Jul 04,2023 07:05

కేంద్రం వద్ద తగినంతగా బియ్యం నిల్వలు లేనందువలన అమ్మడం సాధ్యపడడం లేదన్నది మొదటి కారణం. మరి అటువంటప్పుడు కొద్ది రోజుల్లోనే 5 లక్షల టన్నుల బియ్యాన్ని, 4 లక్షల టన్నుల గోధుమల్ని అమ్మబోతున్నట్టు ఏ విధంగా ప్రకటించారు ? కర్ణాటక ప్రభుత్వం అడిగినది 2.46 లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే. ఆ మేరకు ఎఫ్‌సిఐ కర్ణాటకకు అమ్మవచ్చు. కాని, ఎఫ్‌సిఐ రాష్ట్ర ప్రభుత్వానికిి కాకుండా బియ్యం వ్యాపారులకు అమ్మడానికి సిద్ధమైంది.

ఆహారధాన్యాల ధరల పెరుగుదలకు కారణం వాటి డిమాండ్‌ పెరగడమే వాస్తవం అయితే అప్పుడు ప్రభుత్వమే నేరుగా ఆహారధాన్యాలను వినియోగదారులకు అందించడం వల్ల మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గి ధరలు తగ్గుతాయి. అదే వ్యాపారులకు ఆహారధాన్యాలను అమ్మితే వారు వాటిని వెంటనే మార్కెట్‌లో అమ్మకానికి పెడతారన్న గ్యారంటీ ఏమీ లేదు.

ర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ''అన్న భాగ్య'' పథకాన్ని జులై 1వ తేదీ నుండి అమలు చేస్తామని ప్రకటించింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతీ కుటుంబానికీ నెలకు 10 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేయాలన్నది ఆ పథకం లక్ష్యం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ కుటుంబాలకు నెలకు 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. దానికి మరో 5 కిలోలను అదనంగా చేర్చి ఒక కోటి 19 లక్షల మంది నిరుపేదలకు అందించాలన్నది కర్ణాటక ప్రభుత్వం ఉద్దేశ్యం. ఇప్పుడు ఈ పథకం చిక్కుల్లో పడింది. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సిఐ) కర్ణాటక ప్రభుత్వానికి బియ్యం అమ్మడానికి నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం కరోనా కాలంలో మొదలుపెట్టిన అంత్యోదయ పథకాన్ని ఎత్తివేయాలని కొంతకాలంగా యోచిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం గనుక అన్న భాగ్య పథకాన్ని మొదలుపెడితే కేంద్రం అంత్యోదయను కొనసాగించాల్సి వుంటుంది.
ఎఫ్‌సిఐ నిరాకరించిన అనంతరం ఇతర కేంద్ర ఏజన్సీల నుండి గాని, వేరే రాష్ట్రాలనుండి కాని బియ్యాన్ని కొనుగోలు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాని వాటి వద్ద తగినంత నిల్వలు లేవు. పైగా ఆ కేంద్ర ఏజన్సీలు కూడా కర్ణాటకకు బియ్యం అమ్మకుండా కేంద్రం అడ్డు పడవచ్చు. పైగా ఈ విధంగా కొనుగోలు చేయడం వలన బియ్యం ఖరీదు పెరుగుతుంది. స్కీమును అమలు చేయడానికి ఎక్కువ సొమ్ము ఖర్చవుతుంది. రాష్ట్ర బడ్జెట్‌ మీద అదనపు భారం పడుతుంది.
        బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏదో అరుదుగా జరిగిన ఘర్షణ కాదిది. అధికారాలు విపరీతమైన రీతిలో కేంద్రీకరించబడిన వైనం ఇది. కేవలం రాజకీయ కారణాల కోసం, అందునా, ఒక ప్రతిపక్ష పాలిత ప్రభుత్వం ప్రజాదరణ పొందకుండా ఉండడానికి కేంద్రం చేస్తున్న కుట్ర ఇది. అందుకోసమే ఒక ప్రజానుకూల కార్యక్రమాన్ని చెడగొట్టింది. ఒకపక్క కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈ అన్న భాగ్య పథకాన్ని అమలు కానీయకుండా అడ్డుపడుతూ వుంటే, మరోపక్క రాష్ట్రంలోని బిజెపి పార్టీ అక్కడ ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలనన్నింటినీ అమలు చేయాల్సిందేనంటూ గొంతెత్తి అరుస్తోంది.
           రాష్ట్రాలలో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చేపట్టినప్పుడు వాటిని కేంద్రం వ్యతిరేకించడం కొత్తేమీ కాదు. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆహారధాన్యాలను సబ్సిడీపై ప్రజలకు అందించే పథకాన్ని కుదించి కేవలం పేదవారికే దానిని పరిమితం చేసింది. అప్పటికి కేరళలో సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ అమలులో ఉంది. ఆ పథకాన్ని కొనసాగించడానికి కేరళ లోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అదనపు బియ్యాన్ని రాష్ట్రంలోనే కొనుగోలు చేసింది. నిజానికి ఎఫ్‌సిఐ కేరళ రాష్ట్రం నుండి లెవీ బియ్యాన్ని సేకరించదు. బియ్యం ఉత్పత్తిలో కేరళ లోటు రాష్ట్రంగా ఉండడమే దానికి కారణం. అయినా, ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఏ మేరకు అదనంగా బియ్యాన్ని రాష్ట్రంలో సేకరించిందో, ఆ మేరకు ఎఫ్‌సిఐ తన సరఫరాను కుదించింది!
అనవసరమైన, అవాంఛనీయమైన కేంద్రీకరణ అనేది కొత్తేమీ కాదు. కాని బిజెపి ప్రభుత్వం ఆ ప్రక్రియను ఇంతకు మునుపెన్నడూ లేనంతగా అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో కూడా కొనుగోలు చేయడానికి వీలులేని పరిస్థితులను కల్పిస్తోంది. ఈ విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం పట్ల అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి నిజానికి ఆ రాష్ట్రంలోని పేదలమీద సాగిస్తున్న దాడి అని గ్రహించాలి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రదర్శిస్తున్న వ్యతిరేకత వలన నష్టపోతున్నది పేదలే.
            ఎఫ్‌సిఐ కర్ణాటక ప్రభుత్వానికి బియ్యం అమ్మడానికి నిరాకరించడం వెనుక రాజకీయ దురుద్దేశాలేమీ లేవంటూ బిజెపి నాటకం ఆడుతోంది. కాని బియ్యం అమ్మకపోడానికి చెప్తున్న కారణాలు ఏవీ సరైనవి కావు. కేంద్రం వద్ద తగినంతగా బియ్యం నిల్వలు లేనందువలన అమ్మడం సాధ్యపడడం లేదన్నది మొదటి కారణం. మరి అటువంటప్పుడు కొద్ది రోజుల్లోనే 5 లక్షల టన్నుల బియ్యాన్ని, 4 లక్షల టన్నుల గోధుమల్ని అమ్మబోతున్నట్టు ఏ విధంగా ప్రకటించారు? కర్ణాటక ప్రభుత్వం అడిగినది 2.46 లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే. ఆ మేరకు ఎఫ్‌సిఐ కర్ణాటకకు అమ్మవచ్చు. కాని, ఎఫ్‌సిఐ రాష్ట్ర ప్రభుత్వానికిి కాకుండా బియ్యం వ్యాపారులకు అమ్మడానికి సిద్ధమైంది.
          ఎందుకిలా చేస్తోంది? అన్న ప్రశ్నకు చెప్తున్న సమాధానం ఏమిటి? వ్యాపారులకు బియ్యం అమ్మితే దాని వలన మార్కెట్‌లో ధరల పెరుగుదలను అరికట్టడం వీలౌతుందట. ఎఫ్‌సిఐ చైర్మన్‌ మీడియా ముందు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని ప్రకటించారు. బహిరంగంగా బియ్యాన్ని మార్కెట్‌లో అమ్మడం వలన ఆహారధాన్యాల ధరలు మార్కెట్‌లో తగ్గుతాయని చెప్పారు.
          ఇది చాలా వికృతమైన వాదన. ఆహారధాన్యాల ధరల పెరుగుదలకు కారణం వాటి డిమాండ్‌ పెరగడమే వాస్తవం అయితే అప్పుడు ప్రభుత్వమే నేరుగా ఆహారధాన్యాలను వినియోగదారులకు అందించడం వల్ల మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గి ధరలు తగ్గుతాయి. అదే వ్యాపారులకు ఆహారధాన్యాలను అమ్మితే వారు వాటిని వెంటనే మార్కెట్‌లో అమ్మకానికి పెడతారన్న గ్యారంటీ ఏమీ లేదు. వారు వాటిని నిల్వచేయవచ్చు. అప్పుడు ఆహారధాన్యాల ధరలు తగ్గవు. అదే ఆహారధాన్యాలను గనుక రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తే అవి నేరుగా ప్రజలకు చేరుతాయి. అప్పుడు ధరలు తగ్గుతాయి.
          1972లో కూడా ఇదేమాదిరిగా జరిగింది. అప్పుడు పంటలు దెబ్బతిన్నాయి. అందువలన ఆహారధాన్యాలకు కొరత ఏర్పడవచ్చునన్న అంచనాతో వాటి ధరలను బాగా పెంచివేశారు. అప్పటి ప్రభుత్వం దగ్గర నిల్వలు సరిపడా ఉన్నాయి. అప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం విడుదల చేసివుంటే, ప్రజానీకంలో గణనీయమైన భాగం బహిరంగ మార్కెట్‌కు రాకుండా దూరంగా ఉండేవారు. దానివలన బహిరంగ మార్కెట్‌లో బియ్యం డిమాండ్‌ తగ్గివుండేది. కాని ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయడానికి బదులు ఆ నిల్వలను బహిరంగ మార్కెట్‌లో అమ్మడానికి పూనుకుంది. బియ్యం వ్యాపారులు మహదానందంగా నిల్వలను అన్నింటినీ కొనుగోలు చేసి దాచిపెట్టారు. దాంతో ద్రవ్యోల్బణం యథాతథంగా కొనసాగింది.
            అది జరిగి యాభై సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం మళ్ళీ అదే పొరపాటు చేయడానికి సిద్ధపడుతోంది. ఇక్కడ మరో వాదన రావచ్చు. కర్ణాటక ప్రభుత్వ స్కీము వలన పేదలకు మరో 5 కిలోల బియ్యం అదనంగా లభిస్తుంది. అదనపు బియ్యాన్ని వాళ్ళు అదనంగా వినియోగిస్తారు. అంతే తప్ప బహిరంగ మార్కెట్‌లో బియ్యం డిమాండ్‌ ఏమీ తగ్గదు. అందుచేత ధరలు తగ్గవు.- ఇదే ఆ వాదన.
ఈ వాదన రెండు కారణాల రీత్యా తప్పు. మొదటిది: ఈ స్కీము వలన ప్రయోజనం పొందేవారు 4.42 కోట్ల మంది. వీరంతా తమ వినియోగాన్ని పెంచుతారే తప్ప బహిరంగ మార్కెట్‌ నుంచి చేసే కొనుగోళ్ళను తగ్గించరు అని భావించడం వాస్తవికత అనిపించుకోదు. ఎంతో కొంతమేరకు బహిరంగ మార్కెట్‌లో ఈ స్కీము వలన బియ్యం డిమాండ్‌ తగ్గుతుంది.
       రెండవది: మనం ద్రవ్యోల్బణం గురించి ఎందుకు ఆందోళన చెందుతాం ? అది పేదలను తక్కిన తరగతుల ప్రజలకన్నా ఎక్కువగా బాధిస్తుంది కనుక. దాని ఫలితంగా వారి వినియోగం తగ్గుతుంది కనుక. ఇప్పుడు ఈ స్కీము ద్వారా వారి వినియోగాన్ని నేరుగా పెంచడం సాధ్యపడుతోంది కదా. అటువంటప్పుడు ద్రవ్యోల్బణం తగ్గడం అనేదానికి పెద్ద ప్రాధాన్యత ఏముంటుంది? ఒకవైపు భారతదేశం ఆకలి సూచికలో వందవ స్థానంలో ఉన్నా, పేదల ఆకలి తీర్చడం కన్నా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికే ప్రాధాన్యత ఇవ్వడం అంటే ప్రభుత్వం ప్రాధాన్యతలే తప్పు అనుకోవాలి.
         అందుచేత బిజెపి ప్రభుత్వం ధరలను తగ్గించడ గురించి మాట్లాడుతున్నది కర్ణాటకకు బియ్యం అమ్మకపోవడాన్ని సమర్ధించుకోడానికే. దీనిని క్షమించకూడదు. తన స్వార్ధ రాజకీయాల కోసం పేదల బతుకులతో బిజెపి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఈ కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే ఆహారధాన్యాల ధరలను తగ్గించాలన్న నిశ్చయం ఉంది అనుకుంటే అప్పుడు రాష్ట్రానికి నేరుగా బియ్యాన్ని అమ్మాలే తప్ప వ్యాపారులకు కాదు.
ఆహారధాన్యాల పంపిణీని కేంద్రీకృతం చేయడం వలన మొత్తం దేశ ఆహార వ్యవస్థకే దెబ్బ తగులుతుంది. ప్రతిపక్ష పాలనలో ఉన్న రాష్ట్రాలు ఎఫ్‌సిఐని పక్కన పెట్టి నేరుగా ఆహారధాన్యాల సేకరణకు పూనుకుంటే అప్పుడు జాతీయ ప్రజాపంపిణీ వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోతుంది.
           అలా దెబ్బ తినిపోతే దానికి బిజెపి నుంచి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి ప్రజల అవసరాలేమీ పట్టవు. నిజానికి ఆ పార్టీ ముందుకు తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలు గనుక అమలులోకి వచ్చి వుంటే ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తినిపోయి వుండేది. కాని జాతీయ ప్రజాపంపిణీ వ్యవస్థ దెబ్బ తింటే దానివలన నష్టపోయేది యావత్తు దేశమే.

( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌