Jun 11,2023 08:25

సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత శాస్త్ర, సాంకేతిక సమాజంలో మనిషి స్వతహాగా తయారు చేయలేని పదార్థాల్లో రక్తం ఒకటి. మన దేశ వ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మందిలో అత్యవసర పరిస్థితుల్లో ఏటా ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉందని నిపుణుల అంచనా. అయితే రక్తదాతల నుంచి లభిస్తున్నది మాత్రం సుమారు 50 లక్షల యూనిట్లు మాత్రమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ప్రతిరోజు దాదాపు 12 వేల మంది రక్తకొరత కారణంగా చనిపోతున్నారు. గత దశాబ్దకాలంగా రక్తదానం పైన అవగాహనా కార్యక్రమాలు పెరిగినప్పటికీ రక్తదాతల నుంచి వస్తున్న స్పందన మాత్రం రక్త అవసరాలకు అనుగుణంగా లేవన్నది వాస్తవం. ఈ నెల 14న ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా దీనిపైనే ఈ ప్రత్యేక కథనం.

011

             రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు దానిపట్ల అవగాహన కల్పించడానికి, వారు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రతి ఏడాది జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌ క్రాస్‌, రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీలు తొలిసారిగా 2005లో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించాయి. జూన్‌ 14 గొప్పతనము ఏమిటంటే Aదీఉ రక్తగ్రూపు వ్యవస్థను కనుగొన్నందుకు నోబెల్‌ బహుమతిని పొందిన కార్ల్‌ ల్యాండ్‌స్టెయినర్‌ జన్మదినం. ఔనఉ ప్రారంభించిన అధికారిక ప్రపంచ ప్రజారోగ్య ప్రచారాలలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం కూడా ఒకటి. మనదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 1వ తేదీని జాతీయ రక్తదాతల దినోత్సవం (చీa్‌ఱశీఅaశ్రీ దీశ్రీశీశీస ణశీఅశీతీర ణay) గా జరుపుకుంటాం. మనదేశంలో ఇలా రెండు రక్తదాన దినోత్సవాలు జరుగుతున్నాయి.
 

                                                                                అవసరం చాలా..

ఎంత కొత్త వాహనమైనా ఇంధనం లేకపోతే ఒక్క అడుగూ ముందుకు కదలలేనట్టే మనిషి శరీరంలో రక్తం అనే జీవద్రవ పదార్థం ప్రవహించకపోతే జీవితం లేదు. మనిషికి ప్రాణవాయువు ఎంత అవసరమో రక్తం కూడా అంతే అవసరం. మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవుసరమౌతుంది. రక్తం విలువ కట్టలేనిది. ప్రాణాపాయంలో సంజీవని వంటిది. ప్రమాదాలు జరిగినప్పుడు, శస్త్రచికిత్సలు, స్త్రీల ప్రసవ సమయంలో, శరీరం కాలిన గాయాలపుడు, తలసేమియా, లుకేమియ, సికిల్‌సెల్‌ ఎనీమియా లాంటి దీర్ఘకాలిక చిన్నపిల్లల వ్యాధుల చికిత్సకు, మూత్రపిండాల వ్యాధికి డయాలిసిస్‌ చేసే సమయాలలో రక్తం అవసరం చాలా ఉంటుంది. రక్తం ఎటువంటి కర్మాగారాలలో తయారుచేయలేనిది. మనుషులు స్వచ్ఛందంగా వారి శరీరం నుంచి దానం చేయవలసింది.

                                                                              కొన్ని వాస్తవాలు

  • ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 118.5 మిలియన్‌ యూనిట్ల రక్తం దానం చేయబడుతుంది.
  • ఒక వ్యక్తి ఒక గంట కేటాయించి ఒక యూనిట్‌ రక్తాన్ని దానం చేయవచ్చు. దానిని నాలుగు వ్యక్తిగత భాగాలుగా విభజించి, నాలుగు ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడుతుంది.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఔనఉ) ప్రకారం, మనదేశం సంవత్సరానికి 20 లక్షల రక్త యూనిట్ల లోటుతో ఇబ్బందిపడుతోంది. ఎందుకంటే ప్రతి ఏడాది భారతీయ జనాభాలో ఒక్క శాతం మాత్రమే రక్తదానం చేస్తారు.
  • అమెరికన్‌ రెడ్‌క్రాస్‌ ప్రకారం, యునైటెడ్‌ స్టేట్స్‌లో ప్రతిరోజూ 36,000 యూనిట్ల ఎర్రరక్త కణాలు, 7,000 యూనిట్ల ప్లేట్‌లెట్లు మరియు 10,000 యూనిట్ల ప్లాస్మా అవసరం.
  • ప్రధాన మానవ రక్త గ్రూపులైన A, దీ, Aదీ మరియు ఉ లను 1901లో డాక్టర్‌ కార్ల్‌ ల్యాండ్‌స్టైనర్‌ ద్వారా మొదట గుర్తించడం జరిగింది. వాటిని కృత్రిమంగా తయారుచేయడం ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఉదార మానవుల నుంచి సేకరించడమే ప్రస్తుతం ఉన్నటువంటి మార్గం.
  • ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్లు, ప్లాస్మా, క్రయోప్రెసిపిటేట్‌ అనేవి రక్తం నుండి విడగొట్టగలిగిన నాలుగు రకాల ట్రాన్స్‌ఫ్యూజబుల్‌ ఉత్పత్తులు.
  • Aదీ పాజిటివ్‌ రక్తం కలిగిన వారు సార్వత్రిక గ్రహీతలు. అంటే Aదీం వ్యక్తులు ఏ గ్రూపు రక్తాన్నయినా స్వీకరించగలరు. ఉ నెగటివ్‌ గ్రూప్‌ రక్తం కలిగినవారు సార్వత్రిక దాతలు. అంటే ఉ నెగిటివ్‌ గ్రూపు వారు ప్రపంచంలో ఎవరికైనా రక్తం దానం చేయవచ్చు.
  • దానం చేసిన ప్లేట్‌లెట్స్‌ను ఐదు రోజులలోపు ఉపయోగించాలి. ఎర్ర రక్త కణాలను సేకరించిన తేదీ నుండి 42 రోజులలోపు ఉపయోగించాలి.
  • ప్లాస్మా, క్రయోప్రెసిపిటేట్‌ వంటి రక్త ఉత్పత్తులను ఘనీభవించిన స్థితిలో నిల్వ చేస్తారు. ఈ ఉత్పత్తులను ఒక ఏడాది వరకు ఉపయోగించవచ్చు.
  • దానం చేసిన అన్ని రక్త ఉత్పత్తులను రక్తమార్పిడి ముందు న×V, హెపటైటిస్‌ దీ, హెపటైటిస్‌ జ మరియు సిఫిలిస్‌ పరీక్షలను నిర్వహిస్తారు.
  • అనవసరమైన రక్తమార్పిడులు చేసుకోకపోవడం మంచిది. అనవసర రక్త మార్పిడిలు జరిగినప్పుడు గ్రహీతలు ఎయిడ్స్‌, హెపటైటిస్‌ మరియు సిఫిలిస్‌ లాంటి మొండి రోగాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
  • ప్రతి సంవత్సరం, సుమారు 300,000 మంది శిశువులు తలసేమియా, సికిల్‌-సెల్‌ వ్యాధితో పుడుతున్నారు. వారికి క్రమం తప్పకుండా జీవితకాలం పాటు రక్త మార్పిడి అవసరం.
  • సంపూర్ణ రక్తదానాల మధ్య కనీస సమయం 56 రోజుల (8 వారాలు) నుండి 16 వారాల వరకు ఉండాలి. ప్లేట్‌లెట్‌ డొనేషన్‌లను వారానికి ఒక్కసారి చేయవచ్చు.
  • డిసెంబర్‌ 22, 1818న ప్రసూతి వైద్య నిపుణులు జేమ్స్‌ బ్లండెల్‌ గారు మానవుని నుండి మానవునికి మొదటి రక్తమార్పిడిని చేపట్టారు.
  • ఆరోగ్యంగా ఉన్న 18 సంవత్సరాలు పైబడిన వారందరూ రక్త దానం చేయవచ్చు. 18 ఏళ్ల నుంచి క్రమం తప్పక రక్తదానం చేయగలిగితే.. జీవిత కాలం మొత్తంలో దాదాపు 168 సార్లు రక్త దానం చేయవచ్చు.
22


                                                                       ఒక వ్యక్తి.. నాలుగు ప్రాణాలు..

ఒక్క వ్యక్తి రక్తదానం నాలుగు ప్రాణాలను కాపాడుతుందని డబ్ల్యూహెచ్‌ఓ చెపుతుంది. రక్తం ఇవ్వగానే దానిని వివిధ కంపోనెంట్లుగా విభజిస్తారు. దాత నుంచి సేకరించే రక్తాన్ని హోల్‌ బ్లడ్‌ అంటారు. ఆ రక్తంలో ప్లాస్మా, ప్లేట్లెట్స్‌, తెల్లరక్త కణాలు, ఎర్రరక్త కణాలు ఉంటాయి. వీటిని విడదీసిన కారణంగా నలుగురికి ఈ రక్తాన్ని ఎక్కించవచ్చు. రక్తదాత నుంచి ప్లేట్లెట్స్‌ను మాత్రమే, ప్లాస్మాను మాత్రమే తీయగల సాంకేతిక అభివృద్ధి అందుబాటులోకి వచ్చింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సాధారణ రక్తదానం చేయవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్‌ను గానీ ప్లాస్మాను గానీ దానం చేయవచ్చు.

                                                                        ఇబ్బందే ఉండదు..

రక్తదానంతో జీవితంలో కోలుకోలేని ఇబ్బందులు వస్తాయని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. వాస్తవానికి రక్తదానంతో ఎలాంటి ఇబ్బందులూ రావు. రక్తదానం తరువాత రెండు రోజులలో యథావిధిగా అన్ని రకాల పనులూ చక్కగా చేసుకోవచ్చు. రక్తదాన సమయంలో రక్తం సేకరించడానికి ఉపయోగించే సూది గుచ్చేటప్పుడు కలిగే చిన్ననొప్పి తప్పించి, ఎటువంటి తీవ్రమైన బాధ ఉండదు. రక్తదానానికి ముందు పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యవంతులని, సరిపోయినంత రక్తం ఉందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రక్తం తీసుకుంటారు. రక్తదానం తర్వాత ఆరు నుంచి పన్నెండు వారాల లోపు ఆ వ్యక్తికి పూర్తిస్థాయిలో కొత్తరక్తం తయారవుతుంది. ఎలాంటి రక్తహీనత ఏర్పడదు.
 

                                                                   తరచు దానంతో ప్రయోజనాలు..

రక్తదానం చేయడం వల్ల రక్త గ్రహీతకు ఒనకూడే ప్రయోజనంతో పాటు రక్త దానం చేసిన వ్యక్తికి కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.
- రక్తదానం చేయడానికి ముందు రక్తదాత హెల్త్‌ ప్రొఫైల్‌ తెలుసుకుంటారు. దీంతో ఎప్పటికప్పుడు రక్తదాత ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకొనే అవకాశం ఉంటుంది.
- పెద్ద పేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది.
- గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
- రక్తం దానం చేయగా జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. ఆ సమయంలో దాత రక్తవ్యవస్థ పునరుద్ధరణ జరుగుతుంది.

33


                                                                   శరీరంలో ఎన్ని లీటర్లు..?

ఒక వ్యక్తి శరీరంలో ఉన్న రక్తం మోతాదు వారి ఎత్తు, బరువు మరియు వయస్సు ఆధారంగా నిర్ణయించబడుతుంది. సాధారణ మానవ వయోజన శరీరం దాదాపు ఐదు లీటర్ల రక్తాన్ని కలిగి ఉంటుంది. ఈ మోతాదు 4,500 నుండి 5,700 మిల్లీలీటర్ల మధ్య మారుతూ ఉంటుంది.
గర్భిణీలలో 300 మి.లీ నుండి 400 మి.లీ రక్తం అదనంగా ఉంటుంది. గర్భిణీలలో ఉన్న ఈ అదనపు రక్తం ప్రసవ సమయంలో జరిగే రక్తస్రావాన్ని సరిచేస్తుంది.

55

 

                                                                               అర్హతలు

  • వయస్సు 18-60 ఏళ్ల మధ్య ఉండాలి.
  • బరువు 45 కిలోల పైన ఉండాలి.
  • నాడి నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి.
  • రక్తపోటు, గుండె సంకోచించనప్పుడు (సిస్టాలిక్‌) 100-180 మి.మీ. వరకు, గుండె వ్యాకోచించినప్పుడు (డయాస్టాలిక్‌) 50-100 మి.మీ. వరకు ఉండాలి.
  • హీమోగ్లోబిన్‌ 100 మి.లీ. రక్తంలో 12.5గ్రాములు ఉండాలి.
  • నోటి ఉష్ణోగ్రత : 37.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే అధికంగా ఉండకూడదు.
  • తీవ్రమైన వ్యాధులు, మూర్ఛ, మూత్రపిండ వ్యాధులు, అలర్జీ, అసాధారణ రక్తస్రావ లక్షణాలు, త్వరితగతిగా బరువు కోల్పోవటం, హృదయ సంబంధమైన వ్యాధులు, ఇతర ప్రమాదకరమైన వ్యాధులు ఇదివరకుగానీ ప్రస్తుతం గానీ లేకుండా ఉండాలి.
  • గర్భావస్థలో, ప్రసవానంతరం ఆరు నెలల వరకు, బిడ్డకు పాలిచ్చినంత కాలం, బహిష్టు సమయంలో అధికంగా రక్తస్రావం జరిగే పరిస్థితుల్లో స్త్రీలు రక్తం ఇవ్వకూడదు.
  • టీకాలు వేసుకున్న రెండు వారాల తర్వాత అవాంఛిత లక్షణాలు లేనప్పుడు. దాతగా స్వీకరించవచ్చు.
  • జంతువుల కాట్లకు గురైన ఏడాది తర్వాత దాతగా అంగీకరించవచ్చు.
  • టిటానస్‌ (ధనుర్వాతం) డిస్తీరియా (కంఠవాపు) గ్యాస్‌ గ్యాంగ్రీన్‌ కోసం మందులు వాడిన వారు, ఆఖరి మోతాదు (డోస్‌) మందులు వాడిన నాలుగునెలల తర్వాత రక్తదానం చెయ్యవచ్చు.
  • గడచిన ఏడాది కాలంగా పచ్చకామెర్లు వ్యాధి లేనివారు రక్తదానానికి అర్హులు.

                                                                      ఎవరు చేయకూడదు ?

అనారోగ్యంతో ఉన్నవారు రక్తదానం చేయకూడదు. తాత్కాలిక అనారోగ్యం ఉన్న వాళ్లు ఆరోగ్యం సరైన తర్వాత రక్తదానం చేయవచ్చు. రక్త మార్పిడి ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే దీర్ఘకాలిక అంటు వ్యాధులు ఉన్నటువంటి వారు జీవితంలో ఎప్పుడూ రక్తదానం చేయకూడదు.
 

                                                            ఎవరు శాశ్వతంగా చేయకూడదు ?

  • ఇన్సులిన్‌పై ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులు.
  • గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నవారు.
  • క్యాన్సర్‌ శస్త్రచికిత్స చేయించుకున్నవారు.
  • గుండెపోటుకు గురైనవారు.
  • మూర్ఛ వ్యాధి ఉన్నవారు.
  • ఎయిడ్స్‌, హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి, సిఫిలిస్‌ లాంటి అంటువ్యాధులు ఉన్నవారు.
  • దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు.
  • ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌. ఉన్నవారు.

 

445

                                                                                 రక్తదానానికి యాప్‌..

ఇప్పుడు దరిదాపుగా ప్రతిదానికి ఒక యాప్‌ అందుబాటులో ఉంటుంది. రక్తదానానికి కూడా ఒక యాప్‌ అందుబాటులో ఉంది. రక్తదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారి కోసం జాతీయ ఆరోగ్య మిషన్‌ ఈ యాప్‌ను అందుబాటు తెచ్చింది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా ఈరక్తోష్‌ (వ=aస్‌ష్ట్రశీరష్ట్ర) అనే యాప్‌ను ప్రవేశపెట్టింది. రక్తం దానం చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఈ యాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. దీంతోపాటు రెండ్‌ క్రాస్‌కి సంబంధించి 'బ్లడ్‌ డోనార్‌', 'ఫ్రెండ్స్‌ టు సపోర్ట్‌', 'యు బ్లడ్‌'తో పాటు ఇతర యాప్‌లూ, వెబ్‌సైట్‌లూ అందుబాటులో ఉన్నాయి. ఇందులో రక్త దాతలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.

                                                                       2023 ప్రచార నినాదం.

            ''రక్తం ఇవ్వండి, ప్లాస్మా ఇవ్వండి, జీవితాన్ని పంచుకోండి, తరచుగా పంచుకోండి.'' ఇది ఈ సంవత్సర ప్రపంచ రక్తదాతల దినోత్సవ ప్రచార నినాదం. ఈ నినాదం జీవితాంతం రక్తమార్పిడికి మద్దతు అవసరమయ్యే రోగులపై దృష్టి పెడుతుంది. అంతేకాకుండా రక్తం లేదా ప్లాస్మా యొక్క విలువైన బహుమతిని రక్తం అందించడంలో ప్రతి ఒక్క వ్యక్తీ పోషించవలసిన పాత్రను నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎల్లప్పుడూ రక్తం, రక్త ఉత్పత్తుల అందుబాటులో ఉండే సురక్షితమైన, స్థిరమైన సరఫరాను సృష్టించాలి. అందుకు రక్తం లేదా ప్లాస్మాను క్రమం తప్పకుండా అందించడం యొక్క ప్రాముఖ్యతనీ ఇది హైలైట్‌ చేస్తుంది. ఈ నినాదాన్ని ఆచరణలో పెట్టగలిగితే అవసరమైన రోగులందరికీ సకాలంలో చికిత్స లభిస్తుంది. తద్వారా అనేక ప్రాణాలను కాపాడగలుగుతాం. ఈ నినాదాన్ని ఆచరణలో పెట్టాలంటే రక్తదాన ఆవశ్యకతను అర్థంచేసుకుని, రక్తదానంలో ముందుండాలి. అన్ని దానాలలో కన్నా ఉత్తమమైన దానం అన్నదానం అని పెద్దలు ఎప్పటినుంచో చెప్తున్న మాట. అయితే అంతకు మించిన మరొక దానం.. రక్తదానం.

                                                                    మానవత్వాన్ని చాటారు..

           రక్తదానంపై అవగాహన ఉన్న లక్షలాది మంది మానవత్వాన్ని చాటుతున్నారు. ఇటీవల ఒడిశా రైలు ప్రమాదమే ఇందుకు నిదర్శనం.. స్వచ్ఛందంగా అర్ధరాత్రి వేళ వందలాది స్థానికులు బాలాసోర్‌ ప్రభుత్వ దవాఖానలో గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి, ప్రమాద బాధితులకు అవసరమైన రక్తాన్ని దానం చేశారు. బాలాసోర్‌లో రాత్రిపూట సుమారుగా 500 యూనిట్ల రక్తం సేకరించబడింది. ప్రస్తుతం 900 యూనిట్లు స్టాక్‌లో ఉన్నాయి. తీవ్రంగా గాయపడినవారి చికిత్స కోసం పౌరులు రక్తదానం చేయడానికి రాత్రిపూట బారులు తీరారు.

                                                                     దానానికి ముందు జాగ్రత్తలు

  • రక్తదానానికి ముందు రోజు సరిపోయినంత నిద్ర పోవాలి.
  • రక్తదానానికి ముందు ఆరోగ్యకరమైన భోజనం తినాలి.
  • రక్తదానానికి ముందు పుష్కలంగా నీరు తాగాలి.
  • మీరు తీసుకుంటున్న లేదా ఇటీవల తీసుకున్న ఏవైనా మందులు రక్తదానం చేయకుండా మిమ్మల్ని నిరోధిస్తాయో లేదో తనిఖీ చేయించుకోవాలి. ఉదాహరణకు, మీరు ప్లేట్‌లెట్‌ దాత అయితే, మీరు దానం చేయడానికి రెండు రోజుల ముందు తప్పనిసరిగా ఆస్పిరిన్‌ తీసుకోకూడదు. రక్తదానం చేయడానికి ఏదైనా మందులు తీసుకోవడం ఆపడానికి ముందు మీ ఆరోగ్య సంరక్షణ బృందంలోని సభ్యునితో మాట్లాడాలి.
  • పైకి చుట్టుకోగలిగే స్లీవ్‌లతో కూడిన చొక్కా ధరించండి.
55

                                                         తాత్కాలికంగా ఎవరు చేయకూడదు ?

- మలేరియాతో బాధపడుతున్న వ్యక్తి తప్పనిసరిగా మూడు నెలలు వాయిదా వేయాలి.
- టైఫాయిడ్‌ నుండి కోలుకున్నాక సంవత్సరం రోజులు వరకు వేచి ఉండాలి.
- క్షయవ్యాధి వ్యాధి ఉన్న రోగి నయం అయినట్లు నిర్ధారించబడిన తర్వాత తప్పనిసరిగా రెండేళ్లు వాయిదా వేయాలి.
- ఎవరైనా పెద్ద సర్జరీ చేయించు కున్నట్లయితే 12 నెలలు, మైనర్‌ సర్జరీ చేయించుకుంటే ఆరు నెలలు వాయిదా వేయాలి.
- స్త్రీల విషయంలో రుతుక్రమం, గర్భధారణ సమయంలో రక్తదానాన్ని వాయిదా వేయాలి.
- కాన్పు అయిన తర్వాత 12 నెలల పాటు వాయిదా వేయాలి.
- అబార్షన్‌ జరిగితే ఆరు నెలలు వాయిదా వేయాలి. బిడ్డకు పాలిస్తున్నంత వరకు తప్పనిసరిగా రక్తదానం చేయకూడదు.
         ఈ రోజుల్లో రక్తదానం చేస్తామని ముందుకు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ ఉంది. జనాభాలో నూటికి ఐదు మంది మాత్రమే ముందుకు వస్తున్నారు. ఇలా సరఫరా ఒకపక్క తగ్గిపోతుంటే మరొక పక్క వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. రక్తదానం చేయడానికి వృద్ధులు ఉపయోగపడరు. రక్తం అవసరం కూడా వీరికే ఎక్కువగా ఉంటుంది. కనుక రక్త దానం అవసరం పెరుగుతూ ఉంది. కృత్రిమంగా రక్తం తయారుచేయడానికి అనేక ప్రయోగాలు జరుగుతున్నా అవేవీ ఇంతవరకు సఫలీకృతం కాలేదు. ఈ సమస్యకు ప్రస్తుతం ఉన్న పరిష్కారం రక్తదానమే !

1122

డాక్టర్‌ ఎం.వి.రమణయ్య
ప్రజారోగ్య వేదిక కన్వీనర్‌
ఆంధ్రప్రదేశ్‌ కమిటీ
94903 00431