
గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్ల మోడీ అభివృద్ధి నమూనాలో, ఆ తర్వాతి బిజెపి పాలనలో అగరియాలకు విద్యుత్తు, నీరు, పారిశుధ్య సౌకర్యాలు లభించలేదు. బిజెపి ప్రభుత్వం కచ్ ప్రాంతం మీదగా స్థాపించిన సుదీర్ఘ విద్యుత్ లైన్లు వాణిజ్యవేత్తలకు విద్యుత్తునిచ్చాయి గాని వీరి చీకటి బతుకుల్లో వెలుగు నింపలేదు.
అగరియాలు ఉత్తరప్రదేశ్ ఆగ్రా నుండి వలస వచ్చి గుజరాత్ లో స్థిరపడ్డ ముస్లిం గిరిజనులు. వీరి పూర్వీకులు సంప్రదాయ మోతుబరి రైతులు. కొందరు భూమి లేని వ్యవసాయ కూలీలు. వీరు తమ సమూహాల బయట పెళ్ళి చేసుకుంటారు. సున్నీ ముస్లింలైనప్పటికీ జానపద నమ్మకాలతో జీవిస్తారు. కచ్చి, గుజరాతీ భాషలు మాట్లాడతారు. ఆరోగ్య సౌకర్యాలు, రాజకీయ ప్రాతినిధ్యం లేక గుజరాతీ సమాజానికి దూరంగా అనాగరికులుగా జీవిస్తున్నారు. వీరి నిరక్షరాస్యత భావి తరాల అభివృద్ధి అవకాశాలను తుడిచేసింది. అరేబియా సముద్ర తీరాన థార్ ఎడారిలో కచ్చి జిల్లా బురద నేలల్లో ఉప్పు తయారీ వృత్తితో శతాబ్దాలుగా, తరతరాలుగా బతుకుతున్నారు. నవంబర్-ఆగస్ట్ మధ్య 10 నెలల పాటు దారుణ ఎడారి వాతావరణ పరిస్థితుల్లో నివసిస్తారు. 7,505.22 చ.కి.మీ విస్తీర్ణపు ఈ ఉప్పు ఎడారి ప్రపంచంలోకెల్లా అతి పెద్దది. దేశ ఉత్పత్తిలో 76 శాతం ఉప్పును తయారుచేస్తున్నా వీరు నిరుపేదలే. ఈ తెగ ప్రజలు పెద్ద కచ్, చిన్న కచ్ అన్న రెండు ప్రాంతాల్లో నివసిస్తారు. చిన్న కచ్ లోని 175 గ్రామాల్లో 15 వేల కుటుంబాల్లో 70 వేల అగరియాలున్నారు. వీరిలో 10 వేల కుటుంబాల్లో 45 వేల మంది ఈ వృత్తిలో జీవిస్తున్నారు.
పెద్దపెద్ద ఉప్పు తయారీ కంపెనీల్లో, మధ్యవర్తుల ఆధ్వర్యంలో ఎక్కువ మంది అగరియాలు ఉప్పు ఉత్పత్తి కూలీలుగా పనిచేస్తారు. జనరేటర్లతో సహా అన్ని యంత్రాలను మనుషులే తోసుకొని, మోసుకొని పోవాలి. మంచి నీటి కోసం ఉప్పు మళ్ళ నుండి 6 కి.మీ కు పైగా నడిచివెళ్ళాలి. సూదులతో పొడిచే, మంటలతో కాల్చే లాంటి ఎడారి ఎండల నుండి తప్పించుకోడానికి కార్మికులు తెల్లవారు జామునే పనిలో దిగుతారు. ప్రతి టన్ను ఉప్పు తయారీకి వీళ్ళకు రూ.25-35 చెల్లిస్తారు. ఈ ప్రాంతంలో ధిరాన్ అనే అనధికార రుణ వ్యవస్థ ఉంది. సీజన్ మొదలవగానే చిన్నకారు ఉప్పు ఉత్పత్తిదారులు ఈ సంస్థ నుండి అప్పు తీసుకుంటారు. ఉప్పు అమ్మగానే అప్పు తీరుస్తారు. ఏడాదిలో 3 వేల టన్నుల ఉప్పు తయారుచేస్తారు. అప్పులు పోనూ రూ.40 వేలు మిగులుతుంది. 'దేవ్ సాల్ట్' లాంటి సంస్థలు సముద్రపు నీటిని యంత్రాలతో మళ్ళించి ఎండబెడతాయి. వరదలు వస్తే ఉప్పు కొట్టుకు పోతుంది. అదే విధంగా అకాల వర్షాలు కురిసినప్పుడు ఉప్పు మళ్ళు ఆరవు. ఉత్పత్తి ఆలస్యమవుతుంది. కార్పొరేట్ కంపెనీలు మార్కెట్లలో టన్ను ఉప్పు రూ.4 వేలకు అమ్ముతాయి. కార్మికులకు చెల్లించేది టన్నుకు 60 రూపాయలే. ఈ శ్రమజీవుల పిల్లలు పదేళ్ళ వయసు నుండే ఉప్పు ఉత్పత్తి పనుల్లోకి దిగుతారు. స్త్రీలు, పిల్లలు ఉప్పు కర్మాగారాల్లో పనిచేస్తారు. వారికి వెయ్యి పాకెట్లకు రూ.80 ఇస్తారు. అల్పాదాయం, విద్యావకాశాల లేమి ఈ పేద కార్మికుల పిల్లల అభివృద్ధి మార్గాలను మూసేశాయి. వాళ్ళు కూడా అదే రొచ్చులో పేదరికం, అనారోగ్యాల చట్రంలో ఇరుక్కుపోయారు. తరాల తరబడి శ్రమ దోపిడీతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్ల మోడీ అభివృద్ధి నమూనాలో, ఆ తర్వాతి బిజెపి పాలనలో అగరియాలకు విద్యుత్తు, నీరు, పారిశుధ్య సౌకర్యాలు లభించలేదు. బిజెపి ప్రభుత్వం కచ్ ప్రాంతం మీదగా స్థాపించిన సుదీర్ఘ విద్యుత్ లైన్లు వాణిజ్యవేత్తలకు విద్యుత్తునిచ్చాయి గాని వీరి చీకటి బతుకుల్లో వెలుగు నింపలేదు. ప్రసిద్ధ మోర్బి జిల్లా, మాలియా తాలూకా లోనే సరైన పాఠశాలలు, నీటి వసతి, చెత్తను ఎత్తేసే ఏర్పాట్లు, విద్యుత్తు లేవు. ఉప్పు తయారీ ప్రాంతానికి దగ్గరలో ఉండిన బస్ షెల్టర్, 2001 భుజ్ భూకంపంలో కూలింది. దాన్ని బాగు చేయలేదు. ఎన్నికల సందర్భంలో కూడా మోడీ ఈ ప్రాంతానికి రాలేదు. ఇక్కడి కష్టజీవుల ఇక్కట్లను విచారించలేదు. ఎన్నికల్లో ముస్లింలను పోటీ చేయించని, ముస్లింల ఓట్లే అక్కర లేదనే మోడీ, ఈ అగారియా జాతి ముస్లింల మొహం చూస్తారా? ఈ ఉప్పు కార్మికులకు 20 నుండి 100 కి.మీ. దూరంలోని మోర్బి నగర ఆస్పత్రులే గతి. రోగులు ఆస్పత్రులకు పోడానికి రోడ్లు, రవాణా సౌకర్యాలు లేవు. మండు వేసవిలో ఉప్పు ఎడారుల్లో కఠోర కష్టం చేసే ఈ శ్రామికులు తీవ్ర జ్వరాలు, క్షయ, నిర్జలీకరణ (డీహైడ్రేషన్), గాయాల బారిన పడుతున్నారు. ఈ ప్రాంతంలో నివసించేవారే అక్కడి దారులు గుర్తించలేరు. ప్రభుత్వం ఈ ప్రాంతంలో 2009లో తొలి సర్వే జరిపింది. కార్మికులకు రబ్బరు జిగురు బూట్లు, చేతి తొడుగులు, కళ్ళజోళ్ళు, టోపీలు ఇస్తామని వాగ్దానం చేసింది. ఐతే గుర్తింపు పత్రాలు తప్పనిసరి అంది. గుర్తింపు పత్రాలు పొందడం కష్టతరమైన విషయం. అందుకే అందరికీ ఆ పరికరాలు అందలేదు. ఓడు గ్రామస్తుడు 33 ఏళ్ళ బాబుభాయి రాథోడ్ ఝింఝువాడ ప్రాంతంలో పదేళ్ళ నుండి ఉప్పు తయారీ పనిచేస్తున్నారు. ప్రభుత్వ పరికరాలు అందని ఆయన బూట్లు, గ్లోవ్స్ను రూ.900 పెట్టి కొన్నాడు. 53-54 సెల్సియస్ డిగ్రీల వేసవిలో రోజుకు 14 గంటలు పని చేయాలి. వర్షాకాలంలో ఈ ప్రదేశమంతా బురద మళ్ళుగా మారుతుంది. బురదలో మోటార్ సైకిళ్ళు నడవవు. నడక నరక యాతన. గోనె సంచులు, టార్పాలిన్లతో వేసుకున్న గుడిసెల్లోకి వాన కురిసి లోపలంతా నీరు చేరుతుంది. నిలవడానికి చోటు వుండదు. చలికాలంలో ఉష్ణోగ్రత 2 డిగ్రీలకు పడిపోతుంది. చలి నుండి రక్షణ ఉండదు. ఈ అభాగ్యులు పిల్లాపాపలతో చలిలో ఆ గుడిసెల్లోనే ముడుక్కుంటారు. ప్రభుత్వం ఈ నిరుపేదలను మరిచిపోయింది. మత సమీకరణతో హైందవ రాజకీయం నడిపే సంఫ్ుకు వీరి ఓట్లు అక్కరలేదు. అందుకే వీరిని నిర్లక్ష్యం చేశారు. నగరాల్లో ఎత్తైన భవనాల నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు పెట్టే బిజెపి ప్రభుత్వం ఈ దురదృష్టవంతులకు ఇల్లు నిర్మించలేదు. నివాస ప్రాంతాల్లో రోడ్లు వేయలేదు. 'సాహస' కార్యాలకు పేరుమోసిన మోడీ 2006లో ఉప్పు మైదానాలను కంచర గాడిదల సంరక్షణ స్థలాలుగా మార్చారు. ఉప్పు ఉత్పత్తిదారులకు ఖాళీ చేయాల్సిందిగా నోటీసిచ్చారు. వ్యాజ్యం కొనసాగుతోంది. అగరియాల ఏకైక జీవనాధారం ప్రమాదంలో పడింది. భవిష్యత్తు అనిశ్చితమయింది. యజమాని గొంగళిని తమ ఉన్నితోనే నేశారని గొర్రెలకు తెలియదు. గుజరాత్ ఆర్థిక అభివృద్ధిలో తమ శ్రమ పాత్ర ప్రధానమని మొన్నటిదాకా అగరియాలకు తెలియదు. ఇప్పుడు బోధపడింది. దాంతో అసంతృప్తి పెరిగిపోయింది. ప్రయాణ సౌకర్యాల లేమి వల్ల వీరు 15-30 కి.మీ దూరం వెళ్ళి ఓట్లెయ్యలేరు. మోడీ ''వరాలలో'' ఇదీ ఒకటి. అందుకే గుజరాత్ లో ముస్లింలు, క్రైస్తవులు, ఆదివాసీలు తదితర జాతుల భవిష్యత్తు అంధకారమే.
/వ్యాసకర్త : ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, సెల్ : 9490204545 /
సంగిరెడ్డి హనుమంత రెడ్డి