Dec 03,2022 07:16

పరిస్థితులు మారతాయి. ఆ పరిస్థితులు తమ భర్తల ప్రవర్తనను మార్చుతాయని మహిళలు ఆశించారు. ఇతరులకు, ముఖ్యంగా తమ కుటుంబాలకు 'భారం' కావడానికి మహిళలు ఇష్టపడలేదు. 'మా అమ్మకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆమెకంటూ స్వంత జీవితం ఉంటుంది. అందువల్ల ఆమె ఇబ్బందులకు నా ఇబ్బందులు తోడవడం నాకిష్టం లేదు' వంటి సమాధానాలు వారి నోటెంట వచ్చాయి. తామెదుర్కొన్న హింసను నిర్దిష్టంగా చెప్పడం ద్వారా, వారి కుటుంబాలకు ఒక 'సమస్య'గా లేదా 'మానసిక వ్యధ'కు కారణంగా మారకూడదని...వారి కుటుంబాలకు తలవంపులు, అగౌరవం తేకూడదని... గృహహింస నుండి బయటపడిన మహిళలు విద్యా స్థాయి, కులం, వర్గంతో నిమిత్తం లేకుండా భావిస్తున్నారు.

అంతర్జాతీయంగా స్త్రీలపై జరుగుతున్న హింసా వ్యతిరేక దినమైన నవంబర్‌ 25కి కొద్ది రోజుల ముందు జరిగిందా దారుణ ఘటన. ఓ యువతిని తన జీవిత భాగస్వామి హత్య చేసి, ముక్కలు ముక్కలుగా నరికేశాడు. 'భాగస్వాములు చేస్తున్న హింస' గురించి ఈ సంఘటన ఆలోచింపచేసింది. 'గృహహింస నుంచి మహిళలకు రక్షణ చట్టం-2005' (పి.డబ్ల్యు.డి.వి.ఎ) దీనికి వర్తిస్తుందని కూడా గుర్తించారు. ఆమె తన జీవిత భాగస్వామిగా అతడ్ని ఎందుకు ఎంపిక చేసుకుంది? అతడ్ని ఎందుకు వదిలేయలేదు? లాంటి అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సహాయం కోరుతూ ఆమె చేసిన ప్రయత్నాలకు సంబంధించిన సాక్ష్యాలు బయట పడడంతో... ఈ చట్టాలు ఎందుకు అమల్లో లేవన్న సందేహం కలుగుతున్నది.
         భారతీయ చట్టాలు, నిబంధనల ప్రకారం గృహహింస శిక్షార్హమైన నేరం. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కూడా. అయినప్పటికీ, 18-49 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 32 శాతం మంది వివాహిత మహిళలపై హింస కొనసాగుతున్న సమాజంలో మనం బతుకుతున్నామని ఇటీవల జరిగిన 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5' నివేదిక తెలియజేస్తుంది. ఈ మహిళలు తమ భర్తలు పాల్పడుతున్న భావోద్వేగపూరిత, భౌతిక, లైంగిక హింసలకు గురవుతున్నారు. ఈ గృహహింస బారిన పడే వారిలో పట్టణ ప్రాంత మహిళల కంటే గ్రామీణ ప్రాంత మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇతర కుటుంబ సభ్యులు పాల్పడే హింస మీద ఈ సర్వే దృష్టి కేంద్రీకరించలేదు.
          పి.డబ్ల్యు.డి.వి.ఎ చట్టం వచ్చి పదిహేడు సంవత్సరాలైంది. భర్తల నుండి మాత్రమే కాక ఇతర కుటుంబ సభ్యుల హింస నుంచి కూడా మహిళలకు మద్దతుగా, రక్షణగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ చట్టం హామీ ఇచ్చింది. ఈ చట్టం కాగితాల మీద ఉన్నప్పటికీ, ఇప్పటికీ మహిళలు రక్షణ పొందలేకపోతున్నారు. దాని హామీలు, నిబంధనల అమలు అంతంత మాత్రంగానే వున్నాయి.
          అత్యంత నిరుత్సాహమైన వాస్తవమేమంటే, మూడింట ఒక వంతు మహిళలు గృహహింస కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ వారిలో కేవలం 14 శాతం మంది మాత్రమే సహాయాన్ని కోరుతున్నారు. ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా తక్కువగా ఉంటుందని నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-5 (2019-21) నివేదిక తెలుపుతున్నది. గృహహింసను నేరంగా పరిగణించే దేశంలో, హింసకు గురవుతున్న మహిళలను రక్షించేందుకు అనేక చట్టాలను రూపొందించిన దేశంలో, గృహహింసకు గురై ప్రాణాలతో బయటపడిన అనేక మంది మహిళలు ఎందుకు సహాయాన్ని కోరడం లేదు ?
                                                                               ప్రశ్నలు, స్పందనలు

తాము ఎదుర్కొన్న హింసను ఇతరులతో పంచుకునే, తెలియ చేసే సందర్భంలో...మహిళల భయాలు, ఆటంకాలు, సహాయం కోరే అంశాలను తెలుసుకోవాలన్న లక్ష్యంతోనే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో మా పరిశోధన సాగింది. హింసిస్తున్న అతడి నుంచి నువ్వు ముందే ఎందుకు దూరంగా రాలేదు? ఇంతకు ముందే గృహహింస గురించి ఎవరో ఒకరికి ఎందుకు చెప్పలేదు? లాంటి మామూలు ప్రశ్నలకు చాలా సంక్లిష్టమైన, పరస్పర విరుద్ధమైన సమాధానాలు వెలువడ్డాయి. పరిస్థితులు మారతాయి. ఆ పరిస్థితులు తమ భర్తల ప్రవర్తనను మార్చుతాయని ఆశించారు. ఇతరులకు, ముఖ్యంగా తమ కుటుంబాలకు 'భారం' కావడానికి మహిళలు ఇష్టపడలేదు. 'మా అమ్మకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆమెకంటూ స్వంత జీవితం ఉంటుంది. అందువల్ల ఆమె ఇబ్బందులకు నా ఇబ్బందులు తోడవడం నాకిష్టం లేదు' వంటి సమాధానాలు వారి నోటెంట వచ్చాయి. తామెదుర్కొన్న హింసను నిర్దిష్టంగా చెప్పడం ద్వారా, వారి కుటుంబాలకు ఒక 'సమస్య'గా లేదా 'మానసిక వ్యధ'కు కారణంగా మారకూడదని...వారి కుటుంబాలకు తలవంపులు, అగౌరవం తేకూడదని... గృహహింస నుండి బయటపడిన మహిళలు విద్యా స్థాయి, కులం, వర్గంతో నిమిత్తం లేకుండా భావిస్తున్నారు.
 

                                                              సహాయం కోరడానికి సంబంధించి ....

గృహహింసకు గురైన మహిళలు సహాయం కోరే విషయంలో రెండు రకాలుగా స్పందిస్తున్నారు. మొదటిది, హింస జరిగిన ఆరు నెలల్లోపు చెప్పేవారు. రెండవది హింస జరిగిన ఐదు సంవత్సరాలు లేదా ఆ తర్వాత చెప్పేవారు. మొదటి సమూహానికి చెందిన మహిళలు సహాయం కోసం తమ తల్లిదండ్రుల దగ్గరకెెళ్ళారు. భర్తతో సర్దుకుని పోవడం ద్వారా కుటుంబాన్ని/సంసారాన్ని కాపాడాల్సిందిగా తమ కుమార్తెలను ఒత్తిడి చేసిన కేసులు అనేకం. 'కుటుంబ సంతోషం' కంటే కూతురు క్షేమానికే ప్రాధాన్యత ఇచ్చిన కేసులు తక్కువగా నమోదయ్యాయి. అలాంటి కేసుల్లో మధ్యవర్తిత్వం వహించే చర్యలు చేపట్టడం లేదా తెగతెంపులు చేసుకోవడం జరిగాయి. సమస్య పరిష్కారానికి పోలీసులు, లాయర్లను కలవడం లాంటివి చాలా అరుదుగా జరిగాయి.
         గృహహింసకు గురై దాని నుండి బయటపడిన చాలా కాలానికి సహాయం కోరే వారి విషయానికి వస్తే...హింసకు సాక్షులుగా ఉన్న బంధువులు, ఇరుగు పొరుగు వారి (పరిస్థితులను మార్చడంలో) ప్రాధాన్యత చాలానే వుంది. బాధితురాలి పిల్లల సంరక్షణ, భర్త వివాహేతర సంబంధాన్ని గుర్తించడం, హింస తీవ్ర స్థాయిలో వున్నప్పుడు వైద్య సహాయం అందించడంలో వారి పాత్ర చాలా కీలకంగా వుంది. స్తి యాజమాన్యానికి సంబంధించిన పితృస్వామిక నిబంధనలు, ఆర్థిక అభద్రత కారణంగా తెగతెంపులు చేసుకునే విషయమై ఎదురైన మానసిక సంఘర్షణల కారణంగానే...బాధితురాలు సహాయం కోరడానికి అంతకాలం ఎదురుచూసి ఉంటుంది.
స్త్రీపురుష అసమానతల విషయంలో సామాజిక నియమాలు ఎంత లోతుగా పాతుకుపోయాయంటే భార్యను కొట్టే విషయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా సమర్థిస్తారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదిక తెలియజేస్తున్నది. 'మా మీద పెట్టే షరతులు ఎలా వుంటాయంటే... మేము ఎలాంటి బాధను గురించైనా ఫిర్యాదు చెయ్యలేనంత కష్టంగా ఉంటాయ'ని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహిళ చెప్పింది. బాధిత మహిళలు తాము ఎదుర్కొన్న గృహహింస గురించి మిత్రులు, బంధువులకు చెప్పుకున్న తర్వాత 'ఉపశమనం పొందినట్లు, భారమంతా తగ్గినట్లు, పరిస్థితులు మారిపోతాయానే ఒక కొత్త ఆశ కలిగిన భావన పొందినట్లు చెప్పారు.
          మహిళలు గృహహింస గురించి ఇతరులతో పంచుకోవాలని అనుకోవడమే వారు తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయం. సాయం, మద్దతు పొందడంలో వారు అనిశ్చితి, భయం, నిరాశ, నిస్పృహలకు లోనుకావాల్సి వచ్చింది. భారతదేశంలో ఉన్న వాస్తవ పరిస్థితి ఏమంటే అనేకమంది మహిళలు తమ గోడును వెళ్ళబోసుకోడానికి ఎటువంటి వేదిక లేదు. కేవలం ధనవంతులైన కొందరు మహిళలు, స్వచ్ఛంద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న కొద్దిమంది మహిళలు మాత్రమే కోర్టుల ద్వారా న్యాయం కోసం ప్రయత్నం చేశారు. కొత్త నైపుణ్యాలను, జీవనాధార అవకాశాలను సాధించడం ద్వారా ఆర్థిక స్వావలంబన పొందడంతో గృహహింస బాధితు లు కొంతవరకు తమ పరిస్థితులను మార్చుకోగలుగుతారు.
 

                                                                            పోలీసుల పాత్ర

తాము ఎదుర్కొన్న గృహహింస గురించి పోలీసులకు చెప్పినప్పుడు వారు స్పందించిన తీరు పట్ల మహిళలు పెదవి విరిచారు. ఏదో కొద్దిమంది అనుకూలమైన ఫలితాలు పొందినప్పటికీ...'హింసకు పరిష్కారం చూపడం కంటే కూడా అసలు సమస్యలో పోలీసుల పాత్ర ఎక్కువైంద'ని మేము ఇంటర్వ్యూ చేసిన మెజారిటీ మహిళలు చెప్పారు.
           పోలీసులే బాధిత మహిళలను హింసకు పాల్పడిన వారితో రాజీ చేశారు. వారిని తిరిగి అదే ఇళ్లకు పంపించారు. అధికారికంగా ఫిర్యాదు నమోదు చెయ్యకుండా లేదా పిడబ్ల్యుడివిఎ మార్గదర్శకాల ప్రకారం సంరక్షణ అధికారులకు అప్పజెప్పకుండా హింసకు పాల్పడిన వారిపై హింసను ప్రయోగించినట్లు మేము అనేక రాష్ట్రాల్లో విన్నాం. సిబ్బంది కొరత కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
             పితృస్వామిక భావజాల ప్రయోజనాలనే ప్రభుత్వం నెరవేరుస్తుందన్న విషయం మహిళలకు తెలుసు. చట్టాలు వున్నప్పటికీ...బాధితలను తిరిగి గృహహింసకు కారణమైన కుటుంబాలకే అప్పజెప్తున్నారు. ఇది నేడు మహిళలపై జరుగుతున్న అతి పెద్ద నేరం.

('ద హిందూ' సౌజన్యంతో)
(వ్యాసకర్తలు 'సర్వైవింగ్‌ వయొలెన్స్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌'లో సభ్యులు)

ఫిలిప్పా విలియమ్స్‌
స్వర్ణ రాజగోపాలన్‌
గిరిజా గాడ్బోలే
రుచిరా గోస్వామి