Nov 20,2023 09:20

జైపూర్‌ : ప్రధాని మోడీ భద్రతా విధుల కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లోని జుంజునులో ప్రధాని ఎన్నికల సభకు వెళ్తుండగా, చురు జిల్లా సుజన్‌గఢ్‌ సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సుజన్‌గఢ్‌ సర్కిల్‌ ఆఫీసర్‌ (సిఒ) షకీల్‌ ఖాన్‌ కథనం ప్రకారం... నాగౌర్‌లోని ఖిన్‌వ్సర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఆరుగురు, మహిళా పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఒకరు ప్రధాని ఎన్నికల సమావేశానికి కారులో జుంజును బయల్దేరారు.
           సుజన్‌గఢ్‌ సదర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కనోటా చెక్‌పోస్ట్‌ సమీపంలో జాతీయ రహదారి-58పై అకస్మాత్తుగా ఓ జంతువు (నీల్‌గారు) వాహనం ముందుకు రావడంతో దాన్ని తప్పించేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ కారుపై నియంత్రణ కోల్పోయాడు. ఆగివున్న ట్రక్కును ఢకొీట్టాడు. దీంతో, వాహనం ముందు భాగం పూర్తిగా ఛిద్రమై ముక్కలైంది. తెల్లవారు జామున 5:30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఖిన్‌సర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఎఎస్‌ఐ రామచంద్ర, కానిస్టేబుళ్ల కుంభారం, సురేష్‌ మీనా, తానారామ్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ మహేంద్ర అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, డిజిపి ఉమేష్‌ మిశ్రా విచారం వ్యక్తం చేశారు.