
తెలంగాణ : తెలంగాణ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ... బరిలో దిగి గెలుపొందేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ... తెలంగాణ ఎన్నికల్లో పోటీ విషయమై 2, 3 రోజుల్లో నిర్ణయాన్ని తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతలు వారి అభిప్రాయాలను పవన్కు వివరించినట్టు రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వకూడదన్న కారణంగా గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నామని పేర్కొంది. మిత్రపక్షమైన బిజెపి విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నామని తెలిపింది. రానున్న ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయకపోతే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉందని జనసేన నేతలు తమ అభిప్రాయాలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. నేతల అభిప్రాయాలను విన్న జనసేన అధినేత ... తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని, నాయకులు, జన సైనికుల అభిప్రాయాలకు విలువ ఇస్తానని అన్నారు. సరైన నిర్ణయం తీసుకోవడానికి 2, 3 రోజుల సమయం అవసరమని కోరారు. దీనిపై జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, తెలంగాణ శాఖ ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రామ్ తాళ్లూరి, హైదరాబాద్ నగర అధ్యక్షుడు రాజలింగం, ప్రధాన కార్యదర్శి ఎం.దామోదర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జిలు పాల్గొన్నారు.