May 17,2023 13:17

సడన్‌గా ట్రైన్‌ జర్నీ చేయాల్సి వస్తే ... సరిపడా క్యాష్‌ లేకపోతే... అప్పటికప్పుడు ట్రైన్‌ టిక్కెట్టును బుక్‌ చేసుకోలేం.. చాలా అవస్థలు పడతాం..! ప్రయాణీకులకు మరింత సులభతరమైన సేవలను అందించేందుకుగాను ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్‌ విషయంలోనూ 'బై నౌ పే లేటర్‌' సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు వివిధ వేదికలైన పేటీఎం, ఈపేలేటర్‌తో చేతులు కలిపింది. 'ట్రావెల్‌ నౌ పే లేటర్‌ ' పేరుతో ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. పేటీఎం.. పోస్ట్‌పెయిడ్‌ కింద ఈ వెసులుబాటును అందుబాటులో ఉంచింది. ఆ వివరాలను తెలుసుకుందాం.

                                              పేటీఎం పోస్ట్‌పెయిడ్‌తో ఐఆర్‌సీటీసీలో ట్రైన్‌ టికెట్లు...

పేటీఎం తమ యూజర్ల కోసం పోస్ట్‌పెయిడ్‌ సర్వీసులను అందిస్తోంది. 30 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా పేటీఎం తమ యూజర్లకు రూ.60,000 వరకు రుణంగా ఇస్తోంది. బిల్లింగ్‌ సైకిల్‌ ముగిసేలోపు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. కావాలంటే దీన్ని ఈఎంఐగా కూడా మార్చుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకొని ఐఆర్‌సీటీసీ లో ట్రైన్‌ టికెట్లు కూడా బుక్‌ చేసుకోవచ్చు. డబ్బును ఈఎంఐల కింద మూడు లేదా ఆరు నెలల పాటు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఈపేలేటర్‌ అనే ఫిన్‌టెక్‌ సంస్థ సైతం ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. అయితే, 14 రోజుల్లోగా టికెట్‌ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే 36 శాతం వడ్డీ పడుతుంది.

ఎలా బుక్‌ చేసుకోవాలంటే...
ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో లాగిన్‌ కావాలి.
బయలుదేరే ప్రాంతం, గమ్యస్థానం సహా ఇతర ప్రయాణ వివరాలు ఎంటర్‌ చేయాలి.
బుక్‌ టికెట్‌పై క్లిక్‌ చేయాలి
పేమెంట్‌ సెక్షన్‌లో పే లేటర్‌ ఆప్షన్‌ను ఎంచుకొని పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ను ఎంపిక చేసుకోవాలి.
పేటీఎం లాగిన్‌ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్‌ చేయడంతో టికెట్‌ బుకింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

క్యాష్‌ఈ ద్వారా ఇలా..
ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
ప్రయాణ వివరాలను ఎంటర్‌ చేసి బుక్‌ టికెట్‌ఫై క్లిక్‌ చేయాలి.
పేమెంట్‌ ఆప్షన్లలో 'ట్రావెల్‌ నౌ పే లేటర్‌' ను ఎంచుకోవాలి.
టీఎన్‌పీఎల్‌ అందిస్తున్న వాటి నుంచి క్యాష్‌ఈని ఎంపిక చేసుకోవాలి.
టికెట్‌ బుకింగ్‌ పూర్తవుతుంది.