May 01,2023 21:20

వాషింగ్టన్‌ : అమెరికాలో రెండో అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం అయినా ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను జెపి మోర్గన్‌ గ్రూప్‌ స్వాధీనం చేసుకుంది. ఇటీవల సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ తర్వాత ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ (ఎఫ్‌ఆర్‌బి) దివాలా అంచునకు చేరింది. తాజా నిర్ణయంతో ఆ బ్యాంక్‌ అన్ని డిపాజిట్లు, ఆస్తులు ఇక నుంచి జెపి మోర్గన్‌ స్వాధీనంలోకి వెళ్తాయని కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్సీయల్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికాలోని ది ఫెడరల్‌ డిపాజిట్స్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎఫ్‌డిఐసి) కూడా ధృవీకరించింది. బ్యాంకుల వరుస మూసివేతతో అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం వైపు పయనిస్తోంది. విత్త సంస్థల్లో ఆర్థిక స్థిరత్వం నెలకొనేలా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ అత్యవసర చర్యలు చేపడుతోంది. సోమవారం నుంచి అమెరికాలోని 8 రాష్ట్రాల్లోని 84 శాఖలను జెపి మోర్గన్‌ తెరువనుంది. ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ కోసం నిర్వహించిన వేలంలో పిఎన్‌సి ఫైనాన్షియల్‌ సర్వీసు గ్రూప్‌, సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ గ్రూపు సహా జెపి మోర్గన్‌తో కూడా బిడ్లు దాఖలు చేసింది. ఈ పోటీలో జెపి మోర్గన్‌ ఆ బ్యాంక్‌ను దక్కించుకుంది. ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌కు ఏప్రిల్‌ 13 నాటికి 229 బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. వీటితో పాటు 103.9 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఒక్కొక్కటిగా అమెరికన్‌ బ్యాంక్‌ల బలహీనతలు బయటపడుతున్నాయి. గడిచిన మార్చిలో ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ సహా సిల్వర్‌ గేట్‌ బ్యాంక్‌, సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌విబి), సిగేచర్‌ బ్యాంక్‌లు దివాళా తీసిన విషయం తెలిసిందే. ఎఫ్‌ఆర్‌బి నుంచి ఖాతాదారులు మార్చిలో సుమారు 100 బిలియన్ల డాలర్లు డిపాజిట్లను ఉపసంహరించుకున్నారు. గత వారం ఎఫ్‌ఆర్‌బి షేర్లు 75 శాతం పడిపోయాయి.