Sep 19,2023 14:31

చెన్నై: భారత్‌లో జరగనున్న ఐసీసీ వరల్డ్‌ కప్‌ టోర్నీని గ్రాండ్‌ సక్సెస్‌ చేయాలని బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో, మునుపెన్నడూ లేని విధంగా దేశంలోని వివిధ రంగాల ప్రముఖులను వరల్డ్‌ కప్‌కు ఆహ్వానిస్తూ బీసీసీఐ గోల్డెన్‌ టికెట్‌ బహూకరిస్తోంది. ఈ గోల్డెన్‌ టికెట్‌తో వరల్డ్‌ కప్‌ టోర్నీలోని ఏ మ్యాచ్‌ నైనా స్టేడియానికి వచ్చి వీఐపీ గ్యాలరీ నుంచి వీక్షించవచ్చు. ఇప్పటివరకు ఈ గోల్డెన్‌ టికెట్‌ను బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, సచిన్‌ టెండూల్కర్‌లకు బీసీసీఐ అందించింది. తాజాగా ఈ గోల్డెన్‌ టికెట్‌ను దక్షిణాది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు కూడా బహూకరించారు. బీసీసీఐ కార్యదర్శి జై షా చెన్నైలోని రజనీ నివాసానికి వచ్చి స్వయంగా తలైవాకు అందించారు. రజనీకాంత్‌ను ఓ విశిష్ట అతిథిగా భావిస్తూ వరల్డ్‌ కప్‌కు ఆహ్వానించినట్టు బీసీసీఐ వెల్లడించింది.