Oct 18,2023 13:04

అమరావతి : ఈ నెల 24వ తేదీన దసరా సెలవును ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎపిలోని పాఠశాలలకు అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తిరిగి అక్టోబరు 25న పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 11 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు ... విజయదశమి వేళ ప్రయాణీకుల సౌకర్యార్థం ఎపిఎస్‌ఆర్‌టిసి 5,500 ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. అక్టోబర్‌ 13వ తేదీ నుంచి 26వ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. సాధారణ ఛార్జీలతోనే ఈ సర్వీసులను నడిపిస్తోంది.

                                                             సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సుల వివరాలు...

ఈనెల 13 నుంచి 22 వరకు.. దసరా ముందు రోజులలో 2,700 బస్సులను నడుపనుంది. పండుగ దినాలైన 23వ తేదీ నుంచి 26 వరకు (పండుగ ముగిశాక కూడా) 2,800 బస్సులను నడిపించనున్నారు. హైదరాబాద్‌ నుండి 2,050 బస్సులు, బెంగుళూరు నుండి 440 బస్సులు, చెన్నై నుండి 153 బస్సులు వివిధ పట్టణాలకు నడపబడతాయి. విశాఖపట్నం నుండి 480 బస్సులు, రాజమండ్రి నుంచి 355 బస్సులు, విజయవాడ నుండి 885 బస్సులు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు, పల్లెలకు, నగరాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఎపిఎస్‌ఆర్‌టిసి ఏర్పాట్లు చేసింది.