Oct 15,2023 13:11

ముంబయి : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్రపతి శంబాజీ నగర్‌ జిల్లాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే పై ట్రక్కును మినీ బస్సు వెనుక నుండి వచ్చి ఢీకొట్టడంతో 12 మంది మృతి చెందారు. 23మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన ముంబయికి 350 కి.మీ దూరంలో వైజాపుర్‌ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి 12 గంటల 30 నిముషాలకు జరిగింది.

పోలీసుల కథనం మేరకు ... బుల్దానా నుండి ఛత్రపతి సంభాజీనగర్‌కు నాసిక్‌ మీదుగా వెళుతున్న మినీ బస్సు సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే పై అదుపుతప్పి వెనుకకు వచ్చి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో 23 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఓ చిన్నారి, ఆరుగురు మహిళలు ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని సమీపాన ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదానికి అతి వేగం కారణమని పోలీసులు భావిస్తున్నారు. మినీ బస్సు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గతేడాది డిసెంబరులో ప్రధాని మోడి ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. దీనిపై ఇప్పటి వరకు సుమారు 900పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కొద్దిరోజుల క్రితం ఛత్రపతి శంబాజీ నగర్‌ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ''సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే రోడ్లు ఎలాంటి వంపులు లేకుండా తిన్నగా ఉంటాయి. అందుకే డ్రైవర్లకు నిద్రమత్తుగా అనిపించి.. ప్రమాదాలు జరుగుతున్నాయి. కారణం ఏదైనా సరే.. ఈ ప్రమాదాలను కట్టడి చేయాల్సి ఉంది'' అని అన్నారు.