Oct 12,2023 10:31

పట్నా : బీహార్‌లో బుధవారం రాత్రి రైలు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి గువాహటికి బయలు దేరిన 12506 నార్త్‌ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బక్సర్‌ జిల్లాలోని రఘునాథ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 60 మంది తీవ్రగాయాల పాలయ్యారు. మొత్తం ఆరు బోగీలు పట్టాలు తప్పినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై జిల్లా విపత్తు నిర్వహణ శాఖతో చర్చించామని బీహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ''విపత్తు నిర్వహణ శాఖతో పాటూ ఆరోగ్య శాఖ, బక్స్‌ర్‌ జిల్లా యంత్రాంగంతో మాట్లాడి పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టాలని సూచించాం. పాట్నాలోని ఆసుపత్రులను కూడా హైఅలర్ట్‌లో ఉండాలని ఆదేశించాం'' అని పేర్కొన్నారు. బాధితులకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియాను భారత్ రైల్వే ప్రకటించింది.