Mar 01,2023 20:29

న్యూఢిల్లీ : భారత్‌లోని సిటీ బ్యాంక్‌ కార్యకలాపాలు పూర్తిగా యాక్సిస్‌ బ్యాంక్‌ చేతిలోకి వెళ్లాయి. ఇకపై సిటీ బ్యాంక్‌ శాఖలను పూర్తిగా యాక్సిస్‌ బ్యాంక్‌ రీబ్రాండింగ్‌ చేయనుంది. దీంతో సిటీ బ్యాంక్‌ కనుమరుగు కానుంది. గతేడాది రూ.11,600 కోట్లకు సిటీ బ్యాంక్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా విలిన ప్రక్రియ పూర్తి అయ్యింది. దీంతో మార్చి 1 నుంచి భారత్‌లోని సిటీ బ్యాంక్‌కు సంబంధించిన గృహ, వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు, సేవింగ్‌ ఖాతాలు తదితర సేవలు యాక్సిస్‌ బ్యాంక్‌ పరిధిలోకి వచ్చాయి. 1902లో కోల్‌కతా కేంద్రంగా సిటీ గ్రూపు భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించగా.. వందేళ్లకు పైగా సేవలను అందించింది. భారత్‌ సహా 13 దేశాల్లో తమ కార్యకలాపాలు రద్దు చేసుకోబోతున్నట్లు 2021లో సిటీ బ్యాంక్‌ ప్రకటించింది. ప్రస్తుత సిటీ గ్రూపునకు సంబంధించిన అన్ని రకాల ఖాతాదారులు యథాతథంగా సేవలు పొందవచ్చని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. దేశంలోని 18 నగరాల్లో ఏడు కార్యాలయాలు, 21 శాఖలు, 49 ఎటిఎంలు ఉన్నాయి. 30 లక్షల ఖాతాదారులుండగా.. మరో 25 లక్షల సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేసింది.