Aug 14,2023 20:30
  • ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌బిఆర్‌ కుమార్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎయిడ్స్‌ నివారణకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ ప్రాజెక్టు డైరెక్టరు ఎస్‌బిఆర్‌ కుమార్‌ లఘింశెట్టి తెలిపారు. తాడేపల్లిలోని ఎపిశాక్స్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ప్రాజెక్టు డైరెక్టరుగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయుష్‌ కమిషనరుగా వ్యవహరిస్తున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఎపి శాక్స్‌ అదనపు బాధ్యతలను అప్పగించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎపి శాక్స్‌ పనితీరును మెరుగుపరిచేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయవాడ జిజిహెచ్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కౌన్సెలింగ్‌ టెస్ట్‌, యాంటీ రిట్రోవైరల్‌ థెరపీ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎపిడి కోటేశ్వరి, జెడిలు కామేశ్వర ప్రసాద్‌, సబ్రమణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.