Jul 18,2023 21:17

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ఈ నెల 20 నుంచి (బుధవారం అర్ధరాత్రి) అగ్నిపథ్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ విజయనగరంలో ప్రారంభం కానుంది. ఆగస్టు రెండో తేదీ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు మొత్తం 13 జిల్లాలకు చెందిన పది వేల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రోజూ రాత్రి 12.30 గంటల నుంచి ర్యాలీ ప్రారంభం కానుందని, 12 గంటలకే గ్రౌండ్‌కు చేరుకోవాలని, రోజుకు 1000 మంది అభ్యర్థులను గ్రౌండ్‌లోకి అనుమతిస్తామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులకు నామమాత్రపు రుసుంతో వసతి ఏర్పాట్లు, ఉచితంగా అల్పాహారం వంటి సదుపాయాలు కల్పించినట్టు విజయనగరం అధికార యంత్రాంగం పేర్కొంది.