడుగుతారు. లేదని నమ్మించ చూస్తారు. ఆఫ్రికాలో వజ్రాలు, బంగారు గనులున్నా అక్కడ ఎంత మంది చేతిలో అవి ఉన్నాయి ? అలాగే మన జనాల్లో రెండు పూటలా తిండి తినేందుకు అవసరమైన వాటిని కొనుగోలు చేసే శక్తి ఎందరికి ఉంది? నిజానికి అలాంటి శక్తే ఉంటే పిల్లలు, మహిళల్లో రక్తహీనత ఎందుకు ఉన్నట్లు ? ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లల్లో రక్తహీనత ఉన్నవారు 2015-16తో పోలిస్తే 2019-21 కాలంలో 58.6 నుంచి 67.1 శాతానికి పెరిగినట్లు 2022 ఆగస్టు 5న కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ పార్లమెంటులో ప్రకటించారు. ఇది మన ప్రభుత్వ సర్వే ప్రకారమే తేలింది. దీనికి కారణం ఏమిటి? మెజారిటీ రాష్ట్రాల్లో రెండు ఇంజన్ల సర్కార్లే ఉన్నాయి. గుజరాత్‌లో పరిస్థితి మరీ దారుణం. జాతీయ సగటు కంటే ఎక్కువగా గడచిన ఐదు సంవత్సరాల్లో పిల్లల్లో రక్తహీనత 62.6 నుంచి 79.7 శాతానికి పెరిగింది, తీవ్ర పరిస్థితిలో ఉన్నవారు 1.7 నుంచి 3.1 శాతానికి పెరిగారు. పిల్లలే కాదు. స్త్రీ, పురుషులందరిలో రక్తహీనత పెరిగింది. ప్రతివారం పండ్లు తీసుకొనే వారు దేశంలో సగటున 56.1 శాతం ఉంటే అభివృద్ధి చెందిన గుజరాత్‌లో 39.8 శాతమే (2022 మే 23 టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా). దీనికి ఏమంటారు? జాతీయ వినియోగ ఖర్చు గురించి 2017-18 సర్వే వివరాలను మోడీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. తరువాత అసలు సర్వే ఊసే లేదు.
          రెండు ఇంజన్ల బిజెపి పాలిత రాష్ట్రాలు, సంక్షేమ పథకాల అమలు గురించి గొప్పలు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం చూసినా కేరళలో పరిస్థితి మెరుగ్గా ఉంది. నాలుగవ సర్వేతో పోలిస్తే ఐదవ సర్వేలో దేశంలో దేశం మొత్తంలో రక్తహీనత సమస్య పెరిగింది.
ఇక 2022 సామాజిక ప్రగతి సూచికను చూస్తే బిజెపి రెండు ఇంజన్ల ప్రభుత్వాల వైఫల్యం గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సూచికలను చూస్తే 36కు గాను బిజెపి ఏలుబడిలోని అసోం 34, మధ్యప్రదేశ్‌ 33, ఉత్తర ప్రదేశ్‌ 31, గుజరాత్‌ 22, హర్యానా 21, వైసిపి పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 23, తెలంగాణ 26వ స్థానంలో ఉంది. తమిళనాడు, కేరళ 6,9 స్థానాల్లో ఉన్నాయి. తొలి ఐదు స్థానాల్లో పుదుచ్చేరి, లక్షద్వీప్‌, గోవా, సిక్కిం, మణిపూర్‌ ఉన్నాయి.
            ఉచితాల గురించి ఆర్‌బిఐ విడుదల చేసిన ఒక నివేదికలో 2022-23 బడ్జెట్లలో కేరళలో సున్నా కేటాయింపులు వున్నట్లు పేర్కొన్నది. తొలి రెండు స్థానాల్లో పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం 2022 మార్చి ఆఖరుకు మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో పురుష వ్యవసాయ కార్మికులకు అతి తక్కువగా రోజువారీ సగటు వేతనం వరుసగా...రూ.217.8, 220.3 చొప్పున ఉండగా...కేరళలో రూ.726.8 ఉంది. నిర్మాణ రంగంలో రూ.837.7 కాగా గుజరాత్‌లో రూ.373 ఇస్తున్నారు. దేశ కార్మిక శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర పనులకు 2020-21లో సగటు వేతనం రూ.315.3 కాగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.305.3 ఉండగా కేరళలో అది రూ.677.6 ఉంది. అందుకే అంటారు, జనాలకు చేపలను తెచ్చి పెట్టటం ఉచితం. అదే చేపలను పట్టటం నేర్పితే సాధికారత. ఏడాదికి వంద రోజులు సగటున పని దొరికిందనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో రూ.30,530 రాబడి ఉంటుంది. అదే కేరళలో రూ.67,776 వస్తుంది. అందుకే అక్కడ ఉచితాలతో పని లేదు.
           దేశమంటే అదానీ, అంబానీలు కాదు. మనుషులు అన్నపుడు...గుజరాత్‌లో మనుషు లెందుకు అంతగా అధ్వాన్న జీవితం గడుపుతున్నారో వేరే చెప్పాలా? కనికట్టుతో గుజరాత్‌లో అంతా బాగుంది..అంతా బాగుంది.. అని నరేంద్ర మోడీ గారడీ చేస్తే కుదరదు. తన పాలన వైఫల్యాలు దాస్తే దాగేవి కాదు.

ఎం. కోటేశ్వరరావు

ఎం. కోటేశ్వరరావు