- వాంగ్యితో జాన్ కెర్రీ భేటీ
బీజింగ్ : ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య సంబంధాలను స్థిరీకరించేందుకు బైడెన్ ప్రభుత్వం కట్టుబడి వుందని అమెరికా వాతావరణ విభాగ రాయబారి జాన్ కెర్రీ చైనాకు తెలియచేశారు. ప్రస్తుతం బీజింగ్లో పర్యటిస్తున్న కెర్రీ, చైనా కమ్యూనిస్టు పార్టీ విదేశీ సంబంధాల అధిపతి వాంగ్ యితో భేటీ అయ్యారు. ప్రపంచానికి గణనీయమైన మార్పు తీసుకురాగల ప్రయత్నాలను రెండు దేశాలు కలిసి సాధించగలవని బైడెన్ ఆశిస్తున్నారని చెప్పారు. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. టారిఫ్లపై వివాదం, సాంకేతికత అందుబాటులోకి రావడం, మానవ హక్కులు ఇలా పలు అంశాలపై ఇరు పక్షాల మధ్య సంబంధాలు క్షీణించాయి. తొలుత సమావేశాన్ని ప్రారంభిస్తూ వాంగ్, కమ్యూనికేషన్ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయని, చర్చల క్రమాన్ని పునరుద్ధరిస్తే ఏ సమస్యకైనా మనం సక్రమమైన పరిష్కారం కనుగొనగలమని చైనా నమ్ముతుందని చెప్పారు. కొన్నిసార్లు చాలా చిన్న సమస్యలే పెద్దవిగా మారతాయని అన్నారు. సమాన ప్రాతిపదికన చర్చలు జరగాలని ఆయన స్పష్టం చేశారు. మరింత మెరుగైన రీతిలో సంబంధాలను మార్చుకోవడానికి ఇదొక అవకాశమని కెర్రీ వ్యాఖ్యానించారు. జిన్పింగ్తో సంబంధాలకు బైడెన్ ఎంతో విలువనిస్తారని, జిన్పింగ్ కూడా అలాగే విలువనిస్తారని భావిస్తున్నట్లు కెర్రీ చెప్పారు. అనంతరం కొత్తగా ప్రధానిగా నియమితులైన లీ కియాంగ్ను కెర్రీ కలుసుకున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మరింత తీవ్రమవుతున్న సవాలుపై చైనా, అమెరికా మరింత సన్నిహితంగా సహకరించుకోవాలన్నారు.










