Jun 19,2022 12:04

న్యూఢిల్లీ :   కరోనాపై పోరులో భాగంగా అభివృద్ధి చేస్తున్న నాజల్‌ వ్యాక్సిన్‌ (నాసికా రంధ్రాల ద్వారా ఇచ్చేది) 3వ దశ ప్రయోగాలు పూర్తయ్యాయని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది.  ఈ విషయాన్ని సంస్థ ఛైర్మన్‌, ఎండి డాక్టర్‌ కృష్ణా ఎల్లా శనివారం వెల్లడించారు. ఈ వివరాలను డిసిఐజికి వచ్చే నెల అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో భారత్‌ బయోటెక్‌ సంస్థ నాజల్‌ వ్యాక్సిన్‌ 3వ దశ ప్రయోగాలకు నియంత్రణా సంస్థలు అనుమతలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఐరోపాలో నిర్వహించనున్న వివ టెక్నాలజీ - 2022లో ప్రసంగించేందుకు వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు.

నాజల్‌ వ్యాక్సిన్‌కి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను పూర్తయ్యాయని, ఆ డేటా విశ్లేషణ ప్రక్రియ జరుగుతోందని అన్నారు. వచ్చేనెల ఆ డేటాను రెగ్యులేటరీ ఏజెన్సీకి అందజేస్తామని, అన్ని సానుకూలంగా ఉంటే వ్యాక్సిన్‌ విడుదలకు అనుమతులు వస్తాయని చెప్పారు. అప్పుడు ఇది క్లినికల్‌గా నిరూపితమైన తొలి నాజల్‌ కరోనా వ్యాక్సిన్‌గా నిలుస్తుందని అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారందరూ బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పిల్లలో బూస్టర్‌ డోసు అద్భుతంగా పనిచేసిందని అన్నారు. కరోనాను 100శాతం నిర్మూలించలేమని.. అందుకే పెద్దవారు కూడా బూస్టర్‌ డోసు తీసుకోవాలని సూచించారు.