ప్రజాశక్తి- అనంతపురం కార్పొరేషన్ : నగరంలో జరుగుతున్న రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులకు నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నగరంలోని 37వ డివిజన్ పరిధిలో రూ.40 లక్షలతో జరుగుతున్న సిమెంట్ రోడ్ పనులను గురువారం నగర మేయర్ మహమ్మద్ వసీం పరిశీలించారు.ఈ సందర్భంగా పనుల పురోగతిని అడిగి తెలుసుకుని త్వరితగతిన, నాణ్యతతో పనులు పూర్తి చేయించాలని సూచించారు. అదే విధంగా 32వ డివిజన్ పరిధిలోని ఆదర్శ నగర్ 46 సచివాలయాన్ని మేయర్ వసీం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలని సూచించారు. అనంతరం ఆదర్శ నగర్ అంగన్వాడీ స్కూల్ తనిఖీ చేసి చిన్నారులతో ముచ్చటించారు.అంగన్వాడీ కేంద్రంలో సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఆయా కార్యక్రమంలో కార్పొరేటర్లు కమల్ భూషణ్, అనిల్ కుమార్ రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










