Nov 22,2023 09:45

ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ (విశాఖ) : స్కూల్‌ పిల్లలు వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో 8మంది పిల్లలకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బుధవారం ఉదయం 8 గంటల సమయంలో విశాఖలోని సంగం, శరత్‌ థియేటర్‌ సమీపంలో ట్రాఫిక్‌ సిగల్‌ వద్ద జరిగింది. బేతని స్కూలు పిల్లలతో వెళుతున్న ఆటోను, లారీ ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. అందులో ఉన్న బేతని స్కూల్‌ పిల్లలు ఎనిమిదిమంది గాయపడ్డారు. గాయాలైనవారిలో నలుగురు విద్యార్థులను 7హిల్స్‌ హాస్పిటల్‌ కు తరలించగా ఒకరిని రైల్వే హాస్పిటల్‌ కి తరలించారు. ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. ఆటో డ్రైవర్‌ ను కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నారు. క్లీనర్‌ ను ద్వారక పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాసిని ప్రియ (14) పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.