
లక్నో : బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించిన కేసులో ఆజం ఖాన్, ఆయన భార్య తజిన్ ఫాత్మా, తనయుడు అబ్దుల్లాకు ఎంపిఎల్ఎ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసులు వారు ముగ్గురినీ అదుపులోకి తీసుకొని రాంపూర్ జైలుకు తరలించారు. శనివారం రాత్రి ఆజం, అబ్దుల్లాను రాంపూర్ జైలు నుంచి తరలించాలని పోలీసులకు ఆదేశాలు వచ్చాయని, ఈ మేరకు ఆజం ఖాన్ను సీతాపూర్, అబ్దుల్లా ఆజమ్ను హర్దోరు జైలుకు తరలించినట్లు ఎస్పి రాజేశ్ ద్వివేది తెలిపారు. ఆజం భార్య తజిన్ ఫాత్మాను రాంపూర్లోనే ఉంచినట్లు పేర్కొన్నారు. ఆజంఖాన్, అబ్దుల్లా ఆజమ్లను ఆదివారం ఉదయం 5గంటలకు పరీక్షల పేరుతో రాంపూర్ జైలు నుంచి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. పోలీసు వాహనంలో కూర్చునేందుకు ఆజంఖాన్ నిరాకరించారు. దీంతో పోలీసులు ఆయనకు నచ్చజెప్పారు. తనకు ప్రాణహాని ఉందని గతంలో ఆజంఖాన్ చెప్పడం గమనార్హం.