Sep 13,2023 10:24
  • మరట్వాడాలో 685 మంది ఆత్మహత్య
  • వ్యవసాయ మంత్రి సొంత జిల్లాలోనే అత్యధికం

ఔరంగాబాద్‌ : ప్రభుత్వ గణాంకాల ప్రకారమే.. మహారాష్ట్రలోని మరట్వాడా ప్రాంతంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకూ 685 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజరు ముండే సొంత జిల్లా అయిన బీద్‌లో అత్యధికంగా 186 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మధ్య మహారాష్ట్రలో మరట్వాడా అత్యంత దుర్భిక్ష ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఔరంగాబాద్‌, జల్నా, బీద్‌, పర్భాని, నాందేడ్‌, ఓస్మానాబాద్‌, హింగోలి, లాతూర్‌ జిల్లాలు ఉన్నాయి. బీద్‌లో 186 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతు న్నాయి. ముండే ఎన్‌సిపి నుంచి తిరుబాటు చేసి ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంలో చేరి, మంత్రి పదవి పొందారు. బీద్‌ జిల్లా తరువాత ఓస్మానాబాద్‌లో 113 మంది, నాందేడ్‌లో 110, ఔరంగాబాద్‌లో 95 మంది, పర్భానిలోని 58 మంది, లాతూర్‌లో 51 మంది, జల్నాలో 50 మంది, హింగోలిలో 22 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.