నైరోబీ (కెన్యా) : కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే జంక్షన్లో ట్రక్కు అదుపుతప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లడంతో 48 మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. టీవీల్లో ప్రసారం అవుతున్న దృశ్యాల్లో క్రాష్ జరిగిన ప్రదేశంలో విధ్వంసం కనిపిస్తుంది. అనేక మినీబస్సుల శిధిలాలు, బోల్తా పడిన ట్రక్కు కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఒకరిద్దరు ట్రక్కు కింద చిక్కుకున్నట్లు అనుమానం : పోలీసు కమాండర్ జియోఫ్రీ
కెరిచో, నకురు పట్టణాల మధ్య హైవేపై ప్రమాదం జరిగిన తర్వాత స్థానిక పోలీసు కమాండర్ జియోఫ్రీ మాట్లాడుతూ ... ఇప్పటి వరకు 48 మంది మరణించినట్లు నిర్ధారించగలిగామన్నారు. ఒకరిద్దరు ట్రక్కు కింద చిక్కుకున్నట్లు అనుమానంగా ఉందని అన్నారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని పలు ఆసుపత్రులకు తరలించామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
భారీ వర్షాల వల్ల సహాయకచర్యలకు ఆటంకం...
ఘటనా స్థలానికి అంబులెన్స్లు, రెస్క్యూ కార్యకర్తలను పంపిన కెన్యా రెడ్క్రాస్ సహాయక చర్యలకు భారీ వర్షాలు ఆటంకం కలిగిస్తున్నాయని అధికారులు చెప్పారు. ''ట్రక్ అధిక వేగంతో వస్తోంది. అది నేరుగా మార్కెట్లోకి రాకముందే అనేక వాహనాలను తప్పించేందుకు ప్రయత్నించింది'' అని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
దేశాధ్యక్షుడు సంతాపం...
ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటోతో సహా కెన్యా నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని రవాణా మంత్రి కిప్చుంబా ముర్కోమెన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కెరిచో కౌంటీ హాస్పిటల్లోని సీనియర్ వైద్యుడు కాలిన్స్ కిప్కోచ్ మాట్లాడుతూ ... మోర్గ్లో ఇప్పటివరకు 45 మృతదేహాలు లభించాయని, మరికొంతమంది బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించారని, రెస్క్యూ ఇంకా కొనసాగుతోందని తెలిపారు.