Jul 01,2023 16:22

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్‌(కాకినాడ) : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పధకాన్ని యధావిధిగా కొనసాగించాలని, పెండింగ్‌ క్లయిములను విడుదల చేయాలని కోరుతూ శనివారం సామర్లకోట, పెద్దాపురం భవన నిర్మాణ కార్మికుల సంఘాల నాయకులు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఇంటి వద్ద ధర్నా చేసి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్‌, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు చింతల సత్యనారాయణ మాట్లాడుతూ.. 2007నుండి రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రారంభమైన సంక్షేమ పథకం జగన్‌ మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిలిపివేశారని తక్షణమే పధకాన్ని యధావిధిగా కొనసాగించాలన్నారు. పెండింగ్‌ క్లయిములు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నిధులను వాడుకున్నదని తక్షణమే ఆ నిధులు జమచేయాలని, ఢిల్లీ ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు ఉచిత బస్‌, గృహనిర్మాణ ఋణం 75శాతం ఉచితంగా అందిస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం మోటార్‌ సైకిళ్లను వాయిదాల పద్దతిలో అందించినదని చెప్పారు. మన రాష్ట్రంలో మాత్రం పధకం నిలిపి వేషారని తక్షణమే ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న సంక్షేమ పధకాలు అందించాలని 50సంవత్సరాలు దాటిన వారికి 5వేలు పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సామర్లకోట మండల ప్రధాన కార్యదర్శి ఎన్‌.సురేష్‌, పెద్దాపురం సిఐటయి నాయకులు సిరిపురపు శ్రీనివాస్‌, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సామర్లకోట మండల అధ్యక్షులు ప్రకృతి ఈశ్వరరావు, పట్టణ అధ్యక్షులు పెనుపోతుల సత్తిబాబు, పెదబ్రహ్మదేవం అధ్యక్షులు పేపకాయల ప్రసాద్‌, వేట్లపాలెం నాయకులు కే. రామారావు, ఎస్‌ కే భాపన్‌ సాహెబ్‌, మాధవపట్నం నాయకులు కాళ్ళ లోవబాబు, ఎస్‌ కే ఖాజా, నవర నాయకులు కన్నె వీరబాబు, పెద్దాపురం నాయకులు గడప వీరబాబు, ముమ్మన శ్రీను, పూసల సుబ్బారావు, నీలపాల కృష్ణ, పాలపత్రి వీరబాబు, పాండవగిరి పెయింటింగ్‌ యూనియన్‌ కరణం అప్పారావు, వడ్డీ సత్యనారాయణ, రాచపల్లి చంద్రశేఖర్‌, యాసలపు మహేష్‌, ఎలక్ట్రీకల్‌ యూనియన్‌ తాడిశెట్టి గంగాధరరావు, ఎస్‌ కే బాషా పాల్గొన్నారు.

2