గోరంట్ల (శ్రీసత్యసాయి) : శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వెంకటరమణంపల్లిలో వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ రాజుకుంది. ఇళ్ల స్థలాలకు సంబంధించిన విషయమై వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో చౌడు రెడ్డి అనే వైసిపి నేత.. ఇతర ప్రాంతాల నుంచి రెండు కార్లలో కొంతమందిని గ్రామానికి పిలిపించి టిడిపి కార్యకర్తల ఇళ్లపై దాడి చేయించడంతో.... ఇద్దరు మహిళలతోపాటు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని వెంటనే గోరంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హిందూపురం ఆసుపత్రికి తరలించారు. వైసిపి నేత చౌడు రెడ్డితో పాటు దాడులకు వచ్చిన ఇతర ప్రాంతాల వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.










