
ప్రజాశక్తి-బాపట్ల:సాగునీరు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు పొలంలోనే ఉరితాళ్లతో నిరసన తెలిపారు. బాపట్ల మండలం, మురుకొండపాడు గ్రామ శివారులో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ సాగునీరు లేక కళ్లెదుటే ఎండిపోతున్న పంటను కాపాడుకోలేని దైన్య స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టామని, పంటను కాపాడుకోవడం కోసం అష్టకష్టాలు పడుతున్నామన్నారు. సాగునీరు అందకపోవడంతో ఈ ఏడాది పంట చేతికి వస్తుందో, లేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లగా వైసిపి ప్రభుత్వం కాలంలో కాల్వల మరమ్మతులకు నోచుకోలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు.